
మహబూబ్ నగర్ జిల్లా విషాదం
ఏ పాలకులకూ పట్టని ‘పాలమూరు గోస’
మరోసారి ‘పాలమూరు గోస’ మీద జూలై 5 ఆదివారం నాడు హైదరాబాదులోని సందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమురయ్య హాల్లో సదస్సు
-ఎం.రాఘవాచారి
ఏ పార్టీ అధికారంలో ఉన్నా, మహబూబ్నగర్ జిల్లాకు అన్యాయం చేయడమే విధానంగా కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరిగింది. పెద్ద ఎత్తున పోరాటాలు జరిగినై. ప్రత్యేక తెలంగాణా ఏర్పడ్డాక కూడా ఆ అన్యాయం కొనసాగుతూనే ఉంది.
మహబూబ్నగర్ జిల్లాకు జరిగిన అన్యాయాన్ని, మోసాన్ని తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వారిలో ప్రొఫెసర్ కె.జయశంకర్ సహా అనేకమంది చర్చకు పెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్టీలను, ప్రజలను దేశాన్ని ఒప్పించారు. కరువు, వలసలు, సాగునీటి సమస్య తీవ్ర వెనుకుబాటుతనం, నిరుద్యోగం ప్రధాన చర్చనీయాంశాలుగా వుండినై.
మన జిల్లా ప్రజలు తెలంగాణ పోరాట ఆకాంక్షలలో తమ భవిష్యత్తు చూసుకుని బలమైన ఉద్యమం నిర్మించారు. ఆర్థికంగా నిరుపేదలైన ప్రజలు తమ రెక్కల కష్టాన్ని, తమ ప్రాణాలను ఉద్యమానికి అర్పించి జై తెలంగాణ నినాదానికి ప్రాణం పోశారు.
మన జిల్లాలో జరిగిన రైతాంగ ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు, ఇక్కడి ప్రజల బతుకు పరిస్థితులు తెలుసుకోవటానికి మేధావులు ప్రజాస్వామిక వాదులు జిల్లాలోని పల్లెపల్లెకు రాకతప్పని పరిస్థితులు కల్పించినై. మన ఆవేదనలు, మేధావుల స్పందనలు, పాలమూరు కవులు రచయితలు కళాకారుల కలాలు, గళాలు ‘పాలమూరు గోస’ను ప్రపంచానికి చాటి చెప్పాయి. మీడియా కూడా మహబూబ్నగర్ దైన్యానికి కొంతస్థానం ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తొలి ప్రాధాన్యతగా మనకు మేలు జరుగుతుందని ప్రజలు భావించారు. కానీ రాష్ట్రం ఏర్పడిన తరువాత మహబూబ్నగర్కు జరుగుతూ వచ్చిన అన్యాయం తీవ్రమైనది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలుపరిచిన విధానాలనే తెలంగాణా రాష్ట్ర సమితి / భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ఫ్రభుత్వం కొనసాగిస్తున్నాయి. మన నీళ్ళు తరలిస్తున్నారు. మన సహజ వనరులు కొల్లగొడుతున్నారు. మన భూములను ఆక్రమిస్తున్నారు.
పోలేపల్లి సెజ్ వంటి కాలుష్య కారక ఫార్మా, ఇథనాల్, అమరరాజా బ్యాటరీ వంటి కంపెనీల ఏర్పాటు కోసం రైతాంగం మీద తీవ్ర అణచివేత ప్రయోగిస్తున్నారు. న్యాయమైన రైతాంగ ఉద్యమాలకు మద్దతుగా నిలిచే ప్రజాస్వామిక వాదుల మీద రౌడీషీట్లు తెరుస్తూ, అక్రమకేసులు బనాయిస్తున్నారు. ఇదంతా అభివృద్ధి పేరు మీద చేస్తున్నారు. ప్రశ్నించే వాళ్ళను ఇతర పార్టీలతో జతకట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్న వాళ్ళుగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకిలా జరుగుతున్నదో మనం మరింత గట్టిగా ప్రశ్నించాలి.
