
ఆర్టీసీ చార్జీలు ఇంత దారుణంగా పెంపా?
హైదరాబాద్ వాసులపై ముఖ్యమంత్రికి ఇంత కక్ష ఎందుకని ప్రశ్నించిన అన్నాచెల్లెళ్లు
హైదరాబాద్ సిటీ బస్సు చార్జీల పెంపు నిర్ణయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. కనీస చార్జీపై ఏకంగా 50 శాతం పెంచడం దారుణమని కేటీఆర్ అన్నారు. విద్యార్థుల బస్ పాస్ చార్జీలు, టీ-24 టికెట్ ధరలు పెంచిన ప్రభుత్వం, ఇప్పుడు సామాన్య ప్రజలపైనా భారం మోపుతోందని మండిపడ్డారు.ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనమని ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికే నిత్యావసరాల ధరల పెరుగుదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో బస్సు చార్జీలు పెంచడం వల్ల ప్రతి ప్రయాణికుడిపై నెలకు అదనంగా 500 రూపాయల భారం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఉచిత బస్సు వైఫల్యమే కారణం
ఉచిత బస్సు పథకం విఫలమవడం వల్లే ఆర్టీసీ దివాళా తీసిందని, ఇప్పుడు ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రజల నడ్డి విరుస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు.రాజధాని వాసులపై రోజుకు కోటి రూపాయల భారం మోపే ఈ నిర్ణయం, హైదరాబాద్ ప్రజలపై ముఖ్యమంత్రికి ఉన్న కక్షను స్పష్టం చేస్తోందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో పేద, మధ్యతరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొట్టాలని చూస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో బడుగుజీవులు ఎలా బతకాలో ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గ్రీన్ జర్నీ పేరుతో దగా -కవిత
ఆర్టీసీ బస్సు ఛార్జీలను పెంచడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సామాన్య ప్రజలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎందుకంత కోపమని సూటిగా ప్రశ్నించారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్' వేదికగా తన నిరసనను వ్యక్తం చేశారు."గ్రీన్ జర్నీ పేరుతో ప్రభుత్వం సామాన్యుల రక్తాన్ని పీల్చేస్తోంది. బస్సు ఎక్కడమే పాపం అన్నట్లుగా ప్రజల జేబులను గుల్ల చేస్తున్నారు" అని కవిత తన పోస్టులో తీవ్రంగా విమర్శించారు.ఇటీవలే బస్సు పాస్ల ధరలను పెంచి చిరుద్యోగులు, విద్యార్థులపై పెనుభారం మోపిన ప్రభుత్వం, ఇప్పుడు ఏకంగా బస్సు చార్జీలను అమాంతం పెంచేయడం దారుణమని ఆమె అన్నారు.చార్జీల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయాలు సామాన్యుడి నడ్డి విరిచేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story