మంత్రి పొంగులేటి చేస్తున్నది ఓవరాక్షనా..?
x

మంత్రి పొంగులేటి చేస్తున్నది ఓవరాక్షనా..?

పొంగులేటి ఇలా ఎక్సెంట్రిక్‌గా అంటే కాస్తంత ఓవర్ యాక్షన్ తరహాలో వ్యవహరించడం ఇదేమీ తొలిసారి కాదు.


పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. తాను చేసే కార్యక్రమాలకన్నా.. అనే వ్యాఖ్యలతోనే వార్తల్లో నిలుస్తున్న మంత్రి. ఆయన ఎక్కడ మాట్లాడినా అది హాట్ టాపిక్‌గా మారుతుంది. సున్నితంగా ఉన్న ప్రతి అంశంపై ఆయన మీడియా సమక్షంలోనే కీలక వ్యాఖ్యలు చేస్తుండటం సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రకటన ఒకటి విడుదల చేసి.. పార్టీ నేతల ఆగ్రహానికి గురయ్యారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బహిరంగంగానే పొంగులేటి తీరును తప్పుబట్టారు. అసలు ఇదేం పద్దతి అని నిలదీశారు. వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా పొంగులేటీ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అసలు ఓ నిర్ణయం తీసుకోవడానికి ముందే ఎలా ప్రకటన చేస్తారని రేవంత్ అన్నట్లు తెలుస్తోంది. దీనిపై పొంగులేటితో పర్సనల్‌గా మాట్లాడాలని కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.


అయితే పొంగులేటి ఇలా ఎక్సెంట్రిక్‌గా అంటే కాస్తంత ఓవర్ యాక్షన్ తరహాలో వ్యవహరించడం ఇదేమీ తొలిసారి కాదు. రాష్ట్రంలో కాస్తంత హాట్ హాట్‌గా నడుస్తున్న ప్రతి అంశంపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవ్వడానికి పొంగులేటి తీవ్ర ప్రయాస పడతారు. మూసీ ప్రక్షాళన అంశమప్పుడు, ధరణి పోర్టల్ మార్పు సమయంలో, ఇప్పుడు మళ్ళీ తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా పొంగులేటి కాస్తంత అతి చేశారనే ప్రజలు చర్చిస్తున్నారు.

సియోల్‌లో పొంగులేటి బాంబులు

మూసీ ప్రక్షాళన అంశం తెలంగాణలో హాట్ టాపిక్‌గా సాగుతోంది. ప్రజలకు సంక్షేమం అందించే పరిస్థితి లేని సమయంలో భారీగా ఖర్చు పెట్టి మూసీ ప్రక్షాళన అవసరమా అని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అదే విధంగా మూసీ ప్రక్షాళన పేరితో అక్కడ ఏళ్ల తరబడి నివాసం ఉంటున్న ప్రజల ఇళ్లను కూల్చడాన్ని ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆ సమయంలో అసలు మూసీని ఎలా తీర్చిదిద్దుతాం అనేది తెలపడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కొందరు జర్నలిస్ట్‌లను దక్షిణకొరియా రాజధాని సియోల్‌కు తీసుకెళ్లారు. అప్పుడు జర్నలిస్ట్‌ల బృందంతో సియోల్‌కు వెళ్లిన వారిలో మంత్రి పొంగులేటి కూడా ఉన్నారు. ఆ పర్యటన అనంతరం దక్షిణకొరియాలో మాట్లాడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటి సియోల్ లో వెంటతీసుకుపోయిన మీడియాతో మాట్లాడుతు ఒకటి, రెండు రోజుల్లోనే పొలిటికల్ బాంబులు పేలబోతున్నట్లు చెప్పారు.

ఆ బాంబుల పేలుళ్ళల్లో ప్రధాన నేతలే ఉంటారని కూడా చెప్పారు. ధరణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంతో పాటు 10 అంశాల్లో నిజాలు నిగ్గుతేల్చి విషయాలన్నింటినీ ప్రజల ముందు ఉంచబోతున్నట్లు చెప్పారు. తప్పుచేసిన వాళ్ళు ఎంత పెద్దోళ్ళయినా వదిలేదని సినిమా టైపు హెచ్చరిక చేశారు. ప్రధాన నేతలను లోపలేసేందుకు అవసరమైన ఆధారాలతో ఫైళ్ళు సిద్ధమైనట్లు కూడా పొంగులేటి చెప్పారు. కక్షసాధిపులకు తమ ప్రభుత్వం ఎప్పటికీ దిగదని అయితే చేసిన తప్పులను కూడా ఉపేక్షించేది లేదని కుండబద్దలు కొట్టకుండానే చెప్పారు. గతంలో జరిగిన తప్పులు, అవినీతి విషయంలో తాము కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితం కావటంలేదన్నారు. జరిగిన అవినీతి మొత్తానికి ఆధారాలను సేకరించి పక్కగానే చర్యలు తీసుకోబోతున్నట్లు చెప్పారు.

