తెలంగాణ ‘హైడ్రా’కు  కర్ణాటక ఇంజినీర్ల ప్రశంసలు
x
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ను కలిసిన కర్ణాటక ఇంజినీర్ల బృందం

తెలంగాణ ‘హైడ్రా’కు కర్ణాటక ఇంజినీర్ల ప్రశంసలు

చెరువుల పరిరక్షణకు హైడ్రాలాంటి విభాగం దేశంలోని అన్ని రాష్ట్రాలకు అవసరమని కర్ణాటక ఇంజినీర్ల బృందం అభిప్రాయపడింది.


హైదరాబాద్ నగరంలో ఆక్రమణలకు గురైన చెరువులను పరిరక్షించి వాటిని పునరుద్ధరణ చేయడంలో హైడ్రా పనితీరును కర్ణాటక ఇంజినీర్ల బృందం ప్రశంసించింది. హైదరాబాద్ నగరంలో హైడ్రా పనితీరును బెంగళూరు లేక్స్ డిపార్ట్మెంట్ ఇంజినీర్ల బృందం పరిశీలించింది. చెరువుల పరిరక్షణ,పునరుద్ధరణ, అభివృద్ధిని క్షేత్ర స్థాయిలో కర్ణాటక ఇంజినీర్లు చూశారు. పాతబస్తీలో భమృక్ ఉద్దౌలా చెరువు,అంబర్పేటలోని బతుకమ్మకుంటను కర్ణాటక ఇంజినీర్ల బృందం సందర్శించింది.


వరదల నివారణకు నాలాలు పరిరక్షించాలి
చెరువుల పునరుద్ధరణ, అభివృద్ధి పనులు చేపట్టక ముందు, తాజా పరిస్థితులను ఈ బృందం గమనించింది.చెరువుల్లో ఆక్రమణలను తొలగించిన తీరును హైడ్రా అధికారులను అడిగి తెలుసుకుంది. నీటి జాడ లేని చెరువులను అభివృద్ధి చేసిన తీరును కర్ణాటక ఇంజినీర్లు అభినందించారు.వరదల నివారణకు చెరువుల ప్రాధాన్యం,చెరువులను అనుసంధానం చేసే నాలాలను కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడింది.



పురాతన చెరువులపై ఆసక్తి

అంబర్ పేటలో ముళ్లపొదలతో, పిచ్చి మొక్కలతో పూర్తిగా కప్పేసిన చెరువును పునరుద్ధరించిన తీరు ఆసక్తిగా ఉందని కర్ణాటక ఇంజినీర్లు చెప్పారు. ఆక్రమణలను తొలగించినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో హైడ్రా అధికారులను వారు వాకబు చేశారు. బతుకమ్మ కుంట అని పేరు ఎందుకు వచ్చింది. మరి ఆ చెరువు ఎలా పూడ్చివేశారు ఇలా అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో చెరువు పునరుద్ధరణ, అభివృద్ధిని చూసి కర్ణాటక ఇంజినీర్లు ముచ్చట పడ్డారు. పాతబస్తీలోని భమృక్ ఉద్దౌలా చెరువు గొప్పతనాన్ని అడిగి తెలుసుకున్నారు. వనమూలికల మెక్కలు, చెట్ల కొమ్మలు వేసిన ఈ చెరువు దిగువున ఊట బావి నీటిని నిజాం నవాబులు తాగునీటిగా వినియోగించిన చరిత్రను తెలుసుకుని ఆనందపడ్డారు. ఇలాంటి చరిత్ర ఉన్న చెరువులను పునరుద్ధరించిన హైడ్రాకు అభినందనలు తెలిపారు.



హైడ్రా అన్ని రాష్ట్రాలకూ అవసరం

చెరువుల సందర్శన అనంతరం కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన చీఫ్ ఇంజినీర్ హరిదాసు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు నిత్య, భూప్రద, మహదేవ్లతో పాటు ఆ రాష్ట్ర ప్రతినిధులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తో భేటీ అయ్యారు. ‘‘హైడ్రా గురించి విన్నాం.. పత్రికల్లో చదివాం.. ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. నగరంలో పూర్తిగా కనుమరుగైన, కాలుష్యం భారిన పడిన చెరువులను అభివృద్ధి చేస్తున్న తీరు బాగుంది ’’అని కర్ణాటక ఇంజినీర్లు చెప్పారు. చెరువులు, నాలాలు, పార్కుల ఆక్రమణలతోపాటు.. ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను పరిరక్షించడం కత్తిమీద సాములాంటిదని, కొద్ది కాలంలోనే చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ అంటే ఏంటో ప్రజలు తెలుసుకునేలా చేశారంటూ ప్రశంసించారు. హైడ్రా వంటి సంస్థ అన్ని రాష్ట్రాలకూ అవసరమని అన్నారు. బెంగళూరులో చెరువుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలను వారు వివరించారు. 2006వ సంవత్సరం నుంచి చెరువుల హద్దులను నిర్ధారించి ఫెన్సింగ్ వేయడం ద్వారా కబ్జా కాకుండా చూస్తున్నామన్నారు. కాలువలు కబ్జాకు గురి అవ్వడంతోనే వరదలు వస్తున్నాయని.. త్వరలోనే ఈ సమస్యకు కర్ణాటక ప్రభుత్వం పరిష్కారం చూపడానికి చర్యలు తీసుకుంటోందన్నారు.


Read More
Next Story