
లంచాల్లో దూసుకుపోతున్న తెలంగాణ!
లంచం ఇవ్వనిదే ఏ పనీ కాదన్న అభిప్రాయానికి ప్రజలొచ్చారా? ట్యాక్స్లతో పాటు లంచాలు ఇవ్వడానికి జనం అలవాటు పడడమే కాదు, లంచానికి వారు బ్రోకర్ ట్యాక్స్ అని పిలుచుకుంటున్నారంటారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు పద్మనాభ రెడ్డి. గత 1 సంవత్సరంలో తెలంగాణలో 67% పౌరులు లంచం చెల్లించారు. ఏ పని కోసం వెళ్లినా బ్రోకర్ల ద్వారానే నడుస్తోంది. గత ఆరు నెలల్లో అవినీతి ప్రభుత్వ అధికారులపై ACB 122 కేసులు నమోదు చేసింది. వందలా మందిని జైలుకు పంపారు. లంచగొండి అధికారులపై మరింత దూకుడుగా వ్యవహరిస్తూ వరుస కేసులు, విచారణలతో ముచ్చెమటలు పట్టిస్తున్నారు. సగటున ప్రతి 3 రోజులకు 2 కేసుల చొప్పున నమోదవుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తరువాత అవినీతి పెరిగిందా? లేక ఎసిబి యాక్టివ్ అయిందా? అంటే అవినీతే పెరిగిందని పద్మనాభ రెడ్డి చెబుతున్నాయి.
తెలంగాణ వచ్చిన పదేళ్లలో అవినీతికి సంబంధించి దారుణమయిన సంఘటనలు చాలా జరిగాయి. ఆ మధ్య లంచం ఇచ్చుకోలేని రైతుల ఒక ఎమ్మార్వో మీద పెట్రోలు వేసి తగలపెట్టాడు. భూకుంభకోణంలో ఇరుక్కున్న మరొక ఎమ్మార్వో ఆత్మహత్య చేసుకున్నారు. జిహెచ్ ఎంసి, ఇరిగేషన్ శాఖలలో అవినీతి నిరోధక శాఖకు దొరికిన అధికారుల, ఇంజనీర్ల ఇళ్లలో కోట్ల కొలది విలువైన ఆస్తులు దొరికాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ఇప్పటికి మూడు ప్రభుత్వాలు ఏర్పడినాయి. జూన్ 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముందు ఆరు నెలలలో కొన్ని వేల ఫైళ్లకు రెక్కలు వచ్చాయి. అనేక దస్త్రాలు మాయం అయ్యాయి. అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కేవలం మాటలు చెప్పింది తప్పితే ఒక్కదాని మీద విచారణ చేయలేదు. ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు కూడా గత ప్రభుత్వం మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. కేసులు మాత్రం వేయడం లేదు. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి అక్రమంగా కార్లు వాడుకున్న దగ్గర నుంచి కాళేశ్వరం, హరితహారంలో, మిషన్ భగీరథలో, మెట్రో రైలు, ధాన్యం కొనుగోళ్లు వంటి అనేక ‘బడా’ నిర్ణయాలలో, ప్రాజెక్టులలో అవినీతి స్పష్టంగా ఉన్నా ప్రభుత్వం మాత్రం విచారణ కూడా చేయడం లేదు.
హైదరాబాద్ కేంద్రంగా జరిగిన అభివృద్ధి అవినీతి సామ్రాజ్య విస్తరణకు ఉపయోగపడింది. ప్రైవేటు కాలేజీలకు అనుమతులు, ఇసుక కుంభకోణాలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, భారీ నీటి పారుదల ప్రాజెక్టులు, భూకుంభకోణాలు మొదలైవాటి మీద ఆరోపణలు వచ్చినా ఒక్కరి మీద కూడా కేసులు పడలేదు. రాజకీయ ప్రత్యర్థులు కూడా అవినీతి కేసులు వేయకపోవడం కుమ్మక్కు అవినీతికి నిదర్శనం. తెలంగాణలో 2014 నుంచి 2025 వరకు ఇచ్చిన 1,99,115 ప్రభుత్వ జీవోలలో కేవలం 82,657 మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వం స్వయంగా శాసనసభలో చెప్పింది. ప్రజలకు అందుబాటులో ఉన్నవి దాదాపు 80 శాతం ప్రజలకు అవసరం లేనివి. ప్రజలకు అవసరమైనవి వారికి అందుబాటులో ఉండవు. ఇటీవల యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ఓ సర్వే విడుదల చేసింది. తెలంగాణలో అవినీతి బాగా ఉన్నదని 94 శాతం మంది అభిప్రాయపడ్డారు. అలాగే వివిధ శాఖల్లో అధికారుల పనితీరు ఎలా ఉందని అడిగితే బాగా లేదంటూ 81 శాతం మంది చెప్పారు. 1. అవినీతి ఉందా అనే ప్రశ్నకు 55 శాతం ప్రజలు చాలా ఉందని, 39.3శాతం ఉందని సమాధానమిచ్చారు. 2. లంచం ఇవ్వకపోతే ఎలాంటి పనులు కావడం లేదని 47.9 శాతం మంది ప్రజలు తెలుపగా, 28.4 శాతం ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. 3. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల పనితీరు అధ్వానంగా ఉందని 50.2 శాతం మంది చెప్పగా, అస్సలు బాగా లేదని 31.3 శాతం చెప్పారు. 4. నిజాయితీగా పనిచేసే అధికారులు మీ ప్రాంతంలో ఉన్నారా అన్న ప్రశ్నకు అత్యధికంగా 20 శాతం లోపే ఉన్నారని 54 శాతం మంది ప్రజలు తమ సర్వేలో తెలిపారు. 5. బ్రోకర్ల వ్యవస్థ ద్వారానే అవినీతి పెరగడానికి ప్రధాన కారణమని 50 శాతం తెలిపారు. 6. అవినీతి నిర్మూలన కోసం యాంటీ కరప్షన్ బ్యూరో విజిలెన్స్ కమిషన్ వంటి వాటిపై ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోగా అనేక మంది వీటిపై నమ్మకాన్ని కోల్పోయినట్లు చెప్పారు. 7. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినప్పుడు అధికారుల పనితీరు ఎలా ఉంటుంది, కనీసం గౌరవం ఇస్తున్నారా అని అడగగా 38.4 శాతం పట్టించుకోవడం లేదని, 21.3 శాతం దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. 8. మీ ప్రాంతంలో ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందని అడుగగా బాగా లేదని 64 శాతం మంది చెప్పారు. 9. మీ ఎమ్మెల్యేపై అవినీతి, ఆరోపణలు ఉన్నాయా అని అడిగితే ఉన్నాయని 66 శాతం మంది చెప్పారు. 10. మీ ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా, లేదా అని అడుగగా ఉండడం లేదని 72 శాతం మంది చెప్పారు. 11. 23 ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ఎలా ఉందని ప్రశ్నించగా రెవెన్యూ మొదటి స్థానం, రిజిస్ట్రేషన్ రెండో స్థానం, పోలీస్ మూడో స్థానం, మున్సిపాలిటీ నాలుగో స్థానం, రాజకీయాలు ఐదో స్థానంలో నిలిచాయి.
ఆవినీతిపరులు తప్పించుకుంటున్నారంటే వారి చుట్టూ రక్షణ కవచాలు అనేకం ఉన్నాయి. అందులో మొదటిది కనపడని లంచాల తీగ. లంచగొండులకు తీగ ఎంత పొడవు ఉంటే అంత ప్రయోజనం. మీకు ఓ ఉదాహరణ చెబుతా.... 1. ఆ మధ్య నకిలీ ఉన్నత చదువుల సర్టిఫికెట్లు పెట్టిన ఉపాధ్యాయులు వందలలో ఉండడంతో ప్రభుత్వం ఏమీ చేయలేక తదుపరి చర్యలు ఆపేశారు. 2. ముంబై నుంచి వస్తున్న కారులో పెట్రోల్ పంపులో వాడే దొంగ చిప్స్ దొరికాయి. వాటిని కొనుక్కుని వాడిన పెట్రోల్ పంపులు అనేకం ఉండడంతో ఆ కేసు పక్కకు పెట్టేశారు. ఒక్కొక్క లంచాల తీగ చివరికి ఒక ప్రముఖ వ్యక్తి దగ్గరకి చేరుతుంది. అందుకని, అవినీతి నిరోధక అధికారులు లంచాల తీగను అస్సలు గుంజరు. ఎంత పెద్ద తిమింగలం ఉంటే అంత రక్షణ. ఎందుకంటే వీరు తీసుకున్న నిర్ణయం ఇంకెవరో పెద్ద మనిషికి లాభం అయ్యింది. వారు సాక్ష్యం చెప్పరు. ఆ కారణంగా పట్టుబడిన అధికారి మీద లంచం ఆరోపణ నిలవదు. కేవలం ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల గురించి మాత్రమే కేసు ఉంటుంది. దాని నుంచి తొందరగానే బయటపడతారు. 3. ఇక మూడవది, కులం, మతం, ప్రాంతం. ఈ మధ్య ఇది బాగా కనపడుతున్నది. 4. నాలుగవది, లోపాయికారిగా ఆవినీతిపరులకు అండగా ఉండే ఉద్యోగ సంఘాలు. ప్రతి సంఘం అదే పని చేయకపోవచ్చు. ఉద్యోగ సంఘాలను అవినీతిపరులు రక్షణ కవచంగా వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. అధికారి తన విధులలో భాగంగా డబ్బు తీసుకుంటేనే అవినీతి అనుకుంటున్నాం. అధికారులు తమ అధికారాన్ని వ్యక్తిగత లాభాల కోసం దుర్వినియోగం చేయడాన్ని కూడా అవినీతిగా భావించాలి. అధికారం ఉపయోగించకపోవడం, సద్వినియోగం చేయకపోవడం కూడా అవినీతిలో భాగమే. రాజకీయ నాయకుల అవినీతి చిట్టా చాంతాడు అంత ఉంటుంది. అవినీతికి చిరునామాగా మారిన రాజకీయ వ్యవస్థ మారనంతకాలం అవినీతిని నుంచి పారదోలడం అత్యాసే అవుతుందని మాత్రం ఘంటాపథంగా చెప్పవచ్చు.