హైదరాబాద్ లో తండ్రి, ఢిల్లీలో కూతురు హల్ చల్...
x

హైదరాబాద్ లో తండ్రి, ఢిల్లీలో కూతురు హల్ చల్...

టెలిఫోన్ ట్యాపింగ్, ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్ లలో దర్యాప్తు ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర రాజధానిలో కేసీఆర్, దేశ రాజధానిలో కవిత లు ఎలా చక్రం తిప్పారంటే...


అధికారాన్ని అడ్డం పెట్టుకుని తండ్రి కేసీఆర్ రాష్ట్ర రాజధానిలో, కూతురు కవిత దేశ రాజధానిలో ఎలా చక్రం తిప్పారో దర్యాప్తులో అధికారులు విస్తుపోయే విషయాలు బయటకి లాగుతున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్ కేసులు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. లిక్కర్ స్కామ్ లో కవితే కింగ్ పిన్ అని దర్యాప్తు సంస్థలు వాదిస్తుంటే... హ్యాట్రిక్ కొట్టి మరోసారి తెలంగాణ కింగ్ అయ్యేందుకు కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ని ఎలా తమ అవసరాలకి అనుగుణంగా మార్చుకున్నారో కేసులో నిందితులుగా విచారణ ఎదుర్కొంటోన్న మాజీ పోలీసు అధికారులు చెబుతున్నారు.

ఫోన్ ట్యాపింగ్: జర్నలిస్టుల నుంచి జడ్జీల దాకా...

రాజకీయ ప్రత్యర్థులు, సొంత పార్టీ నేతలు, జర్నలిస్టులు, న్యాయవాదులే కాదు... హైకోర్టు జడ్జి ఫోన్ ని సైతం బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందన్న విషయం విస్తుగొలుపుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తవ్వినకొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడమే లక్ష్యంగా పెట్టుకున్న కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడ్డారనే అంశాలు అధికారుల విచారణలో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కేసీఆర్ రాష్ట్ర సీఎం హోదాలో ఉన్నప్పుడు ఆయన ఆదేశాల మేరకు.. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు నేతృత్వంలోని మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు, ఆయన టీమ్ సభ్యులు చేసిన అకృత్యాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి.

తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ శరత్ కాజ ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ నాయిని భుజంగరావు తన నేరాన్ని అంగీకరిస్తూ ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన కేసులతో పాటు బీఆర్ఎస్ పార్టీ కీలక నేతల కేసులు ఆయన వద్ద ఉన్నందునే ఆయన ఫోన్ కాల్స్ పై నిఘా ఉంచామని భుజంగరావు వెల్లడించారు. సరైన సమయంలో అవసరాలకు అనుగుణంగా ఆయన్ను ప్రభావితం చేయడం కోసం ఆయన పర్సనల్ లైఫ్ స్టైల్, ఇతర అలవాట్లు ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకునే వాళ్లమని వివరించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాదు, బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడల్లా ఇలాంటి చర్యలకు పాల్పడేవాళ్లమని, కేసీఆర్ ప్రభుత్వానికి సహకరించామని భుజంగరావు తెలిపారు.

మునుగోడు బై ఎలక్షన్స్ లో...

"మునుగోడు బై ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ విజయం వెనుక మాదే కీలకపాత్ర. అంతకు ముందు జరిగిన దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ గెలిచిన ఊపు మీద ఉండడంతో.. పార్టీ మునుగోడులోనూ గెలిస్తే ఆ ప్రభావం 2023 అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందని కేసీఆర్ భావించారు. అందుకే అక్కడ పార్టీ విజయం కోసం మమ్మల్ని నియమించారు. మేము బీజేపీ, కాంగ్రెస్ నేతల ఫోన్లపై నిఘా పెట్టి... వారికి డబ్బులు అందకుండా అన్నిదారులూ క్లోజ్ చేశాము అని భుజంగరావు విచారణలో వెల్లడించారు.

