
పీసీ ఘోష్ కమిషన్ విచారణపై కేసీఆర్ కీలక నిర్ణయం ?
బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలు జరిగిందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే
జూన్ 5వ తేదీన పీసీ ఘోష్ విచారణ కమిషన్ ముందు హజరవ్వాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. మంగళవారం తనతో భేటీ అయిన పార్టీలోని కొందరు సీనియర్ నేతలతో ఈ విషయాన్ని కేసీఆర్(KCR) చెప్పినట్లు తెలిసింది. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలు జరిగిందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. ఆరోపణలపై రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ నియమించింది. ఆరోపణలపై కమిషన్ గడచిన ఏడాదిలో 110 మందిని విచారించిన తర్వాత కేసీఆర్ తో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకు కూడా నోటీసులు జారీచేసింది. జూన్ 5వ తేదీన కమిషన్ ముందు విచారణకు రావాలని నోటీసులో స్పష్టంచేసింది. విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్న విషయం ఇన్నిరోజులు సస్పెన్స్ గా ఉండిపోయింది. అలాంటిది తనను కలసిన నేతలతో మాట్లాడినపుడు విచారణకు హాజరవుతున్నట్లు కేసీఆర్ చెప్పారు. దాంతో కేసీఆర్ తర్వాత 6వ తేదీన హరీష్ రావు(Harish Rao) కూడా విచారణకు హాజరవ్వటం ఖాయమైపోయింది.