రెండోసారి ఆటం బాంబులు

సియోల్ వేదికగా పొంగులేటి చేసిన బాంబుల ప్రకటనే తెలంగాణలో కీలకంగా మారింది. అది జరిగిన కొన్ని రోజులకే ఆయన మరోసారి ‘ఆటం బాంబులు’ అంటూ హాట్‌టాపిక్‌గా మారారు. ‘‘గతంలో దీపావళికి బాంబులు పేలతాయని నేను మాట్లాడితే... విమర్శించిన వారు ఇప్పుడు జైలుకెళితే యోగా చేస్తానని, బయటికొచ్చాక పాదయాత్ర చేస్తానని మాట్లాడుతున్నారు. తప్పు చేసిన వారిపై త్వరలోనే ఆటం బాంబులు పేలుతాయి. విదేశాల్లో డబ్బులు దాచుకున్న వారిపై చట్ట ప్రకారం చర్యలుంటాయి’’ అని అన్నారు. ఆ సమయంలో ఫార్ములా కార్ రేసు కేసులో దర్యాప్తు శరవేగంగా సాగుతుండటంతో కేటీఆర్‌ను ఉద్దేశించే పొంగులేటి ఈ వ్యాఖ్యలు చేశారని ప్రజలంతా అభిప్రాయపడ్డారు.

‘ధరణి’లో అరెస్ట్‌లు పక్కా..!

ఆ తర్వాత ‘ధరణి’ పోర్టల్‌ను ఉద్దేశించి కూడా పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రైతులను ముంచిన పోర్టల్ ‘ధరణి’ అని పేర్కొన్నారు. ‘ధరణి’ పోర్టల్ ద్వారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుటుంబం, కోటరీ మాత్రమే బాగుపడిందని అన్నారు. కోట్ల రూపాయలు విలువైన భూములను వాళ్లు కాజేశారన్నారు. అన్నదాతల కష్టాలను కడతేర్చి వారి కన్నీళ్లు తుడిచేందుకే తమ ప్రభుత్వం భూభారతి తీసుకొస్తుందని చెప్పారు. అనంతరం ‘ధరణి’ పోర్టల్‌లో అనేక ఆక్రత్యాలు, అన్యాయాలు జరిగాయని, వాటికి సంబంధించి అతి త్వరలో అరెస్ట్‌లు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని జోస్యం చెప్పారు. ఈ వ్యాఖ్యలు కూడా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీశాయి.

ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు..

ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడీ నడుస్తోంది. ప్రతి పార్టీ కూడా ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తున్నాయి. అదే విధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అందించాలని బీఆర్ఎస్ వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే బీసీ రిజర్వేషన్లను పార్టీ పరంగా అమలు చేసేలా కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు అనేవి కాంగ్రెస్‌కు చాలా సున్నితమైన అంశంగా మారింది. అందుకే ఈ విషయంపై ఏ నేత కూడా పెద్దగా మాట్లాడటం లేదు. ఈ క్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. ‘‘స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ రావడానికి 15 రోజుల గడువు మాత్రమే ఉంది కాబట్టి గ్రామాల్లో చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే వాటిని సరిదిద్దుకుని, ఎన్నికలకు సిద్ధం కావాలి. సంక్షేమ పథకాల ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదే’’ అని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలపై పొంగులేటి చేసిన ప్రకటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో చర్చించకుండా ఎలా ప్రకటన చేస్తారని ప్రశ్నించారు. ‘‘ఒకరి మంత్రిత్వశాఖ అంశంపై మరొకరు మాట్లాడం ఏంటి? కోర్డు పరిధిలో ఉన్న అంశంపై మంత్రులు మాట్లాడేటప్పుడు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలపైనే మాట్లాడాలి. సున్నితమైన, కోర్టు పరిధిలోని అంశాలపై మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి’’ అని సూచించారు.

పదవి ఫస్ట్ కావడంతో అత్యుత్సాహమా..?

అయితే ఇలా చాలా విషయాల్లో పర్యావసానాలను అంచనా వేసుకోకుండా పొంగులేటి నోరు జారడం, లీకులు ఇవ్వడం, సంచలన వ్యాఖ్యలు చేయడం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. మంత్రి పదవిలో తొలిసారి కూర్చోవడంతో ఆయన అత్యుత్సాహ పడుతున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. మంత్రి పదవి రావడంతో ఈ ఛాన్స్‌ను గట్టిగా వినియోగించుకోవాలని, పార్టీ పెద్దల దృష్టిలో పడాలని ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఉత్సాహంతోనే అత్యుత్సాహానికి పోయి.. అనవసర చిక్కులు తెచ్చుకుంటున్నారని అంటున్నారు. మరికొందరు పొంగులేటి చేస్తున్నది ముమ్మాటికీ ఓవరాక్షనే అని అంటున్నారు. ఏ మంత్రికీ లేని దురద ఈయన ఒక్కడే ఎందుకు? అది కూడా తన శాఖ కాని అంశాలను కూడా ఈయనే ఎందుకు ప్రకటిస్తున్నారు? అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. పక్కవారి పనులను కూడా ఈయన చేస్తే అది ఓవరాక్షన్ కాక ఇంకేంటి? అని కూడా ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఇప్పటికయినా ఏ విషయం ఎక్కడ మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అనే విషయాలను దృష్టిలో పెట్టుకుంటే పొంగులేటికి మంచిదని సూచిస్తున్నారు.

Read More
Next Story