కామారెడ్డిలోనూ నిఘా...

"గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డిలో కేసీఆర్ విజయం కోసం చాలా కష్టపడ్డాం. అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి ఫోను, ఆయన కుటుంబ సభ్యుల ఫోన్లనూ ట్యాప్ చేశాం. బీజేపీ అభ్యర్థి కె.వెంకటరమణా రెడ్డి పైనా ప్రత్యేకంగా నిఘా ఉంచాం. దీనికోసం ప్రణీత్ రావు కెఎంఆర్ (కామారెడ్డి) పేరుతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. కేసీఆర్ విజయానికి మేం అంత కష్టపడ్డా ఆయన కామారెడ్డిలో ఓడిపోయారు" అని భుజంగరావు వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్షాల ఆర్ధిక వనరులను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా ''పోల్-2021' పేరుతోనూ ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నట్లు భుజంగరావు చెప్పారు.

'యశోద' నుంచి భారీగా ఫండ్..

అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ప్రతిపక్షాల ఆర్ధిక వనరులను అడ్డుకోవడంతోపాటు, బీఆర్ఎస్ కి భారీగా పార్టీ ఫండ్ సమకూర్చేందుకూ తాము సహకరించామని భుజంగరావు స్పష్టం చేశారు. అందులో భాగంగా, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అనేక పోలీసు కేసుల్లో ప్రమేయం ఉన్న ప్రముఖుల నుంచి విరాళాలు సేకరించినట్టు తెలిపారు. "రియల్టర్ సంధ్యా శ్రీధర్ రావు రూ.15 కోట్లు విరాళం ఇవ్వగా, అందులో రూ. 13 కోట్లతో బీఆర్ఎస్ కోసం ఎన్నికల బాండ్లు కొనుగోలు చేయించాము. యశోదా ఆస్పత్రితో పాటు మరో ప్రముఖ ఆస్పత్రి నుంచి అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కి పెద్దఎత్తున పార్టీ ఫండ్ సమకూరింది. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లాం. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖులను గుర్తించి ప్రభుత్వానికి పార్టీ ఫండ్ ఇవ్వాలంటూ వారిపై ఒత్తిడి తెచ్చాం. కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల వివాదాలను బీఆర్ఎస్ నేతల సూచనలతో సెటిల్ చేశాం. దీంతో పార్టీకి భారీగా ఫండ్ వచ్చింది" అని భుజంగరావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. అలాగే, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ తర్వాత, నిరుద్యోగ సమస్యపై యువతలో ఆగ్రహం పెరిగిపోయి... కేటీఆర్ వ్యాఖ్యలను ప్రతిపక్ష నేతలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు తీవ్రంగా విమర్శించే వారు. దీంతో, ఆయన్ను విమర్శించే నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేశామని భుజంగరావు స్పష్టం చేశారు.

మూడు షిఫ్టులు... స్పెషల్ టీమ్ లు...

ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఆదేశాల మేరకే తాము పనిచేసినట్లు ట్యాపింగ్ కేసులో మరో నిందితుడుగా ఉన్న అడిషనల్ ఎస్పీ తిరుపతన్న వెల్లడించారు. కాంగ్రెస్, బీజేపీ నేతల డబ్బులు పట్టుకోవడమే ప్రధాన లక్ష్యంగా తనకు పనులు అప్పగించినట్లు తెలిపారాయన. ఈ మేరకు ఇన్స్పెక్టర్లు గట్టు మల్లు, చైతన్య, మల్లికార్జున్ ఆధ్వర్యంలో 10 మంది కానిస్టేబుళ్లు, 10 మంది హెడ్ కానిస్టేబుళ్లతో ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి మూడు షిప్టుల్లో 24/7 పనిచేసినట్లు తిరుపతన్న వెల్లడించారు. అందుకు అవసరమైన 3 సిస్టమ్స్, 9 లాగర్ రూమ్స్ ను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. రెగ్యులర్ గా 40 ముంది ఫోన్లు ట్యాప్ చేసి సమాచారాన్ని సేకరించినట్లు విచారణలో బయటపెట్టారు. ఈ పనుల కోసం 'పీవోఎల్ 2023' పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేసినట్లు వివరించారు. "కామారెడ్డి ఎన్నికల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నాకు అప్పగించిన పనితో పాటు... ప్రణీత్ కుమార్ ఇచ్చిన సమాచారం, ప్రభాకర్ రావు ఆదేశాలతో 15 ఆపరేషన్లు నిర్వహించాను" అని భుజంగరావు వెల్లడించారు.

