కేసీఆర్ ఫుల్లుగా క్లాసు తీసుకున్నారా ?
x
KCR at Telangana Bhavan

కేసీఆర్ ఫుల్లుగా క్లాసు తీసుకున్నారా ?

పై ఫొటోని చూస్తే క్లాసులో టీచర్ చెప్పే పాఠాన్ని విద్యార్ధులందరు శ్రద్ధగా రాసుకుంటున్న దృశ్యం గుర్తుకొస్తోంది


పై ఫొటోని చూస్తే క్లాసులో టీచర్ చెప్పే పాఠాన్ని విద్యార్ధులందరు శ్రద్ధగా రాసుకుంటున్న దృశ్యం గుర్తుకొస్తోంది. విషయం ఏమిటంటే చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణా భవన్ కు అధినేత కేసీయార్ వచ్చారు. అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వైఖరిపై మాట్లాడేందుకు కేసీఆర్ వచ్చారు. కీలకమైన ఈ మీటింగుకు పార్టీ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలంతా హాజరయ్యారు.




ఉభయసభల్లో పార్టీ అనుసరించాల్సిన వైఖరిపై కేఆయార్ ఫుల్లుగా క్లారిటి ఇచ్చినట్లున్నారు. ప్రస్తావించాల్సిన అంశాలు, లేవనెత్తాల్సిన పాయింట్లపై సవివరంగా కేసీఆర్ అందరికీ క్లాసు తీసుకున్నట్లున్నారు. అందుకనే కేసీఆర్ చెప్పిన విషయాలను ఎంఎల్ఏలు, ఎంఎల్సీలంతా చాలా శ్రద్ధగా నోట్ చేసుకున్నారు. మామూలుగా అధినేతలు చెప్పే విషయాలను ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు వినటం తప్ప ఇలాగ శ్రద్ధగా క్లాసులో పిల్లలు నోట్ చేసుకున్నట్లు చేసుకునేవాళ్ళుండరు. కాని తెలంగాణా భవన్లో మాత్రం సీన్ కంప్లీటుగా డిఫరెంటుగా కనబడింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వైఫల్యాలు, సిక్స్ గ్యారెంటీస్ అమలు విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఫెయిలైందన్న విషయంపై కేసీఆర్ క్లారిటి ఇచ్చారని పార్టీవర్గాల సమాచారం. ఇందులో కూడా ముఖ్యంగా రైతురుణమాఫీపై కాంగ్రెస్ ఇచ్చిన హామీ ఏమిటి ? అమలుచేసిందేమిటి అనే విషయమై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ చెప్పారు.




అలాగే 25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పి కేవలం 11 వేల పోస్టులతోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేయటం, నిరుద్యోగులు అడుగుతున్నట్లుగా ఇంటర్వ్యూకి 1:50కి బదులుగా 1:100 దామాషాలో అభ్యర్ధులను ఎంపికచేసే విషయంలో ప్రభుత్వ వైఖరిని ఎండగట్టాలని చెప్పారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులు, నియోజకవర్గాల్లో ఉల్లంఘిస్తున్న ప్రోటోకాల్ పైన కూడా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని చెప్పారు. నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతల వైఖరిపైన కూడా ప్రస్తావించాలని కేసీఆర్ చెప్పారు.



సమావేశంలో కేసీఆర్ చెప్పిన విషయాలను ఎంఎల్ఏలు, ఎంఎల్సీలంతా చాలా శ్రద్ధగా నోట్ చేసుకున్నారు. మరి ఈ విషయాలను ఉభయసభలో ప్రస్తావించే అవకాశం ఎంతమందికి వస్తుందో తెలీదు. అవకాశం వచ్చినా ఎంఎల్ఏలు, ఎంఎల్సీల్లో ఎంతమంది సమర్ధవంతంగా ఉపయోగించుకుంటారో చూడాలి. ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే ఎంఎల్ఏలు, ఎంఎల్సీలందరితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్, కీలక నేత హరీష్ రావు కూడా పుస్తకంలో కేసీఆర్ చెప్పిన పాయింట్లను నోట్ చేసుకోవటం.

Read More
Next Story