బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ పై పోలీస్ కేసు
x
Source: Twitter

బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ పై పోలీస్ కేసు

బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై పోలీస్ కేసు నమోదైంది. భూమిని కబ్జా చేసేందుకు యత్నించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు


బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పై పోలీస్ కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో భూమిని కబ్జా చేసేందుకు యత్నించారంటూ నవయుగ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు బంజారా హిల్స్ పోలీసులు కేసు ఫైల్ చేశారు.


బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ లిమిటెడ్ (ఎన్ఇసిఎల్) భూమిని మాజీ ఎంపీ సంతోష్ కబ్జా చేసేందుకు ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు. కంపెనీ కొనుగోలు చేసిన సర్వే నంబర్ 129/54 స్థలంలో అక్రమంగా రెండు గదులు నిర్మించినట్లు గుర్తించారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో విచారణ చేయగా.. ఆ స్థలంలో మాజీ ఎంపీ జే సంతోష్, లింగారెడ్డి శ్రీధర్లు డోర్ నంబర్లు తయారు చేసి పన్ను చెల్లిస్తున్నట్లు తేలింది. ఫోర్జరీ డాక్యుమెంట్స్ కూడా సృష్టించినట్లు నిర్ధారించారు.

దీంతో నవయుగ కంపెనీ ప్రతినిధి చింతా మాధవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు సంతోష్ తో పాటు మరో వ్యక్తిపై కేసు నమోదు చేశారు. 420, 468, 471, 447, 120(B) రెడ్ విత్ 34 IPC కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Read More
Next Story