భారీగా డబ్బులు పట్టుకున్నాం...

బీఆర్ఎన్ ప్రత్యర్థులు, కాంగ్రెస్ నాయకులు, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన డబ్బులు పట్టుకున్నట్లు తిరుపతన్న వాంగ్మూలంలో తెలిపారు. రాజగోపాల్ రెడ్డి మిత్రుడు సీహెచ్ వేణు దగ్గర రూ. 3 కోట్లు, రేవంత్ మిత్రుడు గాలి అనిల్కుమార్ కి చెందిన రూ.90 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రాఘవ ఇన్ఫ్రాకు చెందిన రూ.10.5 కోట్లు, ఎమ్మెల్వే వినోద్ కి సంబంధించి విశాఖ ఇండస్ట్రీస్ డబ్బులు రూ.50 లక్షలు, ఉత్తమ్ కుమార్ మిత్రుడు గిరిధర్ నుంచి రూ.50 లక్షలు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ఝాన్సీరెడ్డి నుంచి రూ.80 లక్షలు, రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డికి చెందిన రూ.56.84 లక్షలు (కామారెడ్డికి తరలిస్తుండగా) పట్టుకున్నట్లు చెప్పారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో తన వద్ద ఉన్న 3 కంప్యూటర్లు, 3 లాగర్స్ లో ఉన్న డేటా మొత్తాన్ని ధ్వంసం చేసినట్లు తిరుపతన్న తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఈ క్రమంలో దశాబ్దాల తరబడి సేకరించిన మావోయిస్టుల సమాచారం మొత్తం పోయిందని వెల్లడించారు.

ఇలా జాగ్రత్త పడ్డాం..

ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అక్రమాలు బయట పడకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడినట్లు డిఎస్పీ ప్రణీత్ పోలీసులకు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో కీలక విషయాలు వెల్లడించారు. "2023 అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు రాగానే స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో లో చేసిన ఇల్లీగల్ కార్యకలాపాలకి సంబంధించిన మొత్తం డేటాను ధ్వంసం చేయాలని ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్రావు అదేశించారు. దీంతో 50 హార్డ్ డిస్క్ లను తొలగించి వాటి స్థానంలో వేరే హార్డ్ డిస్క్ లు అమర్చాము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించిన 50 హార్డ్ డిస్క్ లతో పాటు, 17 కంప్యూటర్స్ ఒక ల్యాప్టాప్ లో ఉన్న సమాచారం మొత్తాన్ని డిసెంబర్ 4న ధ్వంసం చేశాం" అని ప్రణీత్ రావు పేర్కొన్నారు. ఆ సమయంలో సీసీటీవీలు పనిచేయకుండా తన టీమ్ లోని ఆర్ఎస్పై అనిల్ కుమార్ సీసీటీవీ కనెక్షన్లను రాత్రి 7.30 నుంచి 8.15 వరకు ఆసివేసినట్లు చెప్పారు. అదే రోజు ప్రభాకర్ రావు రాజీనామా చేయగా, డిసెంబర్ 18న తనకు సిరిసిల్ల డీసీఆర్బీకి బదిలీ అయిందని ప్రణీత్ రావు వాంగ్మూలంలో పేర్కొన్నారు.

కవిత సాధారణ మహిళ కాదు...

