ఆ మాటలు రేవంత్ చరిత్రలో మాయని మచ్చలే: కవిత
x

ఆ మాటలు రేవంత్ చరిత్రలో మాయని మచ్చలే: కవిత

బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు రావడానికి బీఆర్ఎస్ పార్టీ కృష్టి ఫలితం ఎంతో ఉందని కవిత అన్నారు.


తెలంగాణ రాష్ట్ర అప్పులు ఎప్పుడూ హాట్ టాపిక్‌గా నిలుస్తుంటాయి. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిందని కాంగ్రెస్ నేతలు అవకాశం దొరికినప్పుడల్లా విమర్శిస్తుంటారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం కాంగ్రెస్‌ చెప్పేవన్నీ అబద్ధాలే అని ప్రతివిమర్శలు చేస్తుంటుంది. తాజాగా ఇదే అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ఇకనైనా అబద్ధాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర అప్పులు రూ.4.42 లక్షల కోట్లు అని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించిందని, అయినా రేవంత్ మాత్రం బీఆర్ఎస్ హాయంలో రాష్ట్ర అప్పులు రూ.8 లక్షలు అంటూ అసత్య ప్రచారాలు చేస్తూనే ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఆ అబద్ధాలతోనే ప్రజలు మభ్యపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తోందని విమర్శలు గుప్పించారు. ఇకనైనా రేవంత్ ఈ అబద్ధాలు చెప్పే అలవాటు మానుకోవాలని సూచించారు. సీఎం హోదాలో ఉండి.. ఇలాంటి ఉష్ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ అప్పులపై కాంగ్రెస్ నేతల తప్పులు బయటపడ్డాయని అన్నారు. ‘‘రాష్ట్ర అప్పులు మొత్తం రూ. 4 లక్షల 42 వేలు అని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం రూ 8 లక్షల కోట్లు అప్పులు చేశామని దష్ప్రచారం చేస్తున్నారు. అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ... ఇప్పటికైనా నిజాలు చెప్పాలి. అబద్దాలు చెబుతున్నామని కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుంటే మర్యాదగా ఉంటుంది. కాళేశ్వరం బ్యారేజీలు కూలిపోతాయన్నదానిలో వాస్తవం లేదని స్వయంగా ఇరిగేషన్ మంత్రి మండలిలో చెప్పారు. నీళ్లు ఇవ్వగలిగి ఇవ్వకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం కాదా ? ప్రజా క్షేత్రంలో కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం’’ అని అన్నారు.

‘‘ఏప్రిల్ 27న ఎల్కతుర్తి వద్ద బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవం జరుగుతుంది. మహాకుంభమేళ తరహాలో రజతోత్సవ సభ జరుగుతుంది. 25 వసంతాల బీఆర్ఎస్ పార్టీ ఉత్సవాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలి. శాసన మండలిలో ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ వ్యవహరించింది. సమన్వయంతో అన్ని అవకాశాలను వాడుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. అన్ని చర్చల్లో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాం. ప్రజలు, రైతులు, మహిళలు వంటి అన్ని సమస్యలపై గళమెత్తాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై ప్రతీ రోజూ వినూత్న రీతిలో నిరసనలు తెలిపాం’’ అని గుర్తు చేశారు.

‘‘కేసీఆర్‌పై ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కూడా సభలో నిరసన తెలిపాం. ఫీజు రియింబర్స్ మెంట్ పై మేము చేసిన పోరాటానికి దిగొచ్చింది. ఎప్పటికప్పుడు ఫీజు రియింబర్స్ మెంట్ నిధులను విడుదల చేస్తామని మండలి సాక్షిగా ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ప్రకటన అమలయ్యే వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఈ సమావేశాలు రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతాయి. ఈ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లులు, ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందాయి. ఆ బిల్లులు రావడానికి బీఆర్ఎస్ పార్టీ కృష్టి ఫలితం ఎంతో ఉంది. అసెంబ్లీ సాక్షిగా మహిళలను ఉద్ధేశించి పరుషపదజాలంతో ముఖ్యమంత్రి అసభ్యకరంగా మాట్లాడారు. ఆ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి చరిత్రలో మాయని మచ్చలుగా ఉండిపోయాయి’’ అని కవిత ధ్వజమెత్తారు.

Read More
Next Story