
గ్రూప్ వన్ ర్యాంకర్ల తల్లిదండ్రుల మండిపాటు
అన్ని పార్టీలు సహకరించాలని వినతి
గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను రద్దు చేస్తున్నట్లు ఇటీవలె హైకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.
రాజకీయాల కోసం తమ పిల్లలను బలి పశువులు చేశారని ర్యాంకర్ల తల్లిదండ్రులు మనో వేదన వ్యక్తం చేశారు.
మంగళవారం సోమాజి గూడ ప్రెస్ క్లబ్ లో ర్యాంకర్ల తల్లిదండ్రులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఒక్కో పోస్టు మూడు కోట్ల రూపాయలకు కొన్నట్టు ప్రచారం చేశారని, ఓ పూట తిని ఓ పూట తినకుండా పిల్లలను కష్టపడి చదివించామని వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని పార్టీలు సహకరించాలి
గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షా ఫలితాలు రద్దు కావడంతో తమ పిల్లల భవిష్యత్ అంధాకారమైందని ర్యాంకర్ల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.పిల్లల భవిష్యత్తు దృష్ట్యా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ర్యాంకర్ల తల్లిదండ్రులు కోరుతున్నారు. కృషి పట్టుదలతో తమ పిల్లలు ర్యాంకులు తెచ్చుకున్నారని వారు అన్నారు.
హైకోర్టు తీర్పు నేపథ్యంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తల్లిదండ్రులు చెప్పారు. పోస్టులు కొన్నామన్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్దమని ర్యాంకర్ల తల్లిదండ్రులు పేర్కొన్నారు.
గ్రూప్ 1 పరీక్షల ఫలితాలను రద్దు చేయాలని కొందరు, రద్దు చేయకూడదని మరికొందరు హైకోర్టులో పిటిషన్ లు వేసిన సంగతి తెలిసిందే. ర్యాంకులు కొన్నట్టు ఆరోపణల నేపథ్యంలో హైకోర్టులో సుదీర్ఘంగా కేసు నడిచింది. వాద ప్రతి వాదనలు విన్న హైకోర్టు ఈ నెల 9న తుదితీర్పు వెలువరించింది. మొత్తం 12 పిటిషన్లపై విచారణ జరిగి 222 పేజీల తీర్పును హైకోర్టు వెలువరించింది.