ఆ క్షణాలు ఊహించుకుంటే దుఃఖం వస్తుంది -కేసీఆర్
x

ఆ క్షణాలు ఊహించుకుంటే దుఃఖం వస్తుంది -కేసీఆర్

తెలంగాణ భవన్ లో రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆనాటి తెలంగాణ అనుభవాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగ ప్రసంగం ఇచ్చారు.


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. అయితే కాంగ్రెస్ సర్కార్ కి పోటీగా రాష్ట్రం సాధించిన పార్టీగా దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ సైతం పోటాపోటీగా ఏర్పాట్లు చేసింది. శనివారం సాయంత్రం అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన పార్టీ శ్రేణులు, నేడు హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మనకు మనమే కాదని.. ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు చెప్పుకోవాలని సూచించారు. కొన్ని క్షణాలు చాలా గొప్పగా ఉంటాయని.. కొన్ని క్షణాలు బాధగా ఉంటాయని అన్నారు. అవి ఊహించుకుంటే ఇప్పుడు కూడా దుఃఖం వచ్చేలా ఉందని పేర్కొన్నారు.


ప్రొఫెసర్ జయశంకర్ ఆజన్మ తెలంగాణ వాది అని.. ఇలాంటి సమయంలో ఆయన్ను స్మరించుకోకుండా ఉండలేమని కేసీఆర్ అన్నారు. '1999లో అంతకు ముందు కాలంలో తెలంగాణ అనుభవించిన బాధ ఊహించుకుంటే ఇప్పుడు దుఃఖం వచ్చే పరిస్థితి ఉంది. యావత్ తెలంగాణ కరువులు, వలసలు, కరెంట్ కోతలు, ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులకు నెలవుగా ఉండేది. సరైన వ్యూహం లేకపోవడం వల్లే 1969 ఉద్యమం విఫలమైంది. 2001లో కాదు. 1999లోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఉద్యమ రూపాలు గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఒళ్లు పులకరిస్తుంది.' అని కేసీఆర్ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు.


తెలంగాణ పాటతో పుట్టింది..

మన భాష మాట్లాడుతుంటే నవ్వుతారో ఏమో అనుకునే స్థాయి ఆనాడు ఉండేదని కేసీఆర్ అన్నారు. గతంలో తెలంగాణ అనే పదాన్ని పలకొద్దని అప్పటి స్పీకర్ అసెంబ్లీలో అన్నారని, ఇక్కడి భాష స్వచ్ఛమైన తెలుగు కాదని కొందర హేళన చేశారని గుర్తు చేశారు. 'వలసలు పోతుంటే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకులు కనీసం ఆపలేదు. స్ట్రీట్ ఫైట్ కాదు స్టేట్ ఫైట్ అయితే చేస్తా అని వచ్చా. మళ్లీ ఉద్యమం నేను మొదలుపెట్టా. అనేక పోరాటాల తర్వాత ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. పాతాళంలో ఉన్న తెలంగాణను పైకి తీసుకొచ్చాం. పాటతోనే మొత్తం తెలంగాణ చరిత్ర తెలిసేది. చరణంలోనే మొత్తం తెలవాలి. అందుకే తెలంగాణ పాటతో పుట్టింది' అని కేసీఆర్ వెల్లడించారు.


'వందశాతం మళ్ళీ బీఆర్ఎస్సే'

ఈ గులాబీ జెండాది 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం అని కేసీఆర్ అన్నారు. 'బీఆర్ఎస్ మహావృక్షం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాక కొంత నైరాశ్యంలో ఉన్నాం. ఆ తర్వాత నేను బస్సు యాత్ర మొదలుపెట్టగానే మళ్లీ అదే గర్జన కనిపించింది. మోకాళ్ల ఎత్తు కూడా లేనోళ్లు ఏదేదో మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ఖతం అయితది అంటున్నారు. వందకు వంద శాతం మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. రైతు బంధు ఊరికనే ఇవ్వలేదు. స్థిరీకరణ కోసం ఇచ్చాం. చేప పిల్లలు, గొర్రెలు ఇస్తుంటే కూడా అవమానించారు. బీఆర్ఎస్ హయాంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేశాం. ఎన్ని చేసినా కొంత విష గాలి వస్తుంది. ఆ గాలికి జనం కొంత అటు వైపు మొగ్గుచూపారు. గులాబీ జెండా పుట్టిందే తెలంగాణ రక్షణ కోసం. ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో పని చేయాలి. కరెంట్ విషయంలో ప్రభుత్వం తీరు బాధాకరం. రైతులకు విత్తనాలు గత పదేళ్లలో సక్రమంగా ఇచ్చాం. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు 105 అసెంబ్లీ సీట్లు వస్తాయ్. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ గెలిచాం. నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డి విజయం ఖరారైంది. లోక్ సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినా ఇబ్బంది లేదు. నూతన ఉద్యమ పంధా అవివాహకరించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రజల పరిరక్షణే ధ్యేయంగా పనిచేద్దాం' అంటూ కేసీఆర్ గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

Read More
Next Story