మంత్రి పొంగులేటిపై కొండామురళి రివర్స్ ఎటాక్
x
Konda Murali before Congress disciplinary committee

మంత్రి పొంగులేటిపై కొండామురళి రివర్స్ ఎటాక్

ఆధిపత్య గొడవల కారణంగానే గడచిన 15 రోజులుగా మంత్రి దంపతులకు వ్యతిరేకవర్గానికి మధ్య సంబంధాలు భగ్గుమంటున్నాయి


వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల వివాదం గాంధీభవన్ కు చేరుకున్నది. క్రమశిక్షణ కమిటి ముందు శనివారం మధ్యహ్నం మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి హాజరయ్యారు. జిల్లాలోని ముగ్గురు ఎంఎల్ఏలు, ఒక ఎంఎల్సీతో పాటు మరికొందరు సీనియర్ నేతలు మంత్రి సురేఖ(Konda Surekha) దంపతులకు వ్యతిరేకంగా జట్టుకట్టిన విషయం తెలిసిందే. తమ నియోజకవర్గాల్లో పెత్తనం చేయాలని మురళి చేస్తున్న ప్రయత్నాలకు తాము అడ్డుకుంటున్నట్లు మంత్రి వ్యతిరేకవర్గం పదేపదే చెబుతున్నారు. ఆధిపత్య గొడవల కారణంగానే గడచిన 15 రోజులుగా మంత్రి దంపతులకు వ్యతిరేకవర్గానికి మధ్య సంబంధాలు భగ్గుమంటున్నాయి. మంత్రి దంపతులకు చెక్ పెట్టేందుకే వ్యతిరేకవర్గం తెలంగాణ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) తో పాటు పార్టీ క్రమశిక్షణ కమిటి ఛైర్మన్ మల్లురవిని కలిసి ఫిర్యాదులు చేశారు.

ఆ ఫిర్యాదుల ఫలితంగానే ఈరోజు మురళి క్రమశిక్షణ కమిటి ముందు హాజరయ్యారు. కమిటి ముందు మురళి(Konda Murali) తన వాదన వినిపిస్తు ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Ponguleti Srinivasa Reddy)తో పాటు వ్యతిరేక గ్రూపులోని ఎంఎల్ఏలు, ఎంఎల్సీల మీద రివర్సులో చాలా ఆరోపణలు చేశారు. మంత్రి సురేఖ మీద పొంగులేటి వ్యక్తిగతకక్ష పెంచుకుని తమను ఇబ్బందులు పెడుతున్నట్లు ఆరోపించారు. పొంగులేటి మామగారు రామసహాయం సురేంద్రరెడ్డిని ఒకపుడు రాజకీయంగా తాను ఇబ్బందులు పెట్టానన్న కారణంగా ఇపుడు ఇన్చార్జి మంత్రి తమను ఇబ్బంది పెడుతున్నట్లు కమిటికి చెప్పారు. అలాగే తమ వ్యతిరేక గ్రూపులోని ఎంఎల్ఏలు నాయిని రాజేంద్రనాధ్ రెడ్డి, రేపూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి(Kadiyam Srihari)పైన కూడా మురళి ఆరోపణలు చేశారు. తన ఆరోపణలకు ఆధారాలను కూడా కమిటికి అందించారు. ఒక్కో ఎంఎల్ఏమీద ఉన్న ఆరోపణలు, వాటికి ఆధారాలంటు మురళి 6 పేజీల రిపోర్టును కమిటి ఛైర్మన్ కు అందించారు.

ఇదే విషయమై కమిటి మీటింగ్ తర్వాత మురళి మీడియాతో మాట్లాడుతు పార్టీలో తనకు ఎవరితోను విభేదాలు లేవన్నారు. తమను పొంగులేటి ఎలాగ ఇబ్బందులు పెడుతున్నారన్న విషయాన్ని కమిటి ముందు చెప్పినట్లు చెప్పారు. రాహూల్ గాంధీ(Rahul Gandhi) ప్రధానమంత్రి కావాలని, రేవంత్ రెడ్డి(Revanth) మళ్ళీ రెండోసారి కూడా ముఖ్యమంత్రిగా ఉండాలన్నదే తన ఏకైక లక్ష్యంగా తెలిపారు. పార్టీ బలోపేతానికి మాత్రమే తాను కష్టపడతానని చెప్పారు. తాను రెగ్యులర్ గా జనాల్లోనే ఉండే మనిషిని కాబట్టి ప్రజాబలం ఉందన్నారు. తాను కొన్ని విలువలకు కట్టుబడి ఎంఎల్సీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన విషయాన్ని గుర్తుచేశారు. తాను రాజీనామా చేశాను కాబట్టే ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ లో చేరిన వాళ్ళు తమ పదవులకు రాజీనామాలు చేయాలని చెప్పిన విషయాన్ని సమర్ధించుకున్నారు.

వ్యతిరేక గ్రూపులోని ఎంఎల్ఏల్లో బీఆర్ఎస్(BRS) కు సహకరిస్తున్నది ఎవరు ? స్ధానికంగా అక్రమవసూళ్ళకు పాల్పడుతున్నది ఎవరు ? కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నది ఎవరనే విషయాల్లో తనదగ్గరున్న ఆధారాలను కమిటికి అందించినట్లు చెప్పారు. మొత్తానికి వరంగల్ జిల్లా నేతల పంచాయితి ఇపుడు గాంధీభవన్లో హాట్ టాపిక్ గా మారి ప్రకంపనలు సృష్టిస్తోంది. మురళి వాదన విన్న క్రమశిక్షణ కమిటి తర్వాత ఏమి చేయబోతోంది అన్నది ఆసక్తిగా మారింది.

Read More
Next Story