
తెలంగాణలో కూడా ‘రోహిత్’ చట్టం
యువత హత్యలను, ఆత్మహత్యలను నిరోధించడం కోసం ‘రోహిత్ వేముల’ చట్టాన్ని తీసుకురావాలని కోరారు రాహుల్ గాంధీ.
విద్యాశాఖలో ఇప్పటికీ వివక్ష ఉందని, లక్షలమంది విద్యార్థులు ఈ వివక్షకు గురవుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ మేరకు ఇటీవల కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాశారు. విద్యార్థులను వివక్ష నుంచి కాపాడటం కోసం ‘రోహిత్ వేముల’ చట్టం తీసుకురావాలని కోరారు. కాగా తాజాగా ఇదే అంశంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా లేఖ రాశారు. తెలంగాణలో కూడా యువత హత్యలను, ఆత్మహత్యలను నిరోధించడం కోసం ‘రోహిత్ వేముల’ చట్టాన్ని తీసుకురావాలని కోరారు రాహుల్ గాంధీ. రోహిత్ వేముల, పాయల్ తడ్వి, దర్శన్ సోలంకి లాంటి ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకుల ప్రాణాలు అర్ధాంతరంగా గాలిలో కలిసిపోయాయని వ్యాఖ్యానించారు.
విద్యాశాఖలో జరుగుతున్న ఇలాంటి ఆత్మహత్యలను నివారించాల్సిన అవసరం ఎంతయినా ఉందని, విద్యార్థుల రక్షణ కోసం కొత్త చట్టాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, రోహిత్ వేములతో పాటు లక్షలాది మంది ఎదుర్కొన్న వివక్షను ఇతరులు ఎదుర్కోకుండా ఉండేందుకు 'రోహిత్ వేముల' చట్టాన్ని తీసుకురావాలని సూచించారు. రాహుల్ గాంధీ రెండు రోజుల క్రితం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు కూడా 'రోహిత్ వేముల' చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని లేఖ రాశారు.