H-1B ఫీజుపై ట్రంప్‌ను కోర్టుకి లాగిన యూనియన్లు, వర్సిటీలు
x

H-1B ఫీజుపై ట్రంప్‌ను కోర్టుకి లాగిన యూనియన్లు, వర్సిటీలు

ట్రంప్ సర్కార్ నిర్ణయం చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ శాన్ ఫ్రాన్సిస్కో, నార్త్ కాలిఫోర్నియాలోని కోర్టుల్లో కేసు దాఖలు అయ్యాయి.


అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్కిల్డ్ వర్కర్లకు ఇచ్చే హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ఇటీవల ఇచ్చిన ఉత్తర్వుపై అమెరికాలో న్యాయపోరాటం మొదలైంది. లక్ష డాలర్ల ఫీజును సవాల్ చేస్తూ కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. అధ్యక్షుడి నిర్ణయం చట్టవిరుద్ధమంటూ కార్మిక, విద్యా సంస్థలు వాదనలు వినిపించేందుకు సిద్ధమవుతున్నాయి. అమెరికన్లకే ఉద్యోగాలు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని వీరు సవాల్ చేశారు.

అమెరికాలో హెచ్-1బీ వీసాలపై ట్రంప్ ప్రభుత్వం తీసుకువచ్చిన కఠిన నిబంధనలపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొత్తగా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసేవారిపై లక్ష డాలర్ల (సుమారు రూ. 83 లక్షలు) భారీ ఫీజు విధించడాన్ని సవాలు చేస్తూ పలు కార్మిక సంఘాలు, విద్యావేత్తలు, మత సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. ట్రంప్ సర్కార్ నిర్ణయం చట్టవిరుద్ధమని ఆరోపిస్తూ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ డిస్ట్రిక్ కోర్టులో, నార్త్ కాలిఫోర్నియాలోని నార్తరన్ District of California లో కేసు దాఖలు అయ్యాయి.
ఈ వ్యాజ్యంలో సెప్టెంబర్ 19న ట్రంప్ జారీ చేసిన ప్రకటనలో అనేక తప్పులు ఉన్నాయని పిటిషనర్లు పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు హెచ్-1బీ వీసా విధానం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని వారు ఆరోపించారు.
"కాంగ్రెస్ అధికారికంగా ఆమోదించిన వీసా పథకాన్ని దెబ్బతీసేలా, ఎలాంటి చట్టబద్ధత లేకుండా అధ్యక్షుడు ఏకపక్షంగా ఇంత భారీ ఫీజును విధించడం అన్యాయం, అసాధారణం" అని తమ పిటీషన్ లో వివరించారు. ట్రంప్ నిర్ణయం అవినీతికి, పక్షపాత వైఖరికి తలుపులు తెరిచినట్లే అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
అయితే, ఈ చర్యను ట్రంప్ ప్రభుత్వం సమర్థించుకుంది. అమెరికన్లకే ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ట్రంప్ స్పష్టం చేశారు. వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లట్నిక్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. "ఈ విధానంతో టెక్ కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి వెనకాడుతాయి. ప్రభుత్వానికి లక్ష డాలర్లు చెల్లించి, ఆపై ఉద్యోగికి జీతం ఇవ్వడం ఆర్థికంగా భారమవుతుంది. దీంతో వారు మన దేశంలోని విశ్వవిద్యాలయాల నుంచి పట్టభద్రులైన అమెరికన్లకే శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు" అని ఆయన వివరించారు.

మరోవైపు, ఈ లక్ష డాలర్ల ఫీజు కేవలం కొత్త వీసాలకు మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే వీసా ఉన్నవారికి లేదా పునరుద్ధరణ చేసుకునేవారికి వర్తించదని వైట్ హౌస్ స్పష్టత ఇచ్చింది. ఇదిలా ఉండగా, ప్రస్తుత లాటరీ విధానాన్ని రద్దు చేసి, అత్యంత నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఇచ్చేలా కొత్త ఎంపిక ప్రక్రియను తీసుకురావాలని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతిపాదించింది. కాగా, 2024లో జారీ అయిన మొత్తం హెచ్-1బీ వీసాలలో 70 శాతానికి పైగా భారతీయులే ఉన్నారు.
కేసులు దాఖలు చేసిన వారిలో యునైటెడ్ ఆటో వర్కర్స్ యూనియన్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్, నర్సుల నియామక సంస్థ, పలు మత సంస్థలు ఉన్నాయి. వీరందరూ ఓ గ్రూపుగా ఏర్పడి న్యాయపోరాటం ప్రారంభించారు. ట్రంప్‌కు కొంతమంది విదేశీయుల ప్రవేశాన్ని నియంత్రించే అధికారముండవచ్చు కానీ అది H-1B వీసా ప్రోగ్రాం ఏర్పాటుకు కారణమైన చట్టాన్ని అతిక్రమించే అధికారం లేదు అని వీరు వాదిస్తున్నారు.
దీనిపై వైట్ హౌస్ ప్రతినిధి అబిగైల్ జాక్సన్ ఒక ప్రకటన చేస్తూ ట్రంప్ ప్రభుత్వం చట్టప్రకారమే వ్యవహరిస్తోందని, లీగల్ ప్రాసెస్ ను తామూ ఎదుర్కొంటామని పేర్కొన్నారు.
Read More
Next Story