
‘రేవంత్ చెప్పేవన్నీ గాలి మాటలు.. కట్టేవి గాలిలో మేడలు’
ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్లో భారీ స్కామ్ జరిగిందన్న కేటీఆర్.
తెలంగాణ ప్రభుత్వం చెప్పేవన్నీ సోది కబుర్లేనంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ గాలి మాటలు, కట్టేవన్నీ గాలి మేడలంటూ చురకలంటించారు. ప్రజాపాలనలో ప్రజలు లేకపోతే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పాలన ఏ కోణంలో కూడా ప్రజలకు మేలు చేసేదిలా లేదని విమర్శించారు. తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణలో ప్రభుత్వం అలైన్మెంట్ మార్పు వల్ల ఇబ్బందులు పడుతున్న వికారాబాద్ రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ను వికారాబాద్ రైతులు కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
వికారాబాద్కు చెందిన రైతులు మాట్లాడుతూ, ప్రభుత్వం భూసేకరణ చేసేటప్పుడు ఎందుకు తీసుకుంటున్నారో చాలా స్పష్టంగా చెప్పాలని, ఎంత తీసుకుంటున్నారో కూడా స్పష్టంగా చర్చించి చెప్పాలని అన్నారు. చట్టప్రకారం వ్యవహరించాలని, ప్రభుత్వం ఇష్టానుసారంగా భూములు లాక్కుంటామంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కచ్చితంగా భూసేకరణ చట్టం ప్రకారం భూమి సేకరణకు సంబంధించిన లక్ష్యాలు ఉండాలని, అవసరమైతే భూములను కోల్పోతున్న ప్రతి రైతుకు పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ భూములను వదిలి తమ భూములను కాపాడుకునేందుకు, ఇతర ప్రైవేట్ వ్యక్తుల భూములను ఇబ్బంది పెట్టేలా భూసేకరణ చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
గతంలో కూడా ఔటర్ రింగ్ రోడ్ అంశంలో ఇదే విధంగా సొంత అజెండాలతో ముందుకు వెళ్లిందని, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణలో కూడా…. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఒరిజినల్ అలైన్మెంట్ కాకుండా సొంత డబ్బులతో కడుతున్నామని చెప్పి తమవారి భూములను కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తోందని అన్నారు.అందుకోసం వేలాదిమంది రైతుల జీవితాలను దెబ్బతీస్తోందని విమర్శించారు. వికారాబాద్లో అలైన్మెంట్ మార్పు వల్ల భూములు కోల్పోతున్న ప్రతి ఒక్కరికీ పార్టీ తరఫున అండగా ఉంటామని, అవసరమైతే వారి తరఫున న్యాయ పోరాటం కూడా చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
వికారాబాద్ పరిధిలో భూములు కోల్పోతున్న ప్రజలు, గ్రామస్తులు అందరినీ కలుపుకొని ముందుకు పోతామని తెలిపారు. రింగ్ రోడ్డును సాధ్యమైనంతవరకు ప్రభుత్వ భూముల మీదుగా తీసుకువెళ్లాలని, పేద ప్రజల భూములకు నష్టం జరగకుండా చూడాలని అన్నారు.అవసరమైతే స్థానిక శాసనసభ్యులతో కలిసి స్పీకర్ దగ్గర కూడా మాట్లాడతానని తెలిపారు. ఈ విషయంలో పార్టీ రాజకీయాలకు గానీ, పార్టీల విభేదాలకు సంబంధం లేదని, తెలంగాణ బాగుండాలి, ప్రజలు బాగుండాలనేదే తమ ఉద్దేశమని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ బాధితుల అంశంలో ఏకం కావాలని, పేదలకు నష్టం జరగకుండా ముందుకు పోవాలని కోరారు.