నిజానికి హైదరాబాదు రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పరచినందువల్ల తీవ్రంగా నష్టపోయింది మహబూబ్నగర్ జిల్లా. హైదరాబాదు రాజ్యంలో వివిధ రంగాలలో ప్రభావితం కలిగించడంలో తొలి స్థానంలో ఉండిన మహబూబ్నగర్ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో మూడవ శ్రేణికి నెట్టారు.
ఈ చరిత్ర ప్రొఫెసర్ కె. జయశంకర్ నోట విన్న తెలంగాణా రాష్ట్రసమితి నాయకత్వం, ప్రత్యేకించి మన జిల్లా ఎం.పిగా కేసీఆర్ను గెలిపించినందువల్ల, రాష్ట్రం ఏర్పడిన తరువాత మెజారిటీ సీట్లు తెలంగాణా రాష్ట్ర సమితికి ఇచ్చినందు వల్ల, ఆ పార్టీ మహబూబునగర్ కోసం పని చేస్తుందనుకున్నాం. ఉద్యమంలో నిజాలు తెలుసుకున్న విద్యావంతులు తెలంగాణ పునర్నిర్మాణంలో మహబూబునగర్ కష్ట నష్టాలను చర్చలో వుంచుతారనుకున్నాం. కానీ, అందుకు భిన్నంగా జరిగింది.
తెలంగాణా రాష్ట్రసమితి పార్టీ, ఆ ప్రభుత్వం మహబూబునగర్ కరువు తీరిపోయిందని, వలసలు ఆగిపోయినాయని తప్పుడు ప్రచారాలు చేశాయి. ఏ ఒక్క ఎత్తిపోతల పథకం పనులు కూడా ప్రారంభించకుండా, అంతా నేనే చేసినానని ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు నాయుడులాగా, ఏ ఒక్క ఎత్తిపోతల పథకం కూడా పూర్తి చేయకుండా, అన్నీ పూర్తి చేసి నీరు పారిస్తున్నామని అబద్దాలు ప్రచారం చేశారు.
పదిహేను ఏండ్లు పోరాడి సాధించుకున్న పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జూరాల నుండి అనేక వివాదాలున్న శ్రీశైలం ప్రాజెక్టులోకి మార్చి, జిల్లాకు శాశ్వత నష్టం చేసే విధంగా నీటిని నల్లగొండ జిల్లాకు తరలించే తప్పుడు రీడిజైనింగ్ చేశారు. కల్వకుర్తి పథకం నుండి చెంచుల కోసం అమ్రాబాద్ లిప్టు చేపడతామని చెప్పి మోసం చేశారు. అనేక తప్పుడు ప్రతిపాదనలు చేశారు.
ఇంతే కాక, జిల్లాను ఒక పద్ధతి లేకుండా అద్దం పగలేసినట్టుగా ముక్కలు ముక్కలుగా విడగొట్టారు. సాగునీటి కోసం, మండలాలు, జిల్లాల ఏర్పాటులో జిల్లా ఐక్యత కాపాడుకోవటం కోసం, మండలాలు, డివిజన్లు జిల్లాల ఏర్పాటు కోసం దీర్ఘకాలం పోరాడే పరిస్థితులు కల్పించారు. అసలు సమస్యలు చర్చకు రాకుండా దుర్మార్గానికి తెరతీశారు. జిల్లా భూములు కంపెనీలకు, రియల్ ఎస్టేట్ దందాకు అందివచ్చే చర్యలు చేపట్టి, నీటి బుడగల మీద ఇంద్ర ధనస్సులు చూపించి మురిపించారు.
శ్రీశైలంతో పాటు వివిధ పథకాల నిర్వాసితులు ఉద్యమిస్తే వాళ్ళను వేదించారు. తప్పుడు కేసులు పెట్టి లొంగదీసుకున్నారు. తెలంగాణ తెచ్చుకున్న సంతోషం జిల్లా ప్రజలకు దక్కకుండా చేశారు. ఇలాంటి అన్యాయాలు భరించలేక జిల్లా ప్రజలు కేసీఆర్ను తెలంగాణా రాష్ట్రసమితిని/ భారత రాష్ట్రసమితిని అధికారం నుంచి దించేశారు.
