‘పాలమూరుకు రేవంత్ చేసిందేంది ?’
x

‘పాలమూరుకు రేవంత్ చేసిందేంది ?’

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిలా కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తిన మాజీ మంత్రి కేటీఆర్.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. రేవంత్ పాలనలో తెలంగాణ అభివృద్ధి తిరోగమనం చెందుతుందంటూ ఎద్దేవా చేశారు. ఆయన రోజురోజుకు ముఖ్యమంత్రిలా కాకుండా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మారిపోతున్నారని దుయ్యబట్టారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మోసం చేశారని, ఇప్పుడు ప్రజా ఆస్తులైన 9300 ఎకరాల భూకుంభకోణానికి తెరలేపే ప్రయత్నాలు చేస్తున్నారని ఘాటు ఆరోపణలు చేశారు. అవకాశం దొరికినప్పుడల్లా పాలమూరు బిడ్డను అని చెప్పుకునే రేవంత్.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలమూరుకు ఏం చేశారని ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగానే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి అక్రమాలపై నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి హిల్ట్ పాలసీ పేరుతో మరో భారీ కుంభకోణానికి తెరలేపారని కేటీఆర్ ఆరోపించారు. మొదట మూసీ భూములు, ఆ తర్వాత రీజినల్ రింగ్ రోడ్డు, సెంట్రల్ యూనివర్సిటీ భూములపై పడ్డ రేవంత్ దృష్టి… ఇప్పుడు హైదరాబాద్ నగరంలోని పారిశ్రామిక భూములను దోచుకోవడంపై పడిందని విమర్శించారు. ఒకప్పుడు ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నుంచి పారిశ్రామికవేత్తలు చవకగా భూములు తీసుకున్నారని, ఇప్పుడు ఆ భూముల్లో అపార్ట్‌మెంట్లు, విల్లాలు కట్టుకునేందుకు రేవంత్ రెడ్డి అతి తక్కువ ధరకే అనుమతులు ఇస్తూ రియల్ దందా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దాదాపు 9300 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ, ఐదారు వందల మంది కోసం 5 లక్షల కోట్ల రాష్ట్ర ప్రజల ఆస్తిని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంలో సగం డబ్బులు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయని, ఎవరి అబ్బ సొత్తని ఈ భూములను ధారాదత్తం చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ప్రైవేట్ వ్యక్తులకు భూములను అప్పజెప్పే ఈ పాలసీని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు మోసం చేసిందని కేటీఆర్ దుయ్యబట్టారు. గత ప్రభుత్వం 24 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 17 శాతం మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. రిజర్వేషన్ల పేరుతో నాటకాలాడుతున్న కాంగ్రెస్ పార్టీకి బీసీ సోదరులు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

పాలమూరుకు రేవంత్ చేసిందేంటి

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కేసీఆర్ హయాంలో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని కేటీఆర్ గుర్తుచేశారు. వలసల జిల్లాగా పేరుబడ్డ పాలమూరులో రివర్స్ మైగ్రేషన్ సాధ్యమైందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మిగిలిన 10 శాతం పనులను కూడా రేవంత్ రెడ్డి పూర్తి చేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. నర్లాపూర్, ఏదుల, వట్టెం, కర్వెన, ఉద్దండాపూర్ వంటి రిజర్వాయర్లను పూర్తి చేసి, పంపులు ఆన్ చేసి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డనని చెప్పుకోవడం, ప్రాజెక్టులకు మామగారి పేరు పెట్టుకోవడం తప్ప… ఇప్పటివరకు రైతులకు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వలేదన్నారు.

ఎన్టీ రామారావు వంటి మహానాయకుడే కల్వకుర్తిలో ఓడిపోయారని, రాజకీయాల్లో గెలుపు–ఓటములు సహజమని కార్యకర్తలకు కేటీఆర్ ధైర్యం చెప్పారు.

కల్వకుర్తి నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యధిక వ్యవసాయ పంపుసెట్లు ఉన్న ప్రాంతమని, అక్కడ కరెంట్ కష్టాలు లేకుండా సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి 24 గంటల కరెంట్ ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్‌దేనని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కరెంట్ కోతలు, రైతుల కష్టాలు మళ్లీ మొదలయ్యాయని, ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తుచేసుకుంటున్నారని అన్నారు. చరిత్రలో ఏ ప్రభుత్వంపైనా లేనంత ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్‌పై ఉందని, ప్రజల వెంట మనం ఉంటే… వారే తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటారని అన్నారు. రానున్న రోజుల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంతో పాటు, క్షేత్రస్థాయిలో పార్టీ కమిటీలను వేసుకోబోతున్నట్లు కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, అవినీతి, హామీల వైఫల్యంపై ప్రజల్లోకి వెళ్లేలా కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజల పక్షాన పోరాడుతూ ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Read More
Next Story