
ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్.. మంత్రుల శాఖలు, అసంతృప్తులపై హైకమాండ్ తో చర్చలు
మంత్రివర్గ విస్తరణ తరువాత కొందరు నేతలు అసమ్మతి రాగం అందుకోవడంపైనా , కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీసినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోమారు ఢిల్లీ వెళ్లారు. కొత్తగా ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకున్న నేపధ్యంలో కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు, పాత వారి శాఖలలో మార్పులపై సీఎం అధిష్టానం పెద్దలతో చర్చిస్తారు. కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేసిన వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ లకు నిన్ననే శాఖలు కేటాయిస్తారని భావించినా,ఇందుకోసం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లడంతో ఆసక్తి నెలకొంది. మంత్రుల శాఖలలో భారీ ఎత్తున మార్పులు ఉంటాయా అన్న చర్చ జరుగుతోంది.
అలకలు,బుజ్జగింపులపై అధిష్టానం ఆరా
మంత్రివర్గ విస్తరణ తరువాత కొందరు నేతలు అసమ్మతి రాగం అందుకోవడంపైనా , కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఈ అంశంపైనా రేవంత్ పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతారు. పీసీసీ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అసంతృప్తి నేతల ఇళ్లకు వెళ్లి చర్చించిన అంశం, వారిని బుజ్జగించేందుకు ఇచ్చిన హామీలపైనా పార్టీ పెద్దలతో రేవంత్ చర్చిస్తారు.
తమకు మంత్రి పదవులు గ్యారెంటీ అని ఆశలు పెట్టుకున్న సీనియర్ ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు మంత్రివర్గ విస్తరణలో పార్టీ అధిష్టానం వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుపట్టారు. బహిరంగంగా అసంతృప్తి వ్యక్తంచేసి, అవసరమైతే పార్టీ వీడడానికీ సిద్దమంటూ అల్టిమేటం ఇచ్చారు. అయితే మంత్రివర్గంలో ఇంకా మూడు బెర్తులు ఖాళీగా వుండటం, మిగిలిన పలు పదవులు భర్తీ చేయాల్సి వుండటంతో వీటన్నింటిపై ముఖ్యమంత్రి పార్టీ హైకమాండ్ పెద్దలతో చర్చించనున్నారు.