
ఎర్రవల్లిలో కేసీఆర్, హరీష్ రావు భేటీ.. కమిషన్ గురించేనా..?
కేసీఆర్, హరీష్ రావు ఇంత హఠాత్తుగా ఎందుకు సమావేశమయ్యారు?
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. నోటీసులు వచ్చిన వంటనే హరీష్ రావు.. ఆగమేఘాలపై ఎర్రవల్లి ఫామ్హౌస్కు చేరుకున్నారు. కేసీఆర్తో గంటకుపైగా సమావేశమయ్యారు. దీంతో అసలు కేసీఆర్, హరీష్ రావు ఇంత హఠాత్తుగా ఎందుకు సమావేశమయ్యారు? కాళేశ్వరం నోటీసుల గురించి వీరు చర్చించారా? నోటీసులకు ఎలా రెస్పాండ్ కావాలన్న అంశంపై మాట్లాడుకున్నారా? ఇలా అనేక అనుమానాలు రాష్ట్రవ్యాప్తంగా చర్చలకు దారితీస్తున్నాయి. జూన్ 5న విచారణకు రావాలని కాళేశ్వరం కమిషన్ తన నోటీసుల్లో పేర్కొంది. ఎర్రవల్లిలో జరిగిన భేటీలో కమిషన్ విచారణను ఎలా ఎదుర్కోవాలి? ఎలాంటి సమాధానాలు చెప్పాలి? అసలు ఈ విచారణకు వెళ్లాలా వద్దా? ఇలాంటి విషయాలపై చర్చలు జరిగాయని సంబంధిత వర్గాలు చెప్తున్నాయి.
ఇదిలా ఉంటే కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్ విచారణ చేపట్టింది. ఇప్పటికే ఇందులో పలువురు ఉన్నతాధికారులను విచారించింది. మే 31తో కమిషన్ గడువు ముగియనుంది. ఈ విచారణలో ఇప్పటి వరకు కేసీఆర్, హరీష్ రావు, ఈటల మాత్రమే పాల్గొనలేదు. దీంతో తాజాగా ప్రభుత్వం ఈ కమిషన్ విచారణ గడువును పొడిగించింది. పొడిగించిన అనంతరం కమిషన్ వీరు ముగ్గురికి నోటీసులు జారీ చేసింది. జూన్ 5న కేసీఆర్, జూన్ 6న హరీష్ రావు, జూన్ 9న ఈటలను విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది.