గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చారిత్రాత్మకం
x

గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చారిత్రాత్మకం

గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తూ మార్గదర్శకాల జీవోను రేవంత్ సర్కార్ విడుదల చేసింది.ఈ ఎక్స్ గ్రేషియాను 18 ఈసీఆర్ దేశాలకు వర్తింపజేయాలి.


(మంద భీంరెడ్డి, ప్రవాసీ వ్యవహారాల విశ్లేషకులు)

'జాతస్య మరణం ధృవం' అంటే... పుట్టిన వారికి మరణం తప్పదు. కానీ అకాల మరణం సంభవించినప్పుడు, అదీ కానరాని దేశంలో అయినప్పుడు, ఆ కుటుంబం పడే వేదన వర్ణనాతీతం. సంపాదించే వ్యక్తి మృతి చెందినప్పుడు ఆ కుటుంబం వీధిన పడుతుంది. సుదూర తీరంలో గల్ఫ్ దేశాలలో మన తెలంగాణ కార్మికులు మరణించిన సందర్భంలో ఆ కుటుంబాలను ఆదుకోవడానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం... తెలంగాణ ప్రభుత్వం తేది:16.09.2024 నాడు నాలుగు అంశాలతో జీవో నెంబర్ 205 ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
గల్ఫ్ దేశాలలో చనిపోయిన తెలంగాణ ప్రవాసి కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) చెల్లింపు అంశం ఇందులో ఒకటి. జీవో నెంబర్ 205 కు కొనసాగింపుగా... రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు కొరకు మార్గదర్శకాలతో కూడిన జీవో నెంబర్ 216 ను తేది:07.10.2024 నాడు ప్రభుత్వం విడుదల చేసింది.
గల్ఫ్ కార్మికుల సంక్షేమం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు దేశ చరిత్రలోనే ప్రథమం.

నిబంధనలు - అర్హత ప్రమాణాలు:
◆ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఓమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో సహా ఇరాక్ లో మరణించినవారికి వర్తింపు.
◆ 2023 డిసెంబర్ 7 న లేదా తర్వాత చనిపోయిన కార్మికులకు
◆ మరణానికి కారణం ఏదైనా (సహజ మరణం, ప్రమాద మరణం, బలవన్మరణం ఏదైనా వర్తిస్తుందని అన్వయింపు)
◆ మరణించిన గల్ఫ్ ఉద్యోగి జీవిత భాగస్వామి, పిల్లలు లేదా తల్లిదండ్రులు ప్రాధాన్యత క్రమంలో (తెలంగాణకు చెందినవారు) ఈ ప్రయోజనం కోసం కుటుంబ సభ్యులుగా పరిగణించబడతారు.
◆ మరణించిన గల్ఫ్ ఉద్యోగి మరణ ధృవీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్)
◆ మరణించిన గల్ఫ్ కార్మికుని రద్దు చేయబడిన పాస్ పోర్ట్ (క్యాన్సల్డ్ పాస్ పోర్ట్)
◆ మరణించిన సమయంలో గల్ఫ్, ఇరాక్ దేశాలలో ఉద్యోగానికి సంబంధించిన రుజువు (ఉదా. వర్క్ వీసా, ఉద్యోగ ఒప్పందం)
◆ మరణించిన గల్ఫ్ కార్మికుని కుటుంబ సభ్యుడు సంబంధిత జిల్లా కలెక్టర్‌కు అవసరమైన పత్రాలతో పాటు దరఖాస్తును సమర్పించాలి.
◆ అర్హులైన దరఖాస్తుదారుల చెల్లుబాటు అయ్యే బ్యాంకు ఖాతా వివరాలు.
◆ ధృవీకరించిన తర్వాత, జిల్లా కలెక్టర్ అర్హతగల కుటుంబ సభ్యునికి చెల్లింపు కోసం ప్రొసీడింగ్స్ రూపంలో ఎక్స్ గ్రేషియా యొక్క అధికారిక మంజూరును జారీ చేస్తారు.
◆ మంజూరైన రూ.5 లక్షలు అర్హత కలిగిన కుటుంబ సభ్యుల (లు) బ్యాంకు ఖాతాకు నేరుగా బదిలీ చేయబడుతుంది
◆ మృతి చెందిన తేదీ లేదా మృతదేహాన్ని స్వీకరించిన తేదీ నుంచి ఆరు నెలల లోపు జిల్లా కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించాలి.
◆ జిల్లా కలెక్టర్లకు మంజూరి అధికారం ఉంటుంది. అనవసరమైన జాప్యాన్ని నివారించి వీలైనంత త్వరగా ఎక్స్‌గ్రేషియాను మంజూరు చేస్తారు.
◆ తెలంగాణ ప్రభుత్వ ఎన్నారై విభాగం అకౌంట్ ద్వారా చెల్లింపులు చేస్తారు.

