
కేసీఆర్ విచారణ తేదీ మారింది..!
కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ ఇంకా తన చేతికి రాకపోవడంతోనే విచారణ తేదీ మార్చాలని కేసీఆర్ కోరారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ విచారణ కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ప్రస్తుతం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్కు కమిషన్ నోటీసులు కూడా జారీ చేసింది. వాటిలో జూన్ 5న విచారణకు రావాలని కేసీఆర్ను కోరింది. కాగా తాజాగా ఈ తేదీని మారుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కేసీఆర్ విచారణకు రావాల్సిన తేదీని జూన్ 5 నుంచి జూన్ 11కు మార్చింది కమిషన్. కేసీఆర్ విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాళేశ్వరం కమిషన్ తెలిపింది. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న రాజకీయ వాతావరణ నేపథ్యంలో ఈ తేదీ మారడం కీలకంగా మారింది.
నివేదిక కోసమే కేసీఆర్ విజ్ఞప్తి చేశారా..!
కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చినప్పటి నుంచి కేసీఆర్.. వరుస భేటీలతో ఫుల్ బిజీ అయ్యారు. హరీష్ రావు, కేటీఆర్లతో ఎర్రవల్లి ఫామ్హౌస్లో వరుస భేటీలు అయ్యారు. అంతేకాకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్కు పనిచేసిన మాజీ ఇంజినీర్లతో కూడా ఆయన ఫోన్లో మాట్లాడారు. దీంతో విచారణ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి కేసీఆర్ పూర్తి నివేదిక ఒకటి ఇవ్వనున్నారని సమాచారం. ఇదే సమయంలో తన విచారణ తేదీని మార్చాలంటూ కేసీఆర్ విజ్ఞప్తి చేయడం కీలకంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్ట్పై తన నివేదిక పూర్తి కాలేదని, దానిని పూర్తి చేయడం కోసం, మరింత సమాచారం సేకరించడం కోసమే కేసీఆర్ ఈ అభ్యర్థన చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్ట్కు సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ ఇంకా తన చేతికి రాకపోవడంతోనే కేసీఆర్.. తన విచారణ తేదీని మార్చాలంటూ పీసీ ఘోష్ కమిషన్ను కోరినట్లు కొందరు చెప్తున్నారు.