KTR
x

‘కాంగ్రెస్‌ను పరిగెత్తించి కొట్టడం ఖాయం’

పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి గెలివాలంటూ ఛాలెంజ్ చేసిన కేటీఆర్.


ఫిరాయింపు నేతల అంశంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫిరాయింపు నేతలకు, కాంగ్రెస్ పార్టీకి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే పార్టీ మారిన నేతలంతా కూడా రాజీనామాలు చేసి ఉపఎన్నికలో పోటీ పడి గెలిచి తామేంటో నిరూపించుకోవాలని సవాల్ చేశారు కేటీఆర్. ఉపఎన్నికంటేనే కాంగ్రెస్ గజగజలాడుతోందని, నిజంగా వాళ్లు చెప్పుకుంటున్నంత మంచి పనులు చేస్తే ఉపఎన్నికంటే భయమెందుకని ప్రశ్నించారు. ఫిరాయింపు నేతలు కూడా రాజీనామాలు చేసి కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై పోటీ చేసి తమ సత్తా నిరూపించుకోవాలన్నారు. ఉపఎన్నిక వస్తే రేవంత్ రెడ్డా? కేసీఆరా? అనేది ప్రజలే తేలెస్తారన్నారు. తన పాలనకు రెఫరెండంగా ఉప ఎన్నికలకు వెళ్లే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ ఈ ఛాలెంజ్ చేశారు. నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని కేటీఆర్ ప్రశంసించారు. కాంగ్రెస్ నాయకుల బ్లాక్ మెయిల్ దందాల కోసమే హైడ్రా పనిచేస్తుందని ఆరోపించారు. హైడ్రా అరాచకాలతోనే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిందని విమర్శించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో చేసిన అప్పుల కంటే ఎక్కువ అప్పులను కేవలం 20 నెలల కాలంలోనే చేసిన రేవంత్ రెడ్డికి, తాను చేసిన అభివృద్ధిని చెప్పుకునే దమ్ముందా అని కేటీఆర్ నిలదీశారు.

బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనల పోలిక

‘‘కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ల కాలంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయింది. 2014లో గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారు. కేసీఆర్ సీఎం అయిన ఆరు నెలల్లోనే తీవ్ర విద్యుత్ సమస్యను పూర్తిగా పరిష్కరించి ఇళ్లలో, షాపులలో కనిపించే ఇన్వర్టర్లు, జనరేటర్లను కనిపించకుండా చేశారు. హైదరాబాద్‌ను కులం, మతం, ప్రాంతం పేరు మీద రాజకీయాలు చేయకుండా, అన్నదమ్ములుగా ఏ పంచాయతీ లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపించాం. హిందూ ఆడబిడ్డలకు దసరా కానుకలు, ముస్లిం పేదలకు రంజాన్ తోఫాలు, క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్టులు ఇచ్చి పండుగలకు ప్రాధాన్యతనిచ్చాం. తెలంగాణకు గుండెకాయగా హైదరాబాద్‌ను కేసీఆర్ మార్చారు. అందుకే 2023లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్‌కు రాకుండా, మొత్తం గులాబీ జెండాకే నగర ప్రజలు ఓట్లేశారు’’ అని కేటీఆర్ అన్నారు.

హైడ్రా అరాచకాలతో హైదరాబాద్ నగర వృద్ధి అతలాకుతలమైందని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్ లో సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా అని ప్రశ్నించారు. పేదల ఇళ్లు కూలగొడుతున్న హైడ్రా, పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని మండిపడ్డారు. కూకట్ పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ హైడ్రా తన ఇల్లు కూల్చి వేస్తుందన్న భయంతో ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల బ్లాక్ మెయిల్ దందాల కోసమే హైడ్రా పని చేస్తుందని ఆరోపించారు. పేదవాళ్ల కడుపు కొట్టడం, బిల్డర్లను బెదిరించడం, ఆర్ఆర్ టాక్స్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని ప్రధానమంత్రి స్వయంగా చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు.

కాంగ్రెస్ లెక్క బీఆర్ఎస్ దందాలు చేయలే..

‘‘బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎన్నడూ రియల్ ఎస్టేట్లో నాయకులు వేలు పెట్టలేదు. కబ్జాలు, గూండాగిరి చేయలేదు. కానీ 20 నెలల్లోనే హైడ్రా పేరుతో కాంగ్రెస్ నాయకులు అరాచకం సృష్టించారు. కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పట్టించుకోకుండా పేదల ఇళ్లు కూల్చివేశారు. బీఆర్ఎస్ పదేళ్లలో రూ.2 లక్షల 85 వేల కోట్ల అప్పు చేస్తే, రేవంత్ రెడ్డి 20 నెలల్లోనే రూ.2 లక్షల 20 వేల కోట్ల అప్పు చేశారు. కేసీఆర్ ఆ అప్పుతో హైదరాబాద్ లో 42 ఫ్లైఓవర్లు, అత్యాధునిక ఆసుపత్రులు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు కట్టారు. కానీ రేవంత్ ఒక్క కొత్త బ్రిడ్జి కానీ, మోరీ కానీ కట్టిండా? కేసీఆర్ 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.70 వేల కోట్లు వేస్తే, రూ.2 లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ ఏం చేశారు? నిలదీశారు. రూ.200 ఉన్న పెన్షన్ ను కేసీఆర్ ప్రభుత్వం రూ.2000 చేస్తే, రేవంత్ ఏం చేసిండు?’’ అని కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.

ప్రజల కోసం కాదు, స్వార్థం కోసమే

శేరిలింగంపల్లితో పాటు పార్టీ మారిన మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజల కోసం కాకుండా, తమ సొంత లాభం కోసమే కాంగ్రెస్ లోకి వెళ్లారని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ప్రజలకు మంచి చేసి ఉంటే, ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ఉత్త టైంపాస్ ముచ్చట్లు చెబుతూ, ఒకరోజు కేసీఆర్ మీద, ఇంకోరోజు తన మీద కేసులంటూ రేవంత్ పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ మహానగరానికి రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను వదల్లేదని ఆయన ప్రశంసించారు.

Read More
Next Story