‘యూరియా యాప్ పేరుతో కాంగ్రెస్ మరో మోసం’
x

‘యూరియా యాప్ పేరుతో కాంగ్రెస్ మరో మోసం’

యూరియా యాప్‌ పేరుతో రైతులను మోసం చేయడానికి కాంగ్రెస్ మరో కుట్రపన్నిందంటున్న విమర్శలు.


కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కిండ్ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. రైతులను మరోసారి మోసం చేయడానికి కాంగ్రెస్ రెడీ అయిందన్నారు. యూరియా కోసం రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్న రైతులకు సహాయం చేయాల్సింది పోయి మోసం చేయడానికి సిద్ధమైంది ఈ ప్రభుత్వం అంటూ మండిపడ్డారు కేటీఆర్. యూరియా కోసం రైతులు కాస్తున్న పడిగాపులను ప్రజల నుంచి దాచడం కోసమే కొత్త యూరియా యాప్ అనే పన్నాగం పన్నిందని విమర్శించారు కేటీఆర్.

రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న మొబైల్ అప్లికేషన్ విధానం రైతు వ్యతిరేఖ విధానమన్నారు. కాంగ్రెస్ సర్కార్ చేతగానితనానికి 'యూరియా యాప్' ఒక నిదర్శనమని వ్యాఖ్యానించారు. తాండూరు నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.

రైతులకు అందాల్సిన రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి కీలక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కనబెట్టిందని కేటీఆర్ విమర్శించారు. సాగుకు అవసరమైన కరెంట్ సరఫరాను కూడా అస్తవ్యస్తం చేసి, అన్ని అంశాల్లో ప్రజలను పట్టిపీడిస్తోందని ధ్వజమెత్తారు. రైతాంగం పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి లేమివల్లనే నేడు పల్లెల్లో అసంతృప్తి నెలకొందని ఆయన పేర్కొన్నారు.

లైన్లను దాచే కుట్ర

రైతులకు యూరియా సరఫరా చేసే విషయంలో ప్రభుత్వం కొత్తగా తీసుకువస్తున్న మొబైల్ అప్లికేషన్ విధానాన్ని కేటీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. రైతుల అవసరాలకు తగ్గట్లుగా యూరియా సంచులను సరఫరా చేయలేక, ఇప్పుడు మొబైల్ యాప్ ద్వారా ఇస్తామని రైతులను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. ఒకప్పుడు నేరుగా దుకాణాల వద్దకే వెళ్లిన రైతులకు ఎరువులు అందించలేని ఈ చేతగాని ప్రభుత్వం, ఇప్పుడు యాప్ ద్వారా ఇస్తామంటే ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు. ఎరువుల కోసం రైతులు పడుతున్న కష్టాలు, వారి లైన్లు బయటి ప్రపంచానికి కనిపించకుండా దాచిపెట్టేందుకే ఈ 'మొబైల్ యాప్ నాటకాన్ని' కాంగ్రెస్ మొదలుపెట్టిందని ఆయన ఆరోపించారు.

అవన్నీ సర్పంచ్‌లకే చెల్లుతాయి

గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు, విధులు రాజ్యాంగం ప్రకారం సంపూర్ణంగా సర్పంచులకే చెల్లుతాయని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇందులో ఏ ఎమ్మెల్యే లేదా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకునే అధికారం లేదన్నారు. ప్రభుత్వ నిధులు ఏ నాయకుడి

సొంత ఆస్తి కాదని, ప్రజలు పన్నుల రూపంలో కట్టిన సొమ్ము అని గుర్తు చేశారు. మనం కేవలం ఆ ప్రజా ధనానికి ధర్మకర్తలుగా ఉండి, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఖర్చు చేయాలని సూచించారు.

గత కేసీఆర్ ప్రభుత్వంలో పల్లెలే పట్టుకొమ్మలనే నినాదంతో గ్రామాలను అభివృద్ధి చేశామని ఆయన గుర్తు చేశారు. 'పల్లె ప్రగతి' కార్యక్రమం ద్వారా ప్రతి నెలా నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ చేశామని, దీనివల్ల తెలంగాణ పల్లెలు దేశానికే ఆదర్శంగా నిలిచి 30 శాతం జాతీయ అవార్డులను గెలుచుకున్నాయని కొనియాడారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులోనూ గ్రామ పంచాయతీ తీర్మానమే కీలకమని, సర్పంచుల సంతకం లేకుండా ఏదీ సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్ వచ్చాక అభివృద్ధి కుంటుపడింది

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి కుంటుపడిందని కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రెండున్నర లక్షల కోట్ల అప్పు చేసినా, కనీసం ఒక్క కొత్త రోడ్డు కూడా వేయలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే నిధులు లేక ఇబ్బంది పడుతున్నారని, ఒక ఎమ్మెల్యే అప్పు కోసం ప్రపంచ బ్యాంకుకు లేఖ రాయడం రాష్ట్ర దుస్థితికి అద్దం పడుతోందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని, ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ అగ్రస్థానంలో ఉందని మండిపడ్డారు.

తాండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలంగా ఉందని, 67 మంది సర్పంచులు గెలవడం శుభపరిణామమని కేటీఆర్ అన్నారు. రాబోయే రెండేళ్లు నిధుల పరంగా కొంత ఇబ్బంది ఉన్నా, ప్రజల కోసం గట్టిగా నిలబడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, చేస్తున్న అప్పులను గ్రామగ్రామాన ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు.

Read More
Next Story