
‘కేసీఆర్ సలహాలు సూచనలు చేస్తే బెటర్’
పదేళ్ల పాలనలో 7 లక్షల కోట్ల అప్పు చేసిన సన్నాసులు ఎవరో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకో కేటీఆర్ అని విమర్శించారు మహేష్ కుమార్ గౌడ్.
గవర్నర్ ప్రసంగాన్ని ఉద్దేశించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. గవర్నర్ ఇచ్చిన ప్రసంగాన్ని కేటీఆర్ ఉద్దేశపూర్వకంగా అవమానపరుస్తున్నారని అన్నారు. కేటీఆర్ మాటలు ఆయన అహంకారానికి పరాకాష్ట అని విమర్శించారు. చింత చచ్చినా పులుపు చావనట్లు.. అధికారం పోయినా బీఆర్ఎస్ వాళ్లకు అహంకారం తగ్గలేదని చురకలంటించారు. గవర్నర్కు కేటీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేరశారు. గవర్నర్లను అవమానించడం బీఆర్ఎస్ బాగా అలవాటైపోయిందంటూ గతంలో తమిళిసై, కేటీఆర్ మధ్య వివాదాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ తల్లి, రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాలను ప్యాక్ చేస్తామంటూ కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘దమ్ముంటే విగ్రహాలపై చేయి వేసి చుడు కేటీఆర్. కాంగ్రెస్ కార్యకర్తలు బట్టలూడదీసి కొడతారు. రెచ్చగొట్టే మాటలు మాట్లాడి కాంగ్రెస్ కార్యకర్తల సహనాన్ని పరీక్షించొద్దు. రైతు రుణ మాఫీ లెక్కలు తెలియకుండా కేటీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల అమలు తీరు తెలుస్తుంది. కేసీఆర్ కుటుంబం గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం, మేడిగడ్డ నాణ్యత ఏంటో బయపడినా మళ్లీ వాటి గురించి మాట్లాడడం కేటీఆర్ దిగజారుడుతనానికి నిదర్శనం’’ అని అన్నారు.
కల్వకుంట్ల ఏటీఎంలా కాళేశ్వరం
‘‘కేసీఆర్ కుటుంబం అవినీతికి కాళేశ్వరం ఒక ఏటీఎంలా ఉపయోగపడింది. కులగణనలలో తప్పుడు లెక్కలు చెబుతున్నామని అంటున్న మీరు సమగ్ర కుటుంబ సర్వే వివరాలను పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎందుకు బహిర్గతం చేయలేదు..? కేసీఆర్ ఇప్పటికైనా ప్రతి పక్షనేతగా అసెంబ్లీకి రావడాన్ని స్వాగతిస్తున్నాం. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీ హాజరై ... ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేస్తే బెటర్. రైతు ఆత్మహత్యల గురించి కేటీఆర్ మాట్లాడటానికి సిగ్గుండాలి. బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే రైతు ఆత్మహత్యలలో తెలంగాణ రెండో స్థానంలో ఉండేది. బిఆర్ఎస్ పాలనలో రైతన్నలు వరికుప్పల మీద పడి చనిపోయిన ఘటనలు ఇంకా కళ్ళముందే కదలాడుతున్నాయి’’ అని అన్నారు.
‘‘కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు దండుకుంది. కుల గణన సర్వేలో పాల్గొనకుండా సర్వేను తప్పు పట్టే అర్హత కేటీఆర్ కు లేదు. చారిత్రాత్మక నిర్ణయాలైన కుల గణన ,ఎస్సీ వర్గీకరణ చేసినందుకు అభినందించాల్సింది పోయి విమర్శలు చేయడానికి సిగ్గుండాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ముందుకు సాగుతోంది. పదేళ్ల పాలనలో 7 లక్షల కోట్ల అప్పు చేసిన సన్నాసులు ఎవరో ఒకసారి ఆత్మ విమర్శ చేసుకో కేటీఆర్. మీరు చేసిన అప్పులకే వడ్డీలు చెల్లించడానికి మళ్లీ అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురించింది. అప్పుల గురించి కేటీఆర్ మాట్లాడటం ఆయన అహంకారానికి పరాకాష్ట’’ అని విమర్శించారు.
‘‘వరంగల్ డిక్లరేషన్ హామీకి కట్టుబడి రైతు రుణ మాఫీ చేశాం. రైతు భరోసా ఇస్తున్నాం. కాంగ్రెస్ రైతుల ప్రభుత్వం అని నిరూపించుకున్నాం. ఏడాదిలో చరిత్రలో నిలిచిపోయే కుల గణన, ఎస్సీ వర్గీకరణ చేశాం. ఏడాదిలో 55 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చాం. పదేళ్లలో కార్పొరేషన్ల ను పట్టించుకున్న పాపనపోలేదు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.