‘విద్యార్థుల అవస్థలు గతంలో కనిపించలేదా’.. బీఆర్ఎస్కు పొన్నం చురకలు
గురుకులాల్లోని విద్యార్థుల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. గురుకులాల విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని అన్నారు.
గురుకులాల్లోని విద్యార్థుల సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. గురుకులాల విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, వాటిని వరల్డ్ క్లాస్ లెవెల్కు ఆధునికీకరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు. శనివారం ఆయన షేక్పేటలోని సాంఘిక సంక్షేమ పాఠశాల సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (బాయ్స్)ను సందర్శించారు. లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్లో అందుతున్న కోర్స్లను, డిజిటల్ క్లాస్ రూం, COE ద్వారా విద్యార్థులకు అందే ప్రత్యేక కోర్సులు తదితర వాటిని పరిశీలించారు. విద్యార్థులతో కలిసి ఆయన కూడా అక్కడే భోజనం చేశారు. ఈ సందర్బంగానే గురుకులాల సమస్యలపై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న పోస్ట్లపై, వారు చేపట్టిన ‘గురుకుల బాట’ కార్యక్రమంపై పొన్నం ప్రభాకర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడెన్నో సూక్తులు చెప్పున్న వారిని.. వాళ్లు పాలించిన గత పదేళ్లలో ఇవి కనిపించలేదా అని ప్రశ్నించారు. గత పాలకులకు, ఆ పార్టీ నాయకులకు కనీస చిత్తశుద్ధి కూడా లేదంటూ మండిపడ్డారు. వారు ఇప్పటికైనా గురుకులాలపై అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. తెలంగాణను అన్ని విధాలుగా, అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, అందులో విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన సదుపాయాలు కల్పించడం కీలకంగా తమ ప్రభుత్వ భావిస్తోందని తెలిపారు. అందుకోసమే ప్రతి నియోజకవర్గంలో రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించాలని నిర్ణయించడంతో పాటుగా, విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలను కూడా పెంచామని గుర్తు చేశారు.
‘‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా గురుకులాల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టల్లలో పౌష్టికాహారాన్ని అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని హాస్టల్లను సందర్శిస్తున్నారు. గురుకులాల్లో చదువుతున్న 8 లక్షల మంది విద్యార్థులకు బలమైన ఆహారం అందించాలని నిపుణులైన డాక్టర్ల సమక్షంలో డైట్ మెనూ ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రభుత్వం గురుకులాను తల్లిదండ్రులగా భావించి, మా భవిష్యత్ మీది అని అభయమిచ్చి ఇక్కడ చేరిన వారికి తెలంగాణ ప్రభుత్వం తరుపున భరోసా కల్పిస్తున్నాం’’ అని భరోసా ఇచ్చారు.
‘‘10 సంవత్సరాలుగా తెలంగాణ విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయింది. అటువంటి విద్యా వ్యవస్థను తిరిగి పునరుజ్జీవనం చేశాం. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చి బదిలీలు చేసి నియామకాలు చేపట్టి అధ్యాపకవర్గ అసహనాన్ని తొలగించాం. ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగితే సహించేది లేదు. అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా 25 వేల పాఠశాలకు 11 వందల కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించాం. పుస్తకాలు డ్రెస్లు సమయానికి అందిస్తున్నాం. ఇప్పుడున్న ధరలను పోలిస్తే 40 శాతం డైట్ చార్జీలు 200 శాతం కాస్మొటిక్ చార్జీలు పెంచాం. గతంలో కిరాయిల ఇవ్వలేదని గురుకుల అద్దె భవనాలు ఖాళీ చేసే పరిస్థితి ఉంటే అద్దె బిల్లులు చెల్లించాం. మెస్ ఛార్జీలు గ్రీన్ ఛానెల్ ద్వారా చెల్లిస్తాం. రాబోయే కాలంలో ఆరోగ్యంగా ఉంటూ మానసికంగా బలంగా ఉంటూ తెలంగాణ అభివృద్ధిలో మీరంతా భాగస్వామ్యం కావాలి’’ అని విద్యార్థులను ఉద్దేశించి అన్నారు.
‘‘జూడో, చేస్లో ఇక్కడ ఎక్కువగా ఆడుతున్నారు. నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అకుంఠిత దీక్షతో చదువుకొని మీముందు మంత్రిగా ఇక్కడ ఉన్నాను. ముఖ్యమంత్రి కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి, టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం, ఫైనాన్స్ సెక్రెటరీ రామకృష్ణ గురుకులాల్లో చదివే ఇప్పుడు ఈ స్థాయిలకు ఎదిగారు. జవహర్ లాల్ నెహ్రూ నవ రత్నాలు స్థాపించి టెక్నికల్గా దేశం ఎక్కడికో ఎదిగింది. మీరు మీ తెలివినీ మెరుగుపరుచుకోవాలి. కరీంనగర్ లోక్ సభ ఆశీర్వాదంతో పార్లమెంటు సభ్యుడుగా తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం.మీ తల్లిదండ్రులకు, గ్రామానికి, తెలంగాణకు పేరు తెచ్చే విధంగా మీరు ఎదగాలి’’ అని ఆకాంక్షించారు.
‘‘మీకు మున్సిపల్ వాటర్ రేపటి నుండి ఉచితంగా వస్తాయి. ఈ గురుకులలో ఒక బోర్ వేసి వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తం. మౌళిక వసతులు కల్పనకు రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నాం. 20 మంది జూడో క్రీడాకారులకు జూడో డ్రెస్లను కలెక్టర్ ఆధ్వర్యంలో అందిస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ వస్తుంది. ఈ స్కూల్ నుండి అక్కడ కూడా పెద్ద ఎత్తున సీట్లు సంపాదించాలి. నేను సౌత్ కొరియా పోయినప్పుడు అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ చూశా. ఆ చిన్న దేశానికి 34 ఒలింపిక్స్ మెడల్స్ వచ్చాయి. తెలంగాణ రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు పెరుగుతున్నాయి. నెల రోజుల్లో ఇక్కడ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు చేస్తున్నాం.. విద్యార్థులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పిస్తాం’’ అని తెలిపారు.
‘‘ప్రతి ఒక్కరూ రవాణా నిబంధనలు పాటించాలి. రాబోయే కాలంలో రవాణా నిబంధనలపై కఠినంగా వ్యవహరిస్తాం. తల్లిదండ్రులకు విజ్ఞప్తి ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం మీరు చెప్పింది కూడా వింటాం. ప్రభుత్వం రాగానే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ అందిస్తున్నాం. ఇప్పటి వరకూ 120 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాం.. కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం’’ అని వివరించారు.
అనంతరం ‘గురుకుల బాట’ కార్యక్రమాన్ని ప్రారంభించిన బీఆర్ఎస్పై మండిపడ్డారు. ‘‘గతంలో మీరు ఎప్పుడైనా పిల్లలతో కలిసి భోజనం చేశారా...? వారి సమస్యలు పరిష్కారం చేశారా...? ఇప్పుడు విద్యార్థుల మీద రాజకీయాలు చేస్తున్నారా. మీద్యార్థులకు మేము అండగా ఉంటాం. మీ సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. మీరు మంచిగా చదువుకొని మంచి పేరు సాధించాలి. కొందరు నాయకులు తమ స్వార్థం కోసం మీ ఊసెత్తుతున్నారు. కానీ మీకు ఏం కావాలన్నా.. దాన్ని మా ప్రభుత్వం ముందే పసిగట్టి దాన్ని అందిస్తుంది’’ అని అన్నారు.