అమెరికన్ కాన్సులేట్ ముందు పాలస్తీనా మద్దతు నినాదాలు
x

అమెరికన్ కాన్సులేట్ ముందు పాలస్తీనా మద్దతు నినాదాలు

ఆహారాన్ని, మంచి నీళ్ళని, మందులను నిలిపివేస్తూ పాలస్తీనా ప్రజల జాతిహననానికి ఇజ్రాయెల్ పాల్పడుతోంది.


పాలస్తీనాకు సంఘీభావంగా 'ఇండియన్ పీపుల్ ఇన్ సాలిడారిటీ విత్ పాలస్తీనా' ఫోరమ్ సభ్యులు, ఇతర సంఘాలతో కలిసి నిరసన తెలపడానికి సమావేశమవుతుండగానే హైదరాబాద్ పోలీసులు వారిని నిర్బంధించారు. మహిళలతో సహా, ప్రజాస్వామికంగా నిరసన తెలపబోతున్న నిరసనకారులందర్నీ ఆటవికంగా ట్రక్కుల్లోకి ఈడ్చుకెళ్లారు. గత 20 నెలలుగా పాలస్తీనా ప్రజలపై అమెరికా భాగస్వామ్యంలో ఇజ్రాయెల్ సాగిస్తున్న జాతిహననానికి విరుద్ధంగా నినదిస్తూ పోలీసుల నిర్బంధాన్ని ప్రతిఘటించారు. ప్రజానుకూల పాలన అంటూ బూటకపు మాటలు చెప్పే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ తన దమన నీతిని బట్టబయలు చేసింది.

నార్సింగి పోలీస్ స్టేషన్ లో నిరసనకారులు సభను నిర్వహించారు. 'పాలస్తీనాకు సంఘీభావంగా భారత ప్రజలు' (Indian People in Solidarity with Palestine) ఫోరమ్ సభ్యురాలు భార్గవి మాట్లాడుతూ నేడు పాలస్తీనా ప్రజలపై సాగుతున్న మారణహోమం కొన్ని దశాబ్దాల క్రితం నుండే మొదలైందని పేర్కొన్నారు. అయితే, 2023 అక్టోబర్ 7 నుండి ఇజ్రాయెల్ బాహాటంగా ఈ దాడులని మరింత తీవ్రంగా చేస్తోందని అన్నారు. ఇప్పటివరకు 60000కు పైగా పాలస్తీనా ప్రజలను ఇజ్రాయెల్ అత్యంత అమానుషంగా చంపివేసింది. వేలాది మంది పిల్లలను, మహిళలను మరియు ఆసుపత్రులపై, స్కూళ్లపై ఉద్దేశపూర్వకంగా బాంబుల వర్షం కురిపిస్తుందని అన్నారు. ఆహారాన్ని, మంచి నీళ్ళని, మందులను నిలిపివేస్తూ పాలస్తీనా ప్రజల జాతిహననానికి ఇజ్రాయెల్ పాల్పడుతోందని భార్గవి అన్నారు. దీనికి అమెరికా సామ్రాజ్యవాదం వత్తాసు పలకడం మనకందరికీ తెలిసిందేనని అంటూ, నేడు పాలస్తీనా ప్రజలకు మద్దతుగా నిలవబడుతూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా దీనికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సందర్భంలో, మన దేశంలో కూడా ఈ సమస్యపై IPSP( Indian People in Solidarity with Palestine) దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలలోకి వెళ్ళి ప్రచారం చేస్తోందని, ఒకప్పుడు వలసవాదుల అణిచివేతకు గురైన భారతీయులుగా నేడు పాలస్తీనా విముక్తి పోరాటానికి మద్దతుగా నిలవడం అందరి బాధ్యత అని నొక్కిచెప్పారు. ఇందులో భాగంగా బాయ్ కాట్, డైవెస్ట్ మెంట్, సాంక్షన్స్ ( BDS) ఉద్యమం ముమ్మరంగా జరుగుతుందని తెలియజేశారు. ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలుస్తున్న కంపెనీలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. జాతిహనన ఇజ్రాయెల్ తో భారతదేశ పాలక వర్గానికి ఉన్న సంబంధాలు, భారతదేశ సామాన్య ప్రజలకు ఈ విధంగానూ ప్రయోజనకరం కాదని, ఇజ్రాయెల్ సరఫరా చేసే ఆయుధాలు, నిఘా పరికరాలు కేవలం ప్రజా పక్ష గొంతులను అణిచివేయడానికి ఉపయోగిస్తున్నారని అన్నారు. ఫాసిస్టు మోదీ ప్రభుత్వం ఇజ్రాయెల్ తో అన్ని సంబంధాలను తెంచుకోవాలి డిమాండ్ చేశారు.

IPSP సభ్యుడు డాక్టర్ సుహాస్ మాట్లాడుతూ వేలకు పైగా విద్య రంగ సిబ్బందిని ఈ దాడిలో ఇజ్రాయెల్ చంపుతోందని, గాయాలపాలైన పిల్లలు, మహిళలకు జరుగుతున్న కొద్దిపాటి చికిత్స కూడా ఎలాంటి వైద్య పరికరాలు, అనస్థీషియా వంటివి అందుబాటులో లేకుండా అత్యంత దారుణ పరిస్థితుల్లో జరుగుతుందని అన్నారు. ఆకలి, పోషకాహార లోపం తీవ్రతరమవుతున్నాయని అన్నారు. న్యాయ ప్రియులైన ప్రజలందరూ పాలస్తీనాకు సంఘీభావంగా BDS ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Read More
Next Story