
"ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్లను చివరి పనిదినాన్నే అందించాలి"
"ఉద్యోగులను ఈసడించుకోవడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతా రాహిత్యమే.."
సివిల్ సొసైటీ ,ఉద్యోగుల సహకారంతోనే తెలంగాణలో అధికారంలోకి వచ్చామని ఇటీవల ప్రకటించిన రాహుల్
మర్చిపోయిన సిఎం రేవంత్ రెడ్డి
రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్ లకు సంబంధించిన డబ్బులను ఆఖరి పనిదినాన్నే అందించాలనీ, ఇప్పటికే ప్రభుత్వం బకాయిపడ్డ నిధులను వెంటనే విడుదల చేయాలని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గురువారం బాగ్లింగంపల్లిలోని సంస్థ కేంద్ర కార్యాలయంలో ఉద్యోగుల ఉపాధ్యాయుల కన్వీనర్ జోగు శ్రీనివాస్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో దాసు సురేశ్ మాట్లాడుతూ ఒక్కొక్క ఉద్యోగి దాదాపుగా 30 నుంచి 35 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలు అందించి పదవి విరమణ చేయగా వారికి రావలసిన పిఎఫ్, గ్రాడ్యూటీ, వేతన సవరణ బెనిఫిట్, జిపిఎఫ్, లీవ్ ఎన్కాష్మెంట్ లకు సంబంధించిన డబ్బులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక బందులకు గురవుతున్నారని చెప్పారు. పిల్లల పెళ్లిళ్లు, కుటుంభ సభ్యుల ఆరోగ్యం,చదువులకు కావాల్సిన డబ్బులు సర్దుబాటు కాక వారు తీరు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులకు తీసుకొచ్చి వాటిని తిరిగి సకాలంలో చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు.
కొంతమంది కోర్టులను ఆశ్రయించి తమకు రావాల్సిన డబ్బుల కోసం పోరాడుతున్నారని చెప్పారు. వీరందరికీ న్యాయం చేయాల్సిన సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కలు వీరికి ఇవ్వాల్సిన డబ్బులకు నిధులు కేటాయించకుండా ప్రైవేట్ కాంట్రాక్టర్ల బిల్లులు మాత్రం జాప్యం లేకుండా చెల్లించడం ఎంతవరకు సబబు అని ఆయన ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనల ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, తెలంగాణ రైసింగ్ అంటూనే మరోపక్క ఇప్పుడు తన వద్ద డబ్బులు లేవని తనను కోసినా రూపాయి రాదని ఉద్యోగులను మానసిక వేదనకు గురి చేయడం తగదన్నారు.
సివిల్ సొసైటీ ,ప్రభుత్వ ఉద్యోగులు నిరుద్యోగులు పదవి విరమణ పొందిన ఉద్యోగుల అండదండలతో అధికారంలోకి వచ్చామని ఇటీవల హైదరాబాద్లో ఒక సమావేశంలో రాహుల్ గాంధీ వెల్లడించిన విషయాన్ని ఈ సందర్భంగా దాసు సురేశ్ గుర్తు చేశారు.. ఉద్యోగ సంఘాల నాయకులు సైతం ఉద్యోగుల పక్షాన తమ పోరాటాన్ని తీవ్రతరం చేయాలన్నారు, వారు నిర్ణయించే కార్యాచరణలో తెలంగాణ సమాజం సైతం భాగస్వామ్యమవుతుందని, అన్ని జిల్లాల నుండి బీసీ రాజ్యాధికార సమితి కార్యవర్గం ఉద్యోగులకు అండగా ఉండనుందని తెలిపారు.త్వరలోనే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన రాహుల్ గాంధీకి లేఖ రాయడంతో బాటు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ను కలిసి సమస్యలను వివరించనున్నామన్నారు..
ఈ కార్యక్రమానికి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు తులసి సత్య నారాయణ, ఎంబీసీ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటేశ్వర్లు ,రిటైర్డ్ సూపెరింటెండ్ ఇంజనీర్ సురేశ్ , ఉపాధ్యాయ నాయకులు కొండా రామ్ మోహన్, బీసీ రాజ్యాధికార సమితి సికింద్రాబాద్ నియోజకవర్గ కన్వీనర్ బొమ్మ నరేందర్ ,గ్రేటర్ హైదరాబాద్ మహిళా అధ్యక్షురాలు బండారు పద్మావతి,ఉపాధ్యక్షురాలు
తాళ్ల భాగ్య లక్ష్మి, సీనియర్ మహిళా నాయకురాలు కరుణశ్రీ, మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా నాయకులు కృష్ణ గౌడ్ ,గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి జ్యోతి గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ సీనియర్ సిటిజన్ సమితి కార్యదర్శి శారద, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు..
Next Story