
కాంగ్రెస్ ఓటమికి ఫోన్ టాపింగ్ కారణమా..?
మా ఫోన్లను ట్యాప్ చేసి.. మా వ్యూహాలను ముందుగానే తెలుసుకుని కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో మంగళవారం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. సాక్షిగా పాల్గొన్నారు. ఇందులో తన వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ను ట్యాప్ చేశారంటూ ఆయన చేసిన ఫిర్యాదుకు సంబంధించే ఈరోజు సిట్ ముందు హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార దుర్వినియోగానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పరాకాష్ట అన్నారు. టెలిగ్రాఫ్ చట్టానికి బీఆర్ఎస్ ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం అత్యంత హేయమైన చర్య అన్నారు. ఈ చర్యకు పాల్పడిన కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. రాజకీయాల్లో, అధికారంలో తాము మాత్రమే ఉండాలన్న ఉద్దేశంతోనే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయించారని ఆరోపించారు. ‘‘గతంలో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఓడిపోవడానికి ఫోన్ల ట్యాపింగే కారణం. మా ఫోన్లను ట్యాప్ చేసి.. మా వ్యూహాలను ముందుగానే తెలుసుకుని కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించారు. ఫ్యాన్ ట్యాపింగ్ ద్వారా మా ప్రతి కదలికను వారు గమనించారు. ఇదే ఫిర్యాదును నేను గతంలోనూ చేశారు. ఇప్పుడు ఈ విషయంలో వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి’’ అని ఆయన పేర్కొన్నారు.
‘‘చట్టానికి వ్యతిరేకంగా ఎంతోమంది ఫోన్లను ట్యాప్ చేశారు. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లను టార్గెట్ చేశారు. సిట్ దర్యాప్తులో దాదాపు 650 మంది కాంగ్రెస్ నాయకుల పేర్లు బాధితుల జాబితాలో ఉన్నాయని తెలిసింది. కుంభం అనిల్ కుమార్ యాదవ్, గాలి అనిల్తోపాటు అనేకమంది ఫోన్లు ట్యాప్ అయినట్లు బయటికి వచ్చింది. ఇవన్నీ చూస్తుంటే, నాడు ఏ రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేసి దుశ్చర్యకు పాల్పడ్డారో అర్థమవుతోంది. ప్రజాస్వామ్యంలో నిక్కచ్చిగా పనిచేయాల్సిన అధికారులు.. రాజకీయ నాయకులకు తలొగ్గి అడుగులకు మడుగులొత్తారు. ప్రైవసీ అనేది మా ప్రాథమిక హక్కు.. దానిని కాలరాశారు. పదవీ విరమణ చేసిన ప్రభాకర్రావును దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్గా పెట్టారు. నక్సలైట్లకు సానుభూతిపరులుగా ఉన్నారని మమ్మల్ని ట్యాప్ చేయడం సిగ్గుచేటు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘అధికారం ఉంది కదా అని ఆనాడు మా ఫోన్లు ట్యాప్ చేసి మరీ రాజకీయ లబ్ది పొందాలని భావించారు. అందుకు తీవ్ర ప్రయత్నాలు కూడా చేశారు. అందుకు మీరు ముమ్మాటికీ శిక్షార్హులు. భవిష్యత్తులో మరే ప్రభుత్వం ఇలాంటి పనికి పాల్పడకూడదంటే ఇప్పుడు వీరిని శిక్షించాల్సిందే. విచారణను సజావుగా జరిపి.. రాజకీయ నాయకులైనా, అధికారులైనా ఎవరైనా సరే బాధ్యులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.