
బండి సంజయ్పై కేటీఆర్ పరువు నష్టం దావా..!
కోర్టు సమన్లు అందుకున్న కేంద్ర మంత్రి.
కేంద్రమంత్రి బండి సంజయ్పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను స్వీకరించిన న్యాయస్థానం డిసెంబర్ 15కు విచారణను వాయిదా వేసింది. విచారణకు హాజరుకావాలని బండి సంజయ్కు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తన పరువుకు భంగం కలిగించేలా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని కేటీఆర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆయన చేసినవన్నీ నిరాధారమైన వ్యాఖ్యలని తెలిపారు. ఈ మేరకు బండి సంజయ్.. తనకు బహిరంగ క్షమాపన చెప్పాలని, దాంతో పాటుగా రూ.10 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు.
బండి సంజయ్తో పాటు కొన్ని మీడియా సంస్థలు, సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. తప్పుడు, నిరాధారమైన ఆరోపణలను ప్రచురించినందుకు, ప్రసారం చేసినందుకు ఆయన ఈ దావా వేశారు. ఈ దావాలో, పరువు నష్టం కలిగించినందుకు గాను తప్పుడు సమాచారాన్ని తొలగించాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని, మరియు ₹10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. తన న్యాయవాది ఎం/ఎస్ పి.వి. జాననీ & అసోసియేట్స్ ద్వారా ఈ కేసు నమోదు చేశారు.
కేటీఆర్ ఫిర్యాదులోని ముఖ్యాంశాలు:
‘‘2025 ఆగస్టు 8న బండి సంజయ్ తప్పుడు, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలలో తెలంగాణ ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) దుర్వినియోగం, ఫోన్ ట్యాపింగ్ మరియు ఆర్థిక అవకతవకలకు కేటీఆర్ను ముడిపెట్టారు. ఏబీఎన్ తెలుగు, ఎన్టీవీ, టీవీ5, వీ6, ఏఎన్ఎన్ తెలుగు వంటి టీవీ ఛానెల్స్, అలాగే ఇండియా టుడే, ఎన్డీటీవీ, డెక్కన్ హెరాల్డ్, టైమ్స్ ఆఫ్ ఇండియా వంటి డిజిటల్ ప్లాట్ఫారమ్లు, మరియు ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్, గూగుల్, మెటా (ఫేస్బుక్/ఇన్స్టాగ్రామ్) వంటి సోషల్ మీడియా సంస్థలు ఈ వ్యాఖ్యలను విస్తృతంగా ప్రసారం చేశాయి. ఈ వ్యాఖ్యలు కేవలం పరువుకు భంగం కలిగించడమే కాకుండా, కేటీఆర్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి ఉద్దేశించినవిగా ఉన్నాయి’’ అని పేర్కొన్నారు.
‘‘2025 ఆగస్టు 11న లీగల్ నోటీసు పంపినప్పటికీ, బండి సంజయ్ బేషరతుగా క్షమాపణ చెప్పడానికి నిరాకరించారు. దీంతో కేటీఆర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బండి సంజయ్ కేవలం రాజకీయ కక్షతో "విపరీతమైన నిందారోపణలతో దుష్ప్రచారానికి" పాల్గొన్నారని ఈ ఫిర్యాదులో కేటీఆర్ పేర్కొన్నారు. అధికారంలో ఉన్న కేంద్ర మంత్రి ఇటువంటి బాధ్యతారహితమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజా ప్రతినిధుల విశ్వసనీయత, గౌరవానికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయి’’ అని ఈ ఫిర్యాదు నొక్కి చెప్పింది