బనకచర్లతో తెలంగాణకు ఎలా నష్టం..!
x

బనకచర్లతో తెలంగాణకు ఎలా నష్టం..!

కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి వివరంగా లేఖ రాయాలన్న కిషన్ రెడ్డి.


తెలంగాణ రాజకీయాల్లో ఏపీ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. బనకచర్లతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు, కేంద్రంలోని బీజేపీ మంత్రులు ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీస్తున్నారు. బీజేపీ కావాలనే తెలంగాణను నిర్లక్ష్యం చేస్తోందని కూడా ఆరోపించారు. కాగా తాజాగా ఈ అంశంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అసలు బనకచర్ల ప్రాజెక్ట్‌పై కేంద్రం ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ‘‘బనకచర్ల మీద కేంద్రం నిర్ణయం తీసుకోలేదు. గోదావరి జలాల పంపిణీ మేరకు తెలంగాణకు అన్యాయం జరగవద్దు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ కేంద్రానికి లేఖ రాయాలని కోరుతున్నా. ఎందుకు బనకచర్ల ను నిలిపివేయాలనే దానిపై పూర్తి వివరాలతో జలవనరుల శాఖను కలవాలి. బనకచర్ల వలన తెలంగాణకి య విధంగా నష్టం జరుగుతోందో డీటెయిల్డ్ గా లేఖ రాయాలని తెలంగాణ ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సూచన. గతవారం ఏపీ ప్రభుత్వం DPR ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆ రిపోర్ట్ పరిశీలించలేదు. బనకచర్ల ప్రాజెక్ట్ రిపోర్ట్ చదవలేదు. అధ్యయనం చేసిన తరువాత నిర్ణయం తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తోంది’’ అని తెలిపారు.

బనకచర్లపై ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘కేంద్రం .. చట్ట విరుద్ధంగా.. ఏపీకి సహకరిస్తుందని అనుకోవడం లేదు. తెలంగాణ కు అన్యాయం జరిగితే.. ఎంత వరకైనా పోరాడుతాం. తెలంగాణ నీటి హక్కులకోసం రాజీలేని పోరాటం చేస్తాం.. వెనక్కి తగ్గేదేలే. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి లు కేంద్రాన్ని ఒప్పించాలి. కృష్ణాలో అన్యాయం జరుగుతుంటే పదేళ్లు బి ఆర్ ఎస్ సహకరించింది. ఉమ్మడి ఏపీలో తెలంగాణ వాటా 724tmc … ఏపీకి వెళితే.. బీఆర్ఎస్ హయాంలో 1254 టీఎంసీ లు కృష్ణా నీళ్లు తరలించారు. కాళేశ్వరంలో జరిగిన వృధా ఖర్చును చేయకుంటే.. కృష్ణా ప్రాజెక్టులు అన్ని పూర్తి అయ్యేవి. తొమ్మిది హట్టి దగ్గర కాకుండా..మేడిగడ్డ వద్ద కట్టడం ద్వారా 68 వేల కోట్లు కాళేశ్వరం అదనపు ఖర్చు అయ్యింది. కృష్ణా లో తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్‌ఎస్. 512 tmc ఏపీకి.. తెలంగాణకు 299 tmc చాలు అని సంతకం పెట్టింది బి ఆర్ ఎస్ ప్రభుత్వం కదా..? అప్పుడు మోసం చేసి.. ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు బిఆరెస్ నేతలు’’ అని కాంగ్రెస్ నేత, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు.

‘‘ఏపీ ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న బనకచర్ల ప్రాజెక్ట్‌ను సుప్రీంకోర్టుకు వెళ్లయినా అడ్డుకుంటాం. ఎలాంటి అనుమతులు లేకపోయినా ఏపీకి కేంద్రం నిధులిస్తోంది. మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కొన్ని లేఖలు రాసి చేతులు దులిపేసుకున్నారు. శ్రీశైలం కుడి కాల్వ లైనింగ్ పనులు జరుగుతున్నా.. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకొని వెళ్లమన్నా స్పందించట్లేదు. శ్రీశైలం కుడి కాల్వ లైనింగ్ పనులను వెంటనే ఆపేయాలి. బనకచర్లపై రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు నోరు మెదపట్లేదు? గోదావరి జలాలపై తెలంగాణ శాశ్వతంగా హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది. శ్రీశైలం కుడి కాల్వ లైనింగ్ పనులు పూర్తయితే రోజుకు 90వేల క్యూసెక్కుల నీటిని ఏపీకి తీసుకెళ్తారు. అదే జరిగితే హైదరాబాద్‌కు తాగడానికి చుక్క నీరు కూడా ఉండదు. కేఆర్ఎంబీ కళ్లు మూసుకుని ఏపీకి దాసోహమంటోంది’’ అని హరీష్ రావు విమర్శలు గుప్పించారు.

Read More
Next Story