
పార్లమెంట్లో బీఆర్ఎస్ లేకనే ఈ సమస్యలు: కేటీఆర్
అన్నింటికీ మందు... పోరాడే పార్టీకి పార్లమెంట్లో తగిన సీట్లు ఇవ్వడమేనని కేటీఆర్ అన్నారు.
దేశంలో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలకు పార్లమెంట్లో బీఆర్ఎస్ లాంటి పోరాడే పార్టీకి సరైన సీట్లు ఇవ్వడం ఒకటే మందు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రపంచంలోనే అత్యంత కుబేరుల మన దేశంలో ఉన్నారని, అదే విధంగా పేదరికం కూడా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తామే సుప్రీం అన్నట్లు అన్ని నిర్ణయాలకు ఏకపక్షంగా తీసుకోవడం వల్లే అనేక సమస్యలు వస్తున్నాయని అన్నారు కేటీఆర్. శనివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు, అసెంబ్లీ సమావేశాల కన్నా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అర్థవంతమైన చర్చ జరిగిందని అన్నారు. శనివారం రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ వర్ధంతి అని, ఆయన రాసిన రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చిందని అన్నారు.
‘‘'ప్రపంచమే కుగ్రామం' అనే పేరుతో అమెరికా, ఐరోపాలో తెచ్చిన చట్టాలను ఇక్కడ తెస్తే కుదరదు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లలో భాగంగా కొత్త సంస్కరణలు తెస్తున్నారు. సామాజిక స్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఏ చట్టాలు తెచ్చినా వాటిపై తిరగబడాల్సిందే. ఈ దేశంలో 92 శాతం మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. కేసీఆర్ పేదవారి సంక్షేమాన్ని ఎన్నడూ విస్మరించకుండా మానవీయ కోణంలో ఆలోచించారు. సిరిసిల్ల నేత కార్మికులను ఆదుకునేందుకు పదేళ్లలో రూ. 3500 కోట్ల మేర బతుకమ్మ చీరల తయారీకి కేసీఆర్ ఆర్డర్ ఇచ్చారు. కొందరు పిచ్చోళ్లు తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు’’ అని వ్యాఖ్యానించారు.
‘‘ప్రతిపక్షంలో ఉండగా నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ చలించిపోయి పార్టీ తరఫున ఆర్థిక సాయం చేశారు. కనీసం పాలకుల్లో చలనం వస్తుందని కేసీఆర్ ఆనాడు పార్టీ తరఫున సాయం చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పరంగా సాయం చేశారు’’ అని గుర్తు చేశారు. నాలుగు దశాబ్దాల క్రితం చైనా జీడీపీ మనకన్నా తక్కువగా ఉండేదని, ఇప్పుడు మనది నాలుగు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ అయితే, చైనాది అరవై ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించిందిన గుర్తు చేశారు. చైనా ఎప్పటికప్పుడు ప్రజలకు అనుగుణంగా నూతన విధానాలు తీసుకు రాబట్టే ఫలితాలు సాధించిందని ఆయన పేర్కొన్నారు. అలాంటి వాటిపై ఈ దేశంలో చర్చ జరగదని ఎద్దేవా చేశారు.
‘‘అన్నింటికీ మందు పోరాడే పార్టీకి పార్లమెంట్లో తగిన సీట్లు ఇవ్వడమే. లోక్సభలో బీఆర్ఎస్కు ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల కాంగ్రెస్, బీజేపీలు కలిసి ఇలాంటి చట్టాలను తెస్తున్నాయి. మోనోపలీ (ఏకాధిపత్యం) వల్ల ఎలాంటి అనర్థం జరుగుతుందో, ఇండిగో విమానయాన సంస్థ వల్ల ప్రయాణికులకు ఐదు రోజులుగా జరిగిన అసౌకర్యం ప్రత్యక్ష ఉదాహరణ’’ అని అన్నారు. అందుకే ఐదు రోజుల్లో వెయ్యి విమానాలు రద్దయ్యాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పోర్టులు, ఎయిర్పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల సంస్థలు కొంతమంది చేతుల్లో పెట్టడం వల్ల ఇలాంటి ఉపద్రవాలు వస్తున్నాయని వ్యాఖ్యానించారు.
‘‘శ్రమదోపిడీ వల్లే ఇదంతా జరిగింది. ఇండిగో ఒత్తిడికి కేంద్రమే తలొగ్గింది తప్ప, ఇండిగో తగ్గలేదు. కేంద్రం ఐదు రోజుల తర్వాత స్పందించడం వల్ల ఎయిర్పోర్టులు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లుగా మారాయి. కొత్త లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే ఇండిగో వల్ల జరిగిన అసౌకర్యం మిగతా రంగాలకు విస్తరిస్తుంది’’ అని పేర్కొన్నారు. లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఏ కార్మిక సంఘంతో కలిసి బీఆర్టీయూ (BRTU) పనిచేసినా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కేంద్రం తెచ్చిన లేబర్ కోడ్లను తెలంగాణలో అమలు కాకుండా అడ్డుకోవాలని, అదే చేస్తే దేశానికే రాష్ట్రం దిక్సూచి అవుతుందని ఆయన అన్నారు.
‘‘సోనియా గాంధీ ఢిల్లీలో వ్యతిరేకించిన బిల్లును, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అమలు చేస్తుంది? ఇక్కడి నుంచే పోరాటాన్ని మొదలుపెడదాం. ఢిల్లీలో కేంద్ర కార్మిక మంత్రిని, పార్లమెంటు స్టాండింగ్ కమిటీ సభ్యులను కలుద్దాం. లేబర్ కోడ్ల అమలు ఆపేదాకా అసెంబ్లీ, మండలి సమావేశాలు స్తంభింపజేస్తాం’’ అని హెచ్చరించారు. వరంగల్లో తదుపరి రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహిస్తామని వెల్లడించారు.

