
‘పెటా’ ఫిర్యాదుపై పాలమూరు ల్యాబ్ పై పోలీసు కేసు
జంతువులపై క్రూరత్వం ఆరోపణలపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడం సంచలనం రేపింది.
జంతువులపై క్రూరత్వం ఆరోపణలపై తెలంగాణ ల్యాబ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. దేశంలోని జంతు ప్రయోగ ప్రయోగశాలపై ఇలా కేసు నమోదు చేయడం ఇదే మొదటిసారి అని పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్ మెంట్ ఆఫ్ ఎనిమల్స్ (PETA) తెలిపింది.మహబూబ్నగర్ జిల్లాలోని పోలీసులు పాలమూరు బయోసైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ జంతు ప్రయోగ కేంద్రంపై దాని ప్రయోగశాలలో జంతువులను హింసిస్తున్నారని ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు.
పెటా ఇండియా ఫిర్యాదు మేరకు భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) సెక్షన్ 173(1) కింద ల్యాబొరేటరీ కస్టడీలో జంతువులను చంపినందుకు, జంతువులను వైకల్యం చేసినందుకు ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 34, 269, 289, 337, 429లను ఉల్లంఘించినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు.కుక్కలు, రీసస్ మకాక్లు, ఇతర జంతువులను పరిశోధనల పేరిట హింసిస్తున్నారని పెటా ఇండియా శాస్త్రవేత్త,పరిశోధన విధాన సలహాదారు డాక్టర్ అంజనా అగర్వాల్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ జంతువులపై ప్రయోగాల నియంత్రణ, పర్యవేక్షణ కమిటీ (CCSEA)జంతువులను తనిఖీ చేయడానికి అత్యవసర కమిటీని ఏర్పాటు చేసింది.
పాలమూరు బయోసైన్సెస్ లో జంతు హింసపై పెటా ఫిర్యాదు
ప్రభుత్వ కాంట్రాక్టు పొందిన పాలమూరు బయోసైన్సెస్ ప్రైవేటు లిమిటెడ్ ఆధీనంలోని ల్యాబోరేటరీలో జంతు హింస సాగుతుందని జంతు హక్కుల సంస్థ పెటా తాజాగా ఫిర్యాదు చేసింది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం కర్వెన గ్రామంలోని ల్యాబొరేటరీలో జంతువుల మందులను కనుగొనేందుకు జంతువులపై అశాస్త్రీయంగా పరిశోధనలు చేస్తున్నారని పెటా ఇండియా శాస్త్రవేత్త డాక్టర్ అంజనా అగర్వాల్ ఆరోపించారు. 800 కుక్కలను ఉంచే స్థలంలో 1500 కుక్కలు ఉంచారని, దీంతో అవి గాయాల పాలవుతున్నాయని పెటా ఆరోపించింది. కుక్కలకు ఇంజక్షణ్లు చేయడం వల్ల ఇన్ఫెక్షన్ అయి చర్మం ఊడిందని చెప్పారు. మత్తుమందులు ఇవ్వకుండా జంతువులపై పరిశోధనలు చేస్తున్నారని పెటా ప్రతినిధి అనుష్క యాదవ్ తెలిపారు.
Next Story