దేశ ఎన్నికల అజెండాను రేవంతే సెట్ చేశారా ?
x
Revanth Reddy

దేశ ఎన్నికల అజెండాను రేవంతే సెట్ చేశారా ?

ప్రధానమంత్రి అంతటి వ్యక్తే వివిధ రాష్ట్రాల్లో చేసిన ప్రచారంలో జనాలకు పదేపదే వివరణలు ఇచ్చుకుంటున్నారంటే ఈ అంశంలో బీజేపీ ఆత్మరక్షణలో పడిపోయిందిని అర్ధమవుతోంది


క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూసిన తర్వాత అందరికీ ఇదే అనిపిస్తోంది. ఎందుకంటే గడచిన పదిహేను రోజులుగా నరేంద్రమోడి, అమిత్ షా, కేంద్రమంత్రులు, ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు ఎక్కడ ప్రచారంచేసినా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని కేవలం మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమని గొంతుచించుకుని మరీ చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను ఎత్తేసే ఆలోచన కేంద్రప్రభుత్వానికి లేదంటే లేదని మోడి, షా తదితరులు పదేపదే వివరణ ఇచ్చుకుంటున్నారు. ప్రచారంలో వీళ్ళు మాట్లాడుతున్నదాన్ని బట్టి, ఇచ్చుకుంటున్న వివరణలను గమనిస్తే రేవంత్ పెట్టిన రిజర్వేషన్ల చిచ్చు బీజేపీని బాగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నదని అర్ధమైపోయింది. ప్రధానమంత్రి అంతటి వ్యక్తే వివిధ రాష్ట్రాల్లో చేసిన ప్రచారంలో జనాలకు పదేపదే వివరణలు ఇచ్చుకుంటున్నారంటే రిజర్వేషన్ల అంశంలో మొత్తం బీజేపీ ఎంతటి ఆత్మరక్షణలో పడిపోయిందో అర్ధమవుతోంది.

బీజేపీకి ధీటైన ఎన్నికల అజెండాను కాంగ్రెస్ పార్టీకి అందించటంలో రేవంత్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ముస్లింలకు రిజర్వేషన్లు ఎత్తేయాలన్నది మాత్రమే బీజేపీ విధానం. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో 4 శాతం రిజర్వేషన్లను రద్దుచేసి ఆ 4 శాతాన్ని వక్కలిగ, లింగాయతులకు పంచేసింది. దాని దెబ్బకు మిగిలిన అంశాలకు తోడు ముస్లింలకు రిజర్వేషన్లు రద్దుచేయటం కూడా నెగిటివ్ ప్రభావం చూపి బీజేపీ ఓడిపోయింది. అయినా సరే తమ విధానాన్ని మార్చుకోకూడదని బీజేపీ గట్టిగా నిర్ణయించుకున్నది. ఆ విషయాన్నే మొదట్లో పార్లమెంటు ఎన్నికల్లో మోడి, షా తదితరులు ప్రముఖంగా ప్రస్తావిచారు. ఈ విషయాన్ని ఆధారంచేసుకుని రేవంత్ రిజర్వేషన్ల అస్త్రాన్ని బీజేపీపై ప్రయోగించారు. ముస్లింలకు రిజర్వేషన్లు రద్దుచేయటం ఒక్కటే కాదని ఏకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా రిజర్వేషన్లను రద్దుచేయాలని బీజేపీ ప్రణాళికలు రెడీచేసుకున్నట్లు రేవంత్ ఆరోపించారు. రేవంత్ ఆరోపణలు పెద్దబాంబులాగ పేలింది.

తన ఆరోపణలకు మద్దతుగా 2003లో నూరుశాతం రిజర్వేషన్ల రద్దుకు అప్పటి బీజేపీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం చేసిన ప్రయత్నాలంటు కొన్ని ఘటనలను రేవంత్ ప్రస్తావించారు. రేవంత్ చెప్పిన ఘటనలను బీజేపీ కాదనలేకపోయింది. అలాగే ఆ విషయాన్ని ప్రస్తావించకుండా రిజర్వేషన్లు రద్దుచేసే ఆలోచన తమకు లేదంటు మోడి, షా తదితరులు పదేపదే చెప్పుకుంటున్నారు. పోటీచేస్తున్న అభ్యర్ధుల నుండి ప్రచారం చేస్తున్న ప్రముఖల వరకు రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదని పదేపదే చెప్పుకుంటున్నారు. దీంతోనే రేవంత్ చేసిన ఆరోపణలతో బీజేపీ ఎంత ఇబ్బంది పడుతోందో అర్ధమైపోతోంది. రేవంత్ ఆరోపణలు, మోడి ప్రత్యారోపణలు, వివరణల్లో సరైన క్లారిటి లేకపోవటంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఎక్కడికక్కడ మీటింగులు పెట్టుకుని రిజర్వేషన్ల అంశంపై బీజేపీకి వ్యతిరేకంగా తీర్మానాలు చేశయంటేనే రేవంత్ ఆరోపణల తీవ్రత కిందస్ధాయికి బాగా చొచ్చుకుపోయినట్లు అర్ధమవుతోంది.

ఎప్పుడైతే రేవంత్ ఆరోపణలకు, బీజేపీ పెద్దలు వివరణలు ఇచ్చుకుంటున్నారో వెంటనే కేసీయార్, కేటీయార్, హరీష్ కూడా సీనులోకి ఎంటరైపోయారు. రిజర్వేషన్ల రద్దుపై మోడి, షా ను టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. రేవంత్ చేసిన ఆరోపణలనే రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధి, మల్లికార్డున ఖర్గే లాంటి అగ్రనేతలు దేశమంతా ప్రచారంచేశారు. దాంతో కాంగ్రెస్ అనుకూల పార్టీలన్నీ రిజర్వేషన్ల రద్దుపై మోడీని వాయించేశాయి. ఇదే సమయంలో మోడితో పాటు ఎన్డీయేలోని కూటమి పార్టీలన్నీ రిజర్వేషన్ల రద్దు అంశం తమ పరిశీలనలోనే లేదని పదేపదే తమ రాష్ట్రాల్లో జనాలకు చెప్పుకుంటున్నాయి. దీంతోనే జాతీయస్ధాయిలో ఎన్నికల అజెండాను రేవంతే సెట్ చేసినట్లు అర్ధమైపోతోంది. రిజర్వేషన్ల విషయంలో రేవంత్ పెట్టిన చిచ్చు ఏపీ ఎన్నికల్లో కూడా స్పష్టంగా కనబడుతోంది.

ముస్లింలకు రిజర్వేషన్లు రద్దుచేయటంపై బీజేపీ విధానంతో చంద్రబాబునాయుడు విభేదించారు. కూటమి అధికారంలోకివస్తే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లకు కట్టుబడినట్లుగా చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించటాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. అంటే ముస్లింల రిజర్వేషన్లపైన కూటమిలోని రెండుపార్టీల నేతలు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారు. మూడోసారి మోడి ప్రధానమంత్రి అయితే మొత్తం రిజర్వేషన్లు రద్దవుతాయని కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు పదేపదే ప్రచారంచేస్తున్నారు. మొత్తానికి ఎన్నికల ఫలితాలు ఎలాగుంటాయో తెలీదు కాని దేశంమొత్తానికి ఎన్నికల అజెండాను రేవంతే సెట్ చేశారన్నది మాత్రం వాస్తవం.

Read More
Next Story