Phone Tapping | హరీష్ రావుపై కేసు నమోదు.. రంగంలోకి పంజాగుట్ట పోలీసులు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుపై పంజాగుట్టు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేసు ఎవరు పెట్టారంటే..
మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు(Harish Rao)పై పంజాగుట్టు పోలీస్ స్టేషన్(Punjagutta Police Station)లో కేసు నమోదైంది. ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)కు సంబంధించి హరీష్ రావుపై బాచుపల్లికి చెందిన చక్రధర్గౌడ్.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. హరీష్ రావు సహా బీఆర్ఎస్ హయాంలో టాస్క్ఫోర్స్ డీసీపీగా విధులు నిర్వర్తించిన రాధాకిషన్రావుపైన కూడా ఆయన ఫిర్యాదు చేశారు. అప్పటి నేతలు, అధికారులు తన ఫోన్ను ట్యాప్ చేశారని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని ఫిర్యాదును స్వీకరించిన పంజాగుట్ట్ పోలీసులు.. హరీష్ రావు సహా రాధాకిషన్పై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్ 120బీ, 386, 409 కింద కేసును నమోదు చేశారు. హరీష్, రాధాకిషన్పై చర్యలకు కూడా పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ పరుగులు పెట్టడం మొదలైంది. ప్రభుత్వ మారిన అతి తక్కువ సమయంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు. తాజాగా ఇవే ఆరోపణలపై హరీష్, రాధాకిషన్పై కేసు నమోదు కావడం హాట్ టాపిక్గా మారింది. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా పోలీసులు విచారించారు. ఇప్పుడు ఈ కేసులో హరీష్ పేరు కూడా చేరడం చర్చనీయాంశమైంది. ఇటీవల ఈ కేసుకు సంబంధించి తెలంగాన మంత్రి కొండాసురేఖ సంచలన ఆరోపణలు కూడా చేశారు.
కొండా సురేఖ ఏమన్నారంటే..
టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) లో కీలక నిందితులను బీఆర్ఎస్(BRS) నేతలు అమెరికా(America) నుండి రాకుండా కాపాడుతున్నట్లు మంత్రి ఆరోపించారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లోనే టెలిఫోన్ ట్యాపింగ్ అంశం పెద్ద సంచలనమైంది. ప్రతిపక్షంలో ఉన్నపుడు తమ ఫోన్లను కేసీఆర్ ట్యాపింగ్ చేయిస్తున్నట్లు రేవంత్(Revanth) తో పాటు కొందరు నేతలు ఆరోపణలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అలాంటిది ప్రభుత్వం మారగానే ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఆధారాలు వెలుగుచూశాయి. ఎప్పుడైతే ట్యాపింగ్ కు సంబంధించిన ఆధారాలు బయటపడి కొంతమంది పోలీసు అధికారులపైన కేసులు నమోదయ్యాయో వెంటనే ఇద్దరు ప్రముఖులు దేశంవిడిచి పారిపోయారు అని ఆమె పేర్కొన్నారు.