
కర్రెగుట్ట ఆపరేషన్ ఆపేయండి.. భద్రతా బలగాలకు మావోయిస్ట్ల వినతి
మావోయిస్ట్ బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ఆపరేషన్ను వెంటనే నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.
ములుగు జిల్లాలోని కర్రెగుట్టలో భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్ట్లను మట్టుబెట్టడమే లక్ష్యంగా కదంతొక్కుతున్నాయి. ఇందులో భాగంగానే వేల మంది మావోయిస్ట్లు అక్కడ ఉన్నట్లు సమాచారం రావడంతో కర్రెగుట్టను కారుమబ్బులా భద్రతా బలగాలు కమ్మేశాయి. ఏమాత్రం తప్పించుకునే అవకాశం లేకుండా మావోయిస్ట్లను చుట్టుముట్టేశాయి. దాదాపు 20వేల మంది భద్రతాబలగాల సిబ్బంది కర్రెగుట్ట ఆపరేషన్లో పాల్గొంటున్నారు. దీంతో మావోయిస్ట్లలో కంగారు మొదలైంది. తాజాగా ఈ ఆపరేషన్ను వెంటనే ఆపేయాలంటూ భద్రతా బలగాలకు విజ్ఞప్తి చేశాయి మావోల వర్గాలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలకు రావాలని కోరాయి.
మావోలు తెల్లజెండా ఎత్తేశారా..
ఆపరేషన్ కగార్లో భాగంగా కర్రెగుట్టలో చేస్తున్న ఆపరేషన్తో మావోయిస్ట్లలో ఆందోలన పెరిగిపోయింది. మావోయిస్ట్ అనేవారు కనిపించకుండా పోతారా అన్న ఆలోచన మొదలైనట్లు కనిపిస్తోంది. అందుకే మావోయిస్ట్ బస్తర్ ఇన్ఛార్జ్ రూపేష్ పేరుతో ఓ ప్రకటనను విడుదల చేశారు. అందులో తెలంగాణ సరిహద్దులో కొనసాగుతున్న ఆపరేషన్ను వెంటనే నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రకటనతో మావోయిస్ట్లు తెల్లజెండా ఎత్తేశారా అన్న చర్చ మొదలైంది. ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిలు తోకముడిచారా లేదంటే శాంతి చర్చలను కొన్నాళ్లు తమపై జరుగుతున్న దాడులను ఆపాలని యత్నిస్తున్నారా? అని చర్చలు జోరందుకుంటున్నాయి.