కల్వకుంట్ల కవిత సాధారణ మహిళ కాదని, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన పాత్ర ఆమెదేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి బలమైన వాదనలు వినిపించింది. ఆమె ప్రమేయం లేకపోతే సాక్ష్యాలను ఎందుకు ధ్వంసం చేశారని ఈడీ ప్రశ్నించింది. దర్యాప్త సంస్థలు తనను అక్రమంగా అరెస్టు చేశాయని, తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత వేసిన పిటిషన్లపై మంగళవారం ఢిల్లీ హైకోర్టులో న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ధర్మాసనం విచారించింది. కవిత తరఫున వాదనలు సోమవారంతో ముగియగా మంగళవారం దర్యాప్తు సంస్థలు వాదనలు వినిపించాయి. ఈడీ తరపున సీనియర్ న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపిస్తూ.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత కీలకంగా వ్యవహరించారని, ఇందుకు సంబంధించి బలమైన సాక్ష్యాలున్నాయన్నారు. కవితను విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చిన మరుసటి రోజే ఆమె ఫోన్లను ఫార్మాట్ చేశారని తెలిపారు.

ఈడీ తరపు న్యాయవాది వాదనలు...

2023 మార్చి 7న అరుణ్ పిళ్ళైని అరెస్ట్ చేశాం. నవంబరు 11న భవి తకు వ్యతిరేకంగా పికై వాంగ్మూలం ఇచ్చారు.

118 రోజుల తర్వాత కవిత ఒత్తిడితో పిళ్లై తన స్టేట్మెంట్ వెనక్కి తీసుకున్నారు. కవిత ప్రాక్సీగా సౌత్ గ్రూపు కి చెందిన ఇండో స్పిరిట్ లో పిళ్ళైకి 33 శాతం వాటాలు ఉన్నాయి.

పిళ్లై ద్వారా కవిత దాదాపు రూ.33 కోట్లు లబ్ధి పొందే ప్రయత్నం చేశారని ఆమె మాజీ ఆడిటర్ బుచ్చిబాబు చెప్పారు. ఈ డబ్బును కవిత కోసం పిళ్లై హోల్డ్ లో పెట్టారు.

రూ.32 కోట్లు కవిత కోసం, మరో రూ.4.75 కోట్లు ఇండియా ఎహెడ్ సంస్థకు మళ్లించారు. ఇండియా ఎహెడ్ కవితకు హోనింగ్ కంపెనీగా ఉంది.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితకు సంబంధం లేకుంటే ఆధారాలను ఎందుకు ధ్వంసం చేశారు.

మద్యం పాలసీ రూపకల్పన సమయంలో, ఆ తర్వాత దాదాపు రెండేండ్లపాటు వినియోగించిన ఫోన్లు సమర్పించాలని గతేడాది మార్చి 11న కవితను కోరము.

కానీ ఆమె మార్చి 21న తొమ్మిది ఫోన్లను అప్పగించారు. వీటిలో కీలక సమాచారం ఉన్న నాలుగు ఫోన్లను కవితకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఫార్మాట్ చేశారు.

మార్చి 14, 15 తేదీల్లో ఈ ఫోన్లను ఫార్మాట్ చేసి, ఆధారాలను క్లీన్ చేసినట్లు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇచ్చింది.

ఆధారాల ధ్వంసం, నిందితులపై ఒత్తిడి చేసినందుకుగాను సెక్షన్ 439 ప్రకారం కవితకు బెయిల్ మంజూరు చేయకూడదని ఈడీ తరపు న్యాయవాది కోర్టుని కోరారు. కవిత సాధారణ మహిళ కాదని, పొలిటికల్ పవర్ ఉన్న మహిళ అని చెప్పారు. ఆమె ఈ స్కాంలో కీలకంగా వ్యవహరించారని, పైగా ఒక సాక్షిని బెదిరించినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బెయిల్ విషయంలో కవిత తీరును కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ లో ఉంచారు.

Read More
Next Story