రేవంత్, కేసీఆర్, కిషన్ లో ‘జూబ్లీ’ టెన్షన్ పెరిగిపోతోందా ?
x
Revanth, KCR and Kishan Reddy

రేవంత్, కేసీఆర్, కిషన్ లో ‘జూబ్లీ’ టెన్షన్ పెరిగిపోతోందా ?

తొందరలోనే జూబ్లీహిల్స్(Jubilee Hills) అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక జరగబోతోంది.


తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీల్లోను టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. మూడుపార్టీలకు మూడురకాల టెన్షన్లు పెరిగిపోతున్న విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే తొందరలోనే జూబ్లీహిల్స్(Jubilee Hills) అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నిక జరగబోతోంది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) తరపున ఎన్నికైన ఎంఎల్ఏ మాగంటి గోపీనాథ్ ఈమధ్యనే మరణించిన విషయం అందరికీ తెలిసిందే. అనారోగ్యంతో మరణించిన ఎంఎల్ఏ నియోజకవర్గంలో తొందరలోనే ఉపఎన్నిక జరగబోతోంది. ఈనియోజకవర్గంలో గెలవటం మూడు ప్రధాన పార్టీలు అంటే అధికార కాంగ్రెస్, ప్రతిపక్షపార్టీలు బీఆర్ఎస్, బీజేపీకి సవాలుగా నిలిచింది. అందుకనే ఈనియోజకవర్గంలో గెలిచితీరాలని మూడుపార్టీలు చాలా పట్టుదలగా ఉన్నాయి.

నియోజకవర్గంలో గెలిచి తమపరిపాలనపై ప్రజలంతా సానుకూలంగా ఉన్నారని చెప్పుకోవాల్సిన అవసరం ఎనుముల రేవంత్ రెడ్డి(Rvanth reddy)కి ఉంది. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై జనాలంతా సంతృప్తిగా ఉన్నారు కాబట్టే తమకు ఓట్లేసి గెలిపించారని నిరూపించుకోవాల్సిన అవసరం రేవంత్ మీదుంది. అలాగే ఇక్కడ గెలిచి జనాలంతా రేవంత్ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారని అందుకు జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో గెలుపే నిదర్శనమని చాటి చెప్పుకోవాలని బీఆర్ఎస్ గట్టి నిశ్చయంతో ఉంది. పైగా ఈసీటు బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. ఇక్కడ గెలిస్తేనే పార్టీకి పరువు దక్కుతుంది. ఒకవేళ ఓడిపోతే ఎప్పుడు ఎన్నికలు జరిగినా 100 సీట్లలో తక్కువలేకుండా బీఆర్ఎస్ గెలుస్తుందని కేటీఆర్(KTR), హరీష్(Harish) చెబుతున్నదంతా అబద్ధాలే అని జనాలు అనుకునే అవకాశముంది. అందుకనే ఉపఎన్నికలో గెలుపు బీఆర్ఎస్ కు అత్యంత అవసరం. అలాగే ఇక్కడ గెలిస్తే జనాలంతా డబల్ ఇంజన్ సర్కార్ వైపు మొగ్గుచూపుతున్నారని బీజేపీ నేతలు ప్రచారం చేసుకునేందుకు వీలుంటుంది.

ప్రజలంతా కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకతతో ఉన్నారన్న కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్(Bandi Sanjay) కామెంట్లు నిజమే అని నిరూపించాలంటే ఉపఎన్నికలో బీజేపీ గెలిచి తీరాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన జీ కిషన్ రెడ్డి ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. కాబట్టి ఇక్కడ గెలుపు బండి సంజయ్ కన్నా కిషన్ కు వ్యక్తిగతంగా చాలా ప్రిస్టేజ్ అనిచెప్పాలి.

ఓటర్లు ఎంతమంది ?

ఈనియోజకవర్గంలో ఓటర్లు సుమారు 3.87 లక్షల మంది ఉన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అత్యంత సంపన్నులుండే ప్రాంతంగా పాపులర్ అయినా బస్తీలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఎస్సీ ఓటర్లు 21,071 మందున్నారు. ఎస్టీ ఓటర్లు సుమారు 5 వేలమంది ఉన్నారు. ముస్లిం ఓటర్లు సుమారు 1.17 లక్షలమంది ఉన్నారు. ఇతర సామాజికవర్గాల ఓటర్లు సుమారు 2.5 లక్షల మంది ఉంటారు. 2023 ఎన్నికల్లో మాగంటి గోపీకి 80,549 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేసిన ప్రముఖ క్రికెట్ ప్లేయర్ మహమ్మద్ అజహరుద్దీన్ కు 64,212 ఓట్లు, బీజేపీ అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డికి 25,886 ఓట్లు పోలయ్యాయి. అజహరుద్దీన్ మీద గోపి 16,337 ఓట్ల మెజారిటీతో గెలిచారు. గోపీకి ఇది వరసుగా మూడో గెలుపు.

ఓటర్ పర్సంటేజ్ చాలా డల్

జూబ్లీహిల్స్ నియోజకవర్గం అత్యంత ప్రముఖమైనది అనటంలో సందేహంలేదు. అయితే ఈ నియోజకవర్గంలో ఓట్లేసే జనాలు చాలా చాలా తక్కువంటే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారప్రముఖులు, సినీ సెలబ్రిటీలు, రాజకీయనేతలు, వివిధ రంగాల్లోని ప్రముఖుల్లో ఎక్కువమంది జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోనే ఉంటారు. ఇంతమంది ప్రముఖులుండే నియోజకవర్గంలో ఓటింగ్ పర్సంటేజ్ మాత్రం ఎప్పుడూ డల్లుగానే ఉంటోంది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉండటం వల్ల ఈనియోజకవర్గానికి గ్రామీణ ప్రాంతం అనేది లేదు. మామూలుగా ఏ నియోజకవర్గంలో అయిన గ్రామీణ ప్రాంతంలోనే ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఓటు వేయటానికి కూడా నియోజకవర్గంలోని ప్రముఖుల్లో చాలామంది ఇష్టపడరు. పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నమోదైన ఓటింగ్ శాతం 43.94 శాతం మాత్రమే. 2018 ఎన్నికల్లో ఓటింగ్ శాతం 44.30 శాతం అయితే 2014లో ఓటింగ్ మరీ తక్కువగా 30.78 శాతం మాత్రమే. రాష్ట్రం సమైక్యంగా ఉన్నరోజుల్లో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇక్కడ ఓట్లేసిన జనాలు 39.84 శాతం మాత్రమే.

ఇక్కడ ప్రభుత్వం ముందు పెద్ద సవాలు ఏమిటంటే జనాలందరినీ ఓటింగ్ కు వచ్చేట్లు చేయటమే. 3.84 లక్షల ఓటర్లలో కనీసం సగంమంది ఓటర్లు కూడ ఓట్లేయటానికి రావటంలేదంటే చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది. ఈ నియోజకవర్గంలోని అత్యధికులకు ఓటు విలువ బాగా తెలుసు. అయినా సరే క్యూలైన్లలో నిలబడి ఓట్లేయాలంటే చిన్నతనంగా ఫీలవుతారో లేకపోతే ఓటింగులో పాల్గొనేంత తీరికలేనంత బిజీగా ఉంటున్నారో కూడా ఎవరికీ అర్ధంకావటంలేదు. ఓటింగులో పాల్గొనే విషయంపై ఎంత ప్రచారం చేసినా, ఎన్ని చైతన్య కార్యక్రమాలు చేపట్టినా జనాలు ఓటింగుపై ఆశక్తి చూపకపోవటంపై ఎన్నికల కమీషన్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. మరి తొందరలో జరగబోయే ఉపఎన్నికలో అయినా ఓటింగ్ శాతం పెరుగుతుందో లేదో చూడాల్సిందే.

Read More
Next Story