సంక్రాంతి రద్దీ నియంత్రణకు ఆదేశాలు యిచ్చిన రోడ్లు భవనాల మంత్రి కోమటిరెడ్డి
x

సంక్రాంతి రద్దీ నియంత్రణకు ఆదేశాలు యిచ్చిన రోడ్లు భవనాల మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్ - విజయవాడ హైవే పై జనవరి 8 నుండి వాహన రద్దీ ఎక్కువగా వుంటుందని ఆయన తెలిపారు


సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం హైదరాబాద్ నుండి ఊర్లకు వెళ్ళే వారికి ఎదురైయ్యే రద్దీని దృష్టిలో పెట్టుకుని చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గత ఏడాది ఎదురైన అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపధ్యంలో ఈ సమీక్ష నిర్వహించారు.

హైదరాబాద్ - విజయవాడ హైవే పై జనవరి 8 నుండి వాహన రద్దీ ఎక్కువగా వుంటుందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. రోజుకు సుమారు లక్ష వాహనాలు ఈ మార్గం గుండా ప్రయాణిస్తాయని అంచనా వేస్తున్నారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

“రేపు నేను తూప్రాన్ పేట్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో ఫీల్డ్ విజిట్ చేస్తా. ఎల్బీనగర్ నుండి వనస్థలిపురం, పనామా గోడౌన్, హయత్ నగర్, రామోజీ ఫిల్మ్ సిటీ ఈ ప్రాంతాల్లో వేలాది వాహనాలు రద్దీని నివారించాలని ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్ ఆగడానికి వీల్లేదు. పండుగ రద్దీ ఉన్న రోజుల్లో లేన్‌లు మూసే పనులు, భారీ యంత్రాలతో చేసే పనులు చేయొద్దని ఆదేశించాను. అత్యవసరంగా చేయాల్సిన పనులు ట్రాఫిక్ తక్కువగా ఉండే రాత్రి వేళల్లో మాత్రమే చేయాలి. పండుగ మొదలుకానున్న తేదీకి ముందే రోడ్లపై ఉన్న మట్టి, నిర్మాణ సామగ్రి, యంత్రాలు పూర్తిగా తొలగించాలి,” అని కోమటిరెడ్డి చెప్పారు.

అన్ని రహదారులు వాహనాల రాకపోకలకు పూర్తిగా అందుబాటులో ఉంచాలి. రద్దీ ఎక్కువగా ఉండే జంక్షన్లు, టోల్ ప్లాజాలు, కీలక ప్రాంతాల్లో అదనపు పోలీసులను మోహరించి ట్రాఫిక్ మళ్లింపులు, నియంత్రణ అంశాల్లో స్థానిక ట్రాఫిక్ పోలీసులతో నిరంతరం సమన్వయం పాటించాలని ఆదేశించారు.

రోడ్డు పనులు జరుగుతున్న ప్రతి చోట పగలు, రాత్రి స్పష్టంగా కనిపించే ట్రాఫిక్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. అలాగే ఆ సిబ్బంది అందరూ ప్రతిబింబించే జాకెట్లు (పసుపు / నారింజ రంగు) ధరించాలి. రాత్రి సమయంలో జంక్షన్లు, వర్క్ జోన్‌ల వద్ద తగినంత వెలుతురు ఏర్పాటు చేయాలి. బారికేడ్లు, ట్రాఫిక్ ఐలాండ్‌లపై రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు తప్పనిసరిగా ఉపయోగించాలి. రూట్ పేట్రోల్ వాహనాలు, క్రేన్లు, అంబులెన్సులు 24 గంటలు అందుబాటులో ఉంచాలని, మంత్రి అధికారులను నిర్దేశించారు.

రూట్ పేట్రోల్ వాహనాలు, క్రేన్లు, అంబులెన్సులు 24 గంటలు అందుబాటులో ఉండాలని, రహదారి ఘటనలను ప్రత్యేక ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

సమీక్ష సమావేశంలో స్పెషల్ సిఎస్ వికాస్ రాజ్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు, నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, NHAI రీజినల్ అధికారి శివ శంకర్, MoRTH రీజినల్ అధికారి కృష్ణ ప్రసాద్, డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ ఎస్పీ, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు, ఆర్ అండ్ బి ఈ ఎన్సి లు జయభారతి, మోహన్ నాయక్, ఎస్.ఈ ధర్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Read More
Next Story