
‘బీజేపీ, కాంగ్రెస్లు బంద్ పేరుతో డ్రామాలు చేస్తున్నాయ్’
బీసీ బంద్కు మద్దతుగా ఖైరతాబాద్ చౌరస్తాలో జాగృతి మానవహారం.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బీసీ బంద్కు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంపూర్ణ మద్దతు తెలిపారు. జాగృతి నేతలతో కలిసి బంద్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగానే ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ, కాంగ్రెస్లపై కవిత విమర్శలు గుప్పించారు. బంద్కు వీరు మద్దతు తెలపడం, హత్య చేసిన వారే నివాళులు అర్పిస్తున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. బీసీ బిడ్డలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు.
‘‘బీసీ బిడ్డలు తమకు రిజర్వేషన్లు కావాలని కోరుతున్నారు. రిజర్వేషన్లు ఇచ్చే పార్టీలే బంద్ కు మద్దతు ప్రకటించటం నవ్వులాటగా ఉంది. దొంగ జీవోలు ఇచ్చిన కాంగ్రెస్, బీసీ బిల్లును పాస్ చేయించాల్సిన బీజేపీ లు బంద్ కు మద్దతు పేరుతో డ్రామాలు చేస్తున్నాయి. హంతకులే వచ్చి నివాళులు అర్పించినట్లు వ్యవహరిస్తున్నారు. బీసీ బిడ్డలను పదే పదే మోసం చేస్తున్నారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి బీసీలను మోసం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం మాదిరిగా మరో బీసీ ఉద్యమాన్ని చేపడతాం. తెలంగాణ బీసీ బిడ్డల పంతం దేశానికి ఆదర్శంగా నిలవాలి’’ అని పిలుపునిచ్చారు.
‘‘యూనైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో జాగృతి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. బీసీ బంద్ ను విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. బీసీల రిజర్వేషన్లు అమలు చేసేలా టెక్నికల్ గా ప్రభుత్వాలు సరైన వాదనలు వినిపించటం లేదు. ఈ కారణంగానే బీసీలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో తీర్పులు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రూల్స్ ప్రకారం జనగణన నిర్వహించలేదు. జీవో 9 విషయంలో కూడా కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు. అందుకే కోర్టు జీవో ను కొట్టేసింది. బీసీల రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీలకు చిత్తశుద్ధి లేదు. ఇప్పటికిప్పుడే ఎన్నికలు జరగాల్సినంత తొందర ఏముంది?’’ అని ప్రశ్నించారు.
‘‘మహారాష్ట్ర, తమిళనాడు లో 5 ఏళ్ల వరకు ఎన్నికలు జరగలేదు. బీసీలకు రిజర్వేషన్ల అంశం తేలిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలి. సర్పంచ్ లకు బిల్లులు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ వారిని ఇబ్బంది పెడుతోంది. బీసీ రిజర్వేషన్లను అమలు చేయాల్సిన పార్టీలు చిత్తశుద్ధి పనిచేయాలని నేను డిమాండ్ చేస్తున్నా’’ అని తెలిపారు. అనంతరం బీసీ బంద్ను ఉద్దేశించి యూపీఎఫ్ కన్వీనర్ బొల్ల శివశంకర్ మాట్లాడుతూ.. రాజ్యాధికారం కోసం బీసీలు 78 ఏళ్లుగా కొట్లాడుతున్నారన్నారు.
‘‘78 ఏళ్ల పోరాటం చేసినా కానీ రాజకీయ పార్టీలు బీసీ లను మోసం చేస్తున్నాయి. రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ డ్రామాలు చేస్తోంది. రాష్ట్రపతి వద్ద బిల్లును పాస్ చేయించకుండా బీజేపీ కూడా నాటకాలు ఆడుతోంది. బీఆర్ఎస్ కూడా కుల గణన చేయకుండా మోసం చేసింది. జూబ్లీహిల్స్ లో బీసీల ఓట్ల కోసం కాంగ్రెస్ నాటకం చేస్తోంది. ఏ పార్టీ కూడా బీసీలకు మంచి చేయటం లేదు. బీసీలు మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దొంగ మాటలు చెప్పే పార్టీలకు బీసీలంతా బుద్ది చెప్పే రోజు వస్తుంది. రిజర్వేషన్ల విషయంలో తుతు మంత్రంగా చేతులు దులుపుకునే ప్రయత్నం చేయవద్దు. బీసీలు మీ చెప్పు చేతల్లో లేరు. మీ పాపాల లెక్కను మేము రాసుకుంటాం. బీసీలను మోసం చేస్తున్న అన్ని పార్టీలకు రాబోయే రోజుల్లో బుద్ది చెబుతాం. బీసీల పట్ల మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం’’ అని స్పష్టం చేశారు.