జపాన్ వ్యాపారవేత్తలకు రేవంత్ ఆహ్వానం
x

జపాన్ వ్యాపారవేత్తలకు రేవంత్ ఆహ్వానం

తెలంగాణ, జపాన్‌ల మధ్య ఉన్న చారిత్రక స్నేహాన్ని దీర్ఘకాల భాగస్వామ్యంగా మార్చుకుందామని, కలిసి పనిచేద్దామని రేవంత్ పేర్కొన్నారు.


ఒసాకా ఎక్స్‌పోలో ప్రారంభించిన తెలంగాణ పెవెలియన్ ద్వారా జపాన్ వ్యాపారవేత్తలను తెలంగాణకు ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడులకు తెలంగాణ చాలా మంచి డెస్టినేషన్ అని చెప్పారు. ఇన్వెస్టర్స్‌కు తెలంగాణ ప్రభుత్వం అనేక రాయితీలు అందిస్తుందని వివరించారు. ఈ మేరకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటూ జపాన్ వ్యాపారవేత్తలను ఆహ్వానించారు. తెలంగాణలో పర్యటించాలని కోరారు. సదస్సులో భాగంగా తెలంగాణ రైజింగ్ బృందం.. పలువురు వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో వేరువేరుగా సమావేశమైంది. వివిధ రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అపారమైన అవకాశాలను వారితో చర్చించింది.

‘‘ఒసాకాలో జరుగుతున్న వరల్డ్ ఎక్స్​ పోలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ పాలుపంచుకోవటం గర్వంగా ఉంది. తెలంగాణ, జపాన్‌ల మధ్య ఉన్న చారిత్రక స్నేహాన్ని దీర్ఘకాల భాగస్వామ్యంగా మార్చుకుందాం. కొత్త ఆవిష్కరణలతో భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు కలిసి పనిచేద్దాం. ప్రభుత్వం అనుసరిస్తున్న స్థిరమైన విధానాలు, సులభతర పారిశ్రామిక విధానం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు తెలంగాణలో ఉన్నాయి. ‘హైదరాబాద్‌కు రండి.. మీ ఉత్పత్తులు తయారు చేయండి.. భారత మార్కెట్‌తో పాటు ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు తెలంగాణను గమ్యస్థానంగా ఎంచుకొండి..’’ అని జపాన్ కంపెనీలను సీఎం తెలంగాణకు ఆహ్వానించారు.

తెలంగాణకు జపాన్ మధ్య చక్కటి సంబంధాలున్నాయని, ఒసాకా బేలో సూర్యోదయం లాంటి కొత్త అధ్యాయం తెలంగాణలో ప్రారంభమవుతోందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. తెలంగాణతో పాటు ఒసాకా, ప్రపంచంతో కలిసికట్టుగా అద్భుతమైన భవిష్యత్తును నిర్మిద్దామని పిలుపునిచ్చారు. ఐటీ, బయో టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ ఇప్పటికే ప్రత్యేకమైన గుర్తింపు సాధించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. వీటితో పాటు ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, టెక్స్​టైల్స్​ రంగాల పరిశ్రమలకు ఉన్న అనుకూలతలను వివరించారు. హైదరాబాద్ లో 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ’ని నిర్మిస్తున్నామని, ఎకో, ఎనర్జీ, స్మార్ట్ మొబిలిటీ, సర్క్యులర్ ఎకానమీపై ఈ సిటీ ఆధారపడుతుందన్నారు.

జపాన్‌కు చెందిన మారుబెని కార్పొరేషన్‌తో ఫ్యూచర్ సిటీలో ఇండస్ట్రియల్ పార్క్ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ చుట్టూ 370 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్ (ఆర్‌ఆర్‌ఆర్), రేడియల్ రోడ్లతో పాటు ఆర్ఆర్ఆర్కు ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) మధ్య ఉన్న జోన్‌లో ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, ఏరోస్పేస్ పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందన్నారు. ఎగుమతులకు వీలుగా సమీప ఓడరేవుతో అనుసంధానించే డ్రై పోర్ట్ ను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. మూసీ పునరుజ్జీవనంలో భాగంగా నది పొడవునా 55 కిలోమీటర్ల అర్బన్ గ్రీన్ వే అభివృద్ధి చేసేందుకు టోక్యో, ఒసాకా నగరాలను చూసి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని అన్నారు.

Read More
Next Story