
సూర్యాపేట జనగామ హైవేపై రోడ్డు ప్రమాదం
దంపతులు మృత్యువాత, పిల్లలకు సీరియస్
పెళ్లి వేడుకలో హాజరై తిరుగు ప్రయాణంలో ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులు స్పాట్ లో మృతిచెందగా.. ఇద్దరు చిన్నారులకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయి ఈ ఘటన జనగామ-సూర్యాపేట హైవేపై వడ్డిచర్ల వద్ద బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వడ్లపూడికి చెందిన దద్దోజు సురేశ్, దివ్య తమ ఇద్దరు పిల్లలతో వివాహవేడుకలో పాల్గొనడానికి స్వ గ్రామానికి చేరుకున్నారు.ఈ దంపతులకు లోక్షణ, మోక్షజ్ఞ పిల్లలున్నారు. కరీంనగర్లోని ఓ గ్రానైట్ కంపెనీలో సురేశ్ పనిచేస్తున్నారు. వివాహ వేడుకలో పాల్గొన్న అనంతరం భార్యపిల్లలతో కలిసి బొలెరో వాహనంలో కరీంనగర్ వైపు బయల్దేరారు. మార్గంమధ్యలో లింగాల ఘనపురం మండలం వడ్డిచర్ల నక్షత్ర గార్డెన్ వద్ద వారి వాహనం అదుపుతప్పి కల్వర్టును బలంగా ఢీకొట్టింది. సురేశ్ అక్కడికక్కడే మృతిచెందగా.. దివ్య 108 వాహనంలో ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని జనగామ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.