
మెరుగైన వృద్ధికి విధనాలను మార్చాలి: మాంటేక్ సింగ్ అహ్లూవాలియా
ట్రంప్ అమెరికా నేతృత్వం లోని ఏక దృవ ప్రపంచం; చైనా నుండి ముప్పును కూడా దృష్టిలో పెట్టుకోవాలి
దేశం ప్రస్తుతం ఎదుగుతున్న 6.5 శాతం ఆర్థిక వృద్ధిరేటును నిలబెట్టుకుని 8 శాతానికి చేరుకోవటానికి మారుతున్న ప్రపంచ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తన విధనాలను రూపొందించుకోవాలని మాజీ ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్ మాంటేక్ సింగ్ అహ్లూవాలియా అన్నారు. ప్రపంచీకరణ తనకు అనుకూలంగా లేదని ఆ ప్రక్రియను తిరగదోడే చర్యలు మరింత దూకుడుగా చేపడుతున్న ట్రంప్ అమెరికా, దేశానికి భద్రత ముప్పుగా పరిణమిస్తున్న చైనా ను దృష్టిలో పెట్టుకుని మన విధానాలను రూపొందించుకోవాలని అన్నారు.
ఆయన ఈ వ్యాఖ్యలు ‘వేగంగా మారుతున్న ప్రపంచం లో విధానాల రూపకల్పన లో సవాళ్ళు’ అనే అంశం పైన హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ లో జరిగిన బీపీఆర్ విఠల్ సెమినార్ లో చేశారు. “వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా ప్రస్తుతం చైనా ఉన్న దశకు చేరుకోవలంటే మనం 8 శాతం వృద్ధి రేటు సాధించాలి. ఆ లక్ష్యం చేరుకోవటానికి మనకు ఎన్నో అడ్డంకులు ఉన్నాయి. మన దేశంలో తలసరి ఆదాయం చైనా లో నాలుగో వంతు మాత్రమే. మనం కచ్చితంగా 6.5 శాతం వృద్ధి రేటు సాధిస్తామని కూడా మనం రూఢిగా చెప్పలేని పరిస్థితి. ఇదివరకు ఐదు లేదా పది ఏళ్ల నుంచి వున్న విధాన నిర్ణయాలు మనకు యిక పనికి రావు. ప్రపంచీకరణకు సవాళ్ళు ఎదురవుతున్నాయి. ప్రపంచ వాణిజ్యం యిది వరకు వున్నట్టు లేదు. యిప్పుడు మన ముందు ఉన్న ప్రశ్న ఈ పరిస్థితి లో గ్లోబల్ సప్లై చైన్ల లో నుండి బయటికి రావటం లాంటివి చేయాలా లేక మనల్ని మనం శక్తివంతం చేసుకోవాలా అనేది ఆలోచించాలి. అదే సమయం లో ఏ రకమైన వెసులుబాటును అన్ని పరిశ్రమలకు వర్తింపచేయకుండా కొన్నిటికి పరిమితం చేయటం మన ముందు ఉన్న సవాలు.”
దేశం సరాసరి ఎనిమిది శాతం పెరగటానికి వచ్చే 10 నుండి 11 ఏళ్లు 9 శాతం, తదుపరి 11 ఏళ్లు 7 శాతం ఎదగాలి. మన విధానాలు దీనికి తోడ్పడాలి. పోయిన త్రైమాసికం మనం 8.2 శాతం వృద్ధి అయ్యాము. ఆ రకమైన ఎదుగుదల రావటానికి ప్రత్యేక కారణాలు వున్నాయి. మన వృద్ధి ప్రస్తుతం 6.5 శాతం మాత్రమే. మనం విదేశీ పెట్టుబడుల పైన ఆధారపడిన పరిస్థితి లో మన ద్రవ్యలోటు తగ్గించుకోవటం పైన మన దృష్టి వుండాలి. కొంత మంది పివి నరసింహ రావు అమలు చేసిన 1991 తరహా మార్పులు అవసరం అని అనుకుంటారు. కానీ ఆ మార్పులను పివి స్వయంగా ముందుండి నేతృత్వం వహించి చేయించారు అందుకు మనం ఆయనకు ఋణపడి ఉన్నాము. కానీ పివి కూడా ఆ కాలం లో తన పాత విధానాలను పూర్తిగా తిరగదోడుతున్నాను అని బహిరంగంగా అప్పటి పరిస్థితుల వలన చెప్పలేదు. కానీ ఆవిసమూల మార్పుకు దారితీసేవే.
మన దేశానికి ఆర్థిక క్రమశిక్షణతో పాటు విద్య, ఆరోగ్యం పై ఖర్చు చేయాల్సిన అవసరం కూడా ఉంది అలాగే పర్యావరణ మార్పుల పైన కూడా దృష్టి పెట్టాలి. ప్రపంచం లో వృద్ధి చెందుతున్న దేశాలకు పర్యావరణ మార్పులను ఎదురుకోవటానికి కావాల్సిన మద్దతు యివ్వాలనే విషయం పై వుండిన ఏకాభిప్రాయం మారిపోయింది. రుతుపవన వర్షపాత సరళి మారిపోవటంతో నీరు ఎక్కువగా సముద్రంలోని వెళ్లిపోతోంది. ఈ పరిస్థితిని మార్చటానికి యిదివరకు మనం పాటించిన విధానాలను తిరగదోడాలి. మన వ్యవసాయాన్ని కాపాడటానికి పర్యావరణ మార్పులను తట్టుకునే రకాలను మనం తయారు చేయాలి. మనం ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ తో పాటు కాలుష్యాన్ని కలుగజేసే దేశాలలో మూడవ స్థానాన్ని కలిగి వున్నాము. మనం ఈ విషయం లో ప్రైవేట్ కంపెనీల మీద ఆధారపడి బాగానే చర్యలు తీసుకున్నా చైనా సాధించిన ప్రగతిమాత్రం సాధించలేదు. పునరుత్పాదక శక్తి అయిన గాలి, సూర్యుడులను ఉపయోగించుకుని ప్రస్తుతం వున్న 13 శాతం నుండి 2040 నాటికి 45 శాతానికి పెరగాల్సిన అవసరం ఉంది. మనకు శక్తిని నిలవ చేసే సామర్ధ్యం కూడా పెరగాల్సిన అవసరం ఉంది, అని ఆయన అన్నారు.
ప్రపంచంలోని 20 కాలుష్య కాసర నగరాలలో 14 మన దేశం లో ఉన్నాయి. దేశం లో ప్రస్తుతం ఎలెక్ట్రిక్ వాహనాలు 10,000 కూడా ప్రజలకు రవాణా కల్పించటం లేదు. వీటి సంఖ్య మన అవసరాలలో 50 శాతానికి చేరుకోవాలి. కేంద్రం వీటి సంఖ్యను పెంచటానికి యిస్తున్న సబ్సిడీ ని మనం ఆహ్వానించాలి అన్నారు.
ఆర్థిక సంస్కరణల ప్రభావం వివిధ రాష్ట్రాల పైన వేరు వేరుగా ఉంది. యిప్పటికే సాపేక్షికంగా అభివృద్ది అయిన రాష్ట్రాలు లాభపడ్డాయి. అయితే దీనికి పరిష్కారం సరళీకరణ విధానాలను వెనకపట్టు పట్టించటం కాదు. వ్యవస్థీకృత కార్మిక వర్గం తక్కువ ఉన్న రాష్ట్రం తన కార్మిక చట్టాలను కేంద్రం నిర్దేశించే కొన్ని విధానాలకు ఎందుకు లోబడి వుండాలి, అనేది మౌలికమైన ప్రశ్న. అయితే వీటిని మార్చటానికి సంస్కరణలు అవసరం కానీ వాటి పైన ఏకాభిప్రాయం యింకా లేదు.
మారిన సాంకేతిక పరిజ్ఞాన్ని ఉపయోగించేవారు ఆటోమొబైల్ రంగం లో 100 మిలియన్ వినియోగదారులకు చేరుకోవటానికి రెండు దశాబ్దాలు పడితే, టెలిఫోన్ కు 10 ఏళ్లు, ఇంటర్నెట్ కు మూడు ఏళ్లు పట్టింది కానీ చాట్జీపీటీ కి కేవలం మూడు రోజులు పట్టింది. కాబట్టి మనకు ఉన్న సమయం తక్కువ. ఉద్యోగాల కల్పన చాలా తక్కువగా ఉండబోతోంది. కొత్త ఉద్యోగాల కల్పనకు మనం పరిశోధనల పైన ఖర్చుపెట్టాలి అని అన్నారు.
దేశం లో తీసుకోవాల్సిన చర్యల పైన మాట్లాడుతూ, “దేశం విద్య, ఆరోగ్యం, నీటి సంరక్షణ పై 5 శాతం జీడీపీ ని ఖర్చుచేయాలి. యివి రాష్ట్రం పరిధిలో వున్న విషయాలు. మన ద్రవ్యలోటు తగ్గి స్థూల దేశీయోత్పత్తికి రుణాలకు మధ్యన నిష్పత్తి కూడా అదుపులోకి రావాలి అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పినా దానికి ఒక కాలపరిమితిని నిర్ణయించలేదు. రాష్ట్రాలు తమ ద్రవ్యలోటు తగ్గించటం కష్టం. కేంద్రమే ఆ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం వుంది. అందుకు మనకు కొత్త పన్ను విధానం కావాలి. దీనిపైన 20 ఏళ్లుగా చర్చ ఉన్నా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పెట్రోలియం పైన సబ్సిడీలు చమురు ధరలు పడిపోవటంతో తగ్గాయి,” అని స్పష్టం చేశారు.
కేవలం ఎక్కువ ఖర్చుపెట్టడం మన సమస్యలకు పరిష్కారం కాదు. రాష్ట్రాలలో బీపీఆర్ విఠల్ లాంటి వారు వుండి అందుకు తగిన చర్యలు తీసుకోవాలి. ఆర్థిక సంఘం రిపోర్ట్ త్వరలో రానున్న రీత్యా మనల్ని వెనక్కు నెడుతున్న సమస్యలపైన ఒక స్పష్టత వస్తుంది అన్నారు.
సభను ప్రారంభించిన మాజీ రిజర్వ్ బ్యాంకు గవర్నర్ డీ. సుబ్బా రావు బీపీఆర్ విఠల్ గురించి మాట్లాడారు. ప్రపంచీకరణ తిరోగమనం, సాంకేతిక మార్పులు, జనాభా మార్పులు, పర్యావరణ మార్పులు జరుగుతున్న పరిస్థితి లో విధాన నిర్ణయాలు చేయటం మరింత జటిలం అయ్యిందని అన్నారు. బీపీఆర్ విఠల్ ఒక మేధావి అయిన అధికారి, ఆయనకు ఆర్థిక, రాజనీతి శాస్త్రం, చరిత్ర వంటి అన్నీ రంగాలలో తగిన జ్ఞానం ఉండింది అన్నారు.