తెలంగాణలో మూడవ ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం గడిచినా నిర్దిష్టంగా మహబూబ్నగర్కు మేలు చేకూర్చే ఒక్క పనీ చేపట్టలేదు. జిల్లాకు దక్కవలసిన నీటిని ఏదుల నుండి జిల్లా భూములు ముంచుతూ, ఆయకట్టు భూములకు నష్టం చేస్తూ, ఏకపక్షంగా నల్లగొండ జిల్లాకు తరలిస్తున్నారు.
భారీ స్థాయిలో రైతుల గుండెల మీదుగా కాలువలు తవ్వుతున్నారు. అవే కాలుష్య కంపెనీల ఏర్పాటు, అవే భూదురాక్రమణలు, అవే మైనింగ్ పనులు నిరాఘాటంగా మరింత బలప్రయోగంతో కొనసాగిస్తున్నారు. చిత్తనూరు రైతుల మీద హింస భారత రాష్ట్రసమితి అమలు చేయగా, లగచర్ల, పెద్ద ధన్వాడ, ఉమామహేశ్వరం పేరున కాంగ్రెస్ బల్మూరు రైతుల మీద హింసను అమలు చేస్తున్నది. చంద్రసాగర్ నుండి చేపట్టవలసిన అమ్రాబాద్ ఎత్తిపోతలు వదిలేశారు. రాజోలి బండ మళ్లింపు పథకాన్ని భారత రాష్ట్రసమితి, కాంగ్రెసూ వదిలేశాయి. లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని అడ్డంపెట్టి ఎన్నికల ఆట ఆడుకుంటున్నారు. ఈ రెండు పార్టీలు కొనసాగిస్తూ వచ్చిన విధానాలు జిల్లా రైతాంగాన్ని అసైన్డ్ భూముల రైతాంగాన్ని శాశ్వత ఆందోళన వైపు నెడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ పాలకవర్గ అన్యాయాలను చర్చకు తెచ్చినప్పుడల్లా అక్కడివాళ్ళు ‘మీ తెలంగాణ వాళ్ళు ఎన్నికై పదవులు పొంది ఏం చేస్తున్నారు. మీరు వాళ్ళను ప్రశ్నించాలి’ అనేవాళ్ళు. ఇప్పుడు తెలంగాణ బుద్ధి జీవులు ‘మీ మహబూబ్నగర్ వాళ్ళు పదవులు పొంది ఏం చేస్తున్నారు. నల్లగొండకు నీరు తరలిస్తుంటే తమాషా చూస్తున్నారా. మీరు మీ లీడర్లను నిలదీయాలి’ అంటున్నారు.
మరో అడుగు ముందుకు వేసి ‘ముఖ్యమంత్రి మీ జిల్లా వాడే కదా’ అని వంకరగా నవ్వుతున్నారు. తెలంగాణ విద్యావంతులు న్యాయం మాట్లాడరా అని ప్రశ్నించవలసివస్తున్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటినుండి మహబూబ్నగర్ సాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలని మేం డిమాండ్ చేస్తున్నాం. ఏ జిల్లా సాగునీటి అవసరాలకు ఆ ఉమ్మడి జిల్లా వనరులనుండే నీరు తీసుకోవాలని సూచిస్తున్నాం. ప్రాణహిత` చేవెళ్ళ, పాలమూరు` రంగారెడ్డి ఈ పథకాలు రీడిజైన్ చేసి అసలు రంగారెడ్డి జిల్లాకే నీరు రాని దుస్థితి ఎందుకు కల్పించారని నిలదీస్తున్నాం.
కంపెనీల పేరుతో, రియల్ ఎస్టేట్ పేరుతో భూములు దురాక్రమించే కలవారికోసమే ఈ రెండు జిల్లాలకు అన్యాయం చేస్తున్నారని, అందుకే సాగునీటి చర్యలు చేపటట్టం లేదని రైతులు అంటున్నారు. నల్లగొండ రాజకీయ నేతల ఆధిపత్యం ముందు మహబూబ్నగర్ నేతలు మూడో శ్రేణిగా తేలిపోతున్నారు. తమ బలహీనతను కప్పిపెట్టుకోవడానికి పాల్పడుతున్నారు. రాజకీయ నాయకులు వెనుక వుండి పోలీసులు ముందుండి విధానాలు అమలు చేస్తున్నారు.
గడిచిన నాలుగు దశాబ్దాలలో ప్రపంచీకరణ విధానాల వల్ల జరిగినదాని కన్నా ఎక్కువ, ఇంతకు మించి జరగలేనంత విధ్వంసం జరిగిపోయింది. ప్రపంచం సరళీకరణ విధానాల నుండి వెనుకకు తిరుగుతున్నది. స్థానిక వనరులు స్థానికుల హక్కు అనే చైతన్యం వల్లనే మా నీళ్ళు, మా నిధులు, మా వనరులు మాకే అని తెలంగాణ పోరాడింది.
తెలంగాణ వచ్చింది కానీ, మన ప్రభుత్వాల పెత్తనంతోనే వనరులు తరలిపోతున్నాయి. లేదా దోపిడీ దారులు మన వనరులను ఆక్రమిస్తున్నారు. ఈ పదకొండు ఏండ్లలో గుజరాత్, రాజస్థాన్ మార్వడీలు, స్థానికేతరులు మన భూములను, మన వ్యాపారాలను, ఉద్యోగాలను తమ చేతిలోకి తీసుకోవటం పెరిగింది.
మన జిల్లాలో చిన్న మధ్యతరగతి రైతులు, వ్యాపారులు, నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇవే పరిస్థితులు కొనసాగితే అభివృద్ధి ప్రమాణాల పరిశీలనలో ఉమ్మడి మహబూబ్నగర్ శాశ్వతంగా చివరి వరుసలోనే మిగిలిపోతుంది.
విద్య, వైద్య రంగ వ్యాపారాలతో వచ్చే సవాళ్ళు అందరికీ ఒకటే అనిపించినప్పటికీ, అవి వెనుకబడిన వర్గాలను, ప్రాంతాలను మరింతగా విధ్వంసం చేస్తాయి. ప్రభుత్వాలకు లిక్కర్ దందాతో వచ్చే ఆదాయం దాదాపు నలభైవేల కోట్లకు చేరిందంటున్నారు. ఈ వ్యాపారానికి నిరుపేద కుటుంబాలు బలవుతున్నాయి. ఈ అక్రమ ఆర్జనలతో సమాజంలో హింస పెరిగిపోతున్నది. ఈ ప్రభావం జిల్లా ప్రజానీకాన్ని మునుపెన్నడూ లేని విధంగా కష్టనష్టాలకు గురి చేస్తున్నది.
‘పాలమూరు గోస’ను నిరంతరం చర్చకు తెస్తూ, ప్రభుత్వాలకు వివరిస్తున్న మేము, మరోసారి తెలంగాణ సమాజం ముందు ఈ పరిస్థితిని చర్చకు తీసుకురావాలని భావించాం. ఇందుకోసం 2025 జూలై 5న హైదరాబాదులోని సందరయ్య విజ్ఞాన కేంద్రం దొడ్డి కొమురయ్య హాల్లో ఒక రోజంతా సదస్సు జరుపుతున్నాం.
మహబూబ్నగర్ జిల్లా వంటి వెనుకకు నెట్టిన ప్రాంతాల ప్రయోగక్షేత్రాలుగా మిగలవలసిందేనా అని ప్రశ్నిస్తున్నాం. ఈ అన్యాయాన్ని చర్చించాలని మాతో గొంతు కలపాలని తెలంగాణ బిడ్డలందరినీ కోరుతున్నాం.
(-ఎం.రాఘవాచారి, పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్)
Next Story