
‘కాంగ్రెస్పై వ్యతిరేకతకు పంచాయతీ ఎన్నికలు నిదర్శనం’
ముఖ్యమంత్రే ప్రచారం చేసినా ప్రజలు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారన్న కేటీఆర్.
తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్ఎస్ మద్దతుదారులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. కాంగ్రెస్పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఈ పంచాయతీ ఎన్నికలు నిదర్శనంగా నిలిచాయన్నారు. తమ పార్టీపై ఉన్న నమ్మకాన్ని మరోసారి ప్రజలు చాటారాన్నారు. ముఖ్యమంత్రే వచ్చి ప్రచారం చేసినా కాంగ్రెస్ 44శాతం సీట్లను కూడా దాటకపోవడం ప్రభుత్వంపై ప్రజల తీరును తేటతెల్లం చేస్తోందని అన్నారు. ‘‘తొలిదశ పంచాయతీ పోరులో అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరాహోరీగా పోరాడి సర్పంచులుగా, వార్డుమెంబర్లుగా గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు’’ అని కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్వేదికగా పోస్ట్ పెట్టారు.
‘‘కాంగ్రెస్ పార్టీ హత్యారాజకీయాలకు పాల్పడినా మొక్కవోని ధైర్యంతో అధికార పార్టీ అరాచకపర్వాన్ని ఎదుర్కొని నిలబడిన గులాబీ సైనికులందరికీ ప్రత్యేకంగా అభినందనలు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాల పర్యటనల పేరిట ప్రచారం చేసినా, పోటీచేసిన చోట కనీసం 44 శాతం సీట్లను కాంగ్రెస్ దాటకపోవడం ప్రభుత్వంపై పెరిగిన ప్రజావ్యతిరేకతకు నిలువెత్తు నిదర్శనం’’ అని అన్నారు.
‘‘పంచాయతీ ఎన్నికలు అధికార పార్టీకి కొంత అనుకూలంగా ఉంటాయని తొలుత ప్రచారం జరిగినప్పటికీ రేవంత్ పరిపాలనా వైఫల్యంపై ప్రజలు పూర్తిగా విసిగిపోయారని ఈ ఎన్నికల ఫలితాలతో రుజువైపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రత్యామ్నాయం కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని, బీజేపీకి తెలంగాణలో స్థానం లేదని కూడా తొలిదశ పంచాయతీ ఫలితాలు కుండబద్దలు కొట్టి చెప్పాయి’’ అని పేర్కొన్నారు.
‘‘వచ్చే మూడేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నా పల్లెల్లో పైసా అభివృద్ధి పని జరగదని, గ్రామస్థులు నిర్ధారణకు రావడం వల్లే పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి ఇంతటి ప్రతికూల ఫలితాలు ఎదురయ్యాయి. సగం స్థానాలు కూడా కాంగ్రెస్ గెలవకపోవడం, అనేక చోట్ల 10, 20 ఓట్ల తేడాతోనే బయటపడటం చూస్తే కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ పల్లెల నుంచే ప్రారంభమైనట్టు స్పష్టంగా అర్థమైపోతోంది’’ అని వ్యాఖ్యానించారు.
‘‘రెండేళ్లు గడిచినా ఆరు గ్యారెంటీల పేరిట చేసిన సీఎం రేవంత్ మోసం, పెన్షన్ల పెంపు పేరిట చేసిన ద్రోహం, మహాలక్ష్మి పేరిట చేసిన దగా, తులం బంగారం పేరిట చేసిన నయవంచనను గ్రామీణ ప్రాంత ప్రజలు మరిచిపోలేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు తేల్చిచెప్పాయి. యూరియా బస్తాల కోసం నెలల తరబడి పడిన అగచాట్లను, బోనస్ పేరిట చేసిన బోగస్ హామీని, చివరికి పండించిన పంటను అమ్ముకోలేక పడ్డ కష్టాలను అన్నదాతలు గుర్తుపెట్టుకున్నారని ఈ ఫలితాలు రుజువుచేశాయి’’ అని అన్నారు.
పదేళ్లపాటు ప్రగతిపథంలో సాగిన పల్లెల్లో రెండేళ్లుగా పడకేసిన పాలన, గాడితప్పిన పారిశుధ్యం, చివరికి ట్రాక్టర్లలో డిజిల్ పోయలేని దుస్థితి వంటి అంశాలన్నీ పల్లె ప్రజలను ఆలోచింపజేశాయన్నారు. వాటి ఫలితమే పంచాయతీ ఎన్నికల రిజల్ట్స్ను శాసించాయన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని, పంచాయతీ ఎన్నికలతో మొదలైన కాంగ్రెస్ పతనం రానున్న రోజుల్లో పాతాళానికి పడిపోవడం ఖాయమని విమర్శించారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకూ వచ్చే ప్రతి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

