మలి దశ ఉద్యమంలో కవులు, కళాకారులు కీలకపాత్ర
x
అందె శ్రీ సంతాప సభలో ముఖ్యమంత్రి

మలి దశ ఉద్యమంలో కవులు, కళాకారులు కీలకపాత్ర

అందెశ్రీ సంతాప సభలో తెలంగాణ ముఖ్యమంత్రి


తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన అందెశ్రీ సంతాప సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘‘ఉద్యమానికి కవులు, కళాకారులు ఇచ్చిన స్పూర్తితోనే తెలంగాణ సాకారమైంది. ఎన్నడూ బడి ముఖం చూడని అందెశ్రీ అద్భుతమైన జయజయహే తెలంగాణ పాట రాశారు. అందెశ్రీ పాట లేకుండా తెలంగాణ ఉద్యమంలో ఒక్క సభ కూడా జరగలేదు’’ అని రేవంత్ రెడ్డి అన్నారు. కానీ, తెలంగాణ సాకారమైన తర్వాత ఆ పాట మూగబోయింది. పాలకుల దృష్టిలో పదేళ్లు మూగబోయి ఉండొచ్చు కానీ.. తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్యం గానమై నిలిచింది అని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన వారిని కనుమరుగు చేసే ప్రయత్నం జరిగింది అని రేవంత్ రెడ్డి అన్నారు.

పెన్నుల మీద మన్ను కప్పితే గన్నులై...

కవి రాసే పెన్నుల మీద మన్ను కప్పితే.. అవి గన్నులై మొలకెత్తుతాయ్‌.. మీ గడీలను కుప్పకూలుస్తాయ్‌ అన్న నినాదాన్ని అందెశ్రీ నిజం చేశారని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజలు కోరుకున్న జయ జయహే తెలంగాణను.. రాష్ట్ర గీతంగా ప్రకటించడమే కాకుండా.. ప్రతి బడిలో పాడాలి, పాఠ్య పుస్తకాల్లో రాయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రజలు ఎంత అమాయకంగా కనిపిస్తారో.. అంత చైతన్యవంతులు అని ఆయన కితాబిచ్చారు. ఈ గడ్డ మీద ప్రజలు అహంకారాన్ని, అధిపత్యాన్ని సహించలేరని ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎన్ని వజ్రాలు ఉన్నా.. కోహినూరు వజ్రం ప్రత్యేకం అని ఆయన అన్నారు. అలాగే ఎందరు కవులు ఉన్నా డా.అందెశ్రీ ప్రత్యేకం అని సీఎం అన్నారు.

Read More
Next Story