'గల్ఫ్' తో సహా 18 ఈసీఆర్ దేశాలకు వర్తింపజేయాలి.
విదేశాలకు వెళ్లే మన కార్మికుల భద్రత అంశం, అనుకూలంగా లేని కార్మిక చట్టాలను దృష్టిలో పెట్టుకొని 41 సంవత్సరాల క్రితం భారత ప్రభుత్వం ఎమిగ్రేషన్ యాక్టు-1983 ను రూపొందించింది. 18 దేశాలను ఈసీఆర్ దేశాలుగా వర్గీకరించారు. ఈసీఆర్ అంటే... ఎమిగ్రేషన్ క్లియరెన్స్ రిక్వయిర్డ్ (విదేశాలకు వెళ్ళడానికి ప్రభుత్వ అనుమతి అవసరమైన) అని అర్థం.
తెలంగాణ ప్రభుత్వం తన సంక్షేమ చర్యల్లో భాగంగా విడుదల చేసిన జీవో ను ఆరు అరబ్ గల్ఫ్ దేశాలైన బహ్రెయిన్, కువైట్, ఓమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో సహా ఇరాక్ లో మరణించిన వారికి వర్తింపజేశారు. ప్రవాసీ కార్మికులపై సీఎం రేవంత్ మరింత దయతో ఉదారంగా వ్యవహరించాలని విజ్ఞప్తులు వస్తున్నాయి.

ఇవీ 18 ఈసీఆర్ దేశాలు:
1. బహ్రెయిన్, 2. కువైట్, 3. ఓమాన్, 4. ఖతార్, 5. సౌదీ అరేబియా, 6. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, 7. ఇరాక్, 8. ఆఫ్ఘనిస్తాన్, 9. జోర్డాన్, 10. లెబనాన్, 11. లిబియా, 12. మలేసియా, 13. సుడాన్, 14. సౌత్ సుడాన్, 15. సిరియా, 16. యెమెన్, 17. ఇండోనేసియా, 18. థాయిలాండ్. వీటితో పాటు సింగపూర్, ఇజ్రాయిల్, కాంబోడియా, రష్యా, ఉక్రేన్, మాల్దీవ్స్ తదితర దేశాలలో ఉన్న వారికి కూడా వర్తింపజేయాలని విజ్ఞప్తులు వస్తున్నాయి.



ఆధారాలు సమర్పించాలనే నిబంధన సడలించాలి

మరణించిన సమయంలో గల్ఫ్, ఇరాక్ దేశాలలో ఉద్యోగానికి సంబంధించిన రుజువు (ఉదా. వర్క్ వీసా, ఉద్యోగ ఒప్పందం) ఉన్నట్లు ఆధారాలు సమర్పించాలి అనే నిబంధనతో చాలా మంది ఆందోళనతో ఉన్నారు. యజమానుల హింసలు భరించలేక పారిపోయిన వారు, కొందరు ఏజెంట్లు పర్మనెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని విజిట్ వీసాపై విదేశాలకు తీసికెళ్ళి వదిలేసిన సందర్భంలో 'ఖల్లివెల్లి' (అక్రమ నివాసులు) గా మారిన వారికి ఈ పథకం వర్తించకపోతే చాలా మందికి అన్యాయం జరుగుతుందని చర్చ నడుస్తోంది.

ప్రవాసీ కార్మికులపై ఉదారంగా వ్యవహరించాలి
ప్రవాసీ కార్మికులపై సీఎం రేవంత్ మరింత దయతో ఉదారంగా వ్యవహరించాలని నిబంధనలు సడలించి ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరేలా చేయాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. త్వరలో నియమించే సలహా కమిటీ ఈ సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని ప్రవాసుల కుటుంబాలు ఆశాభావంతో ఉన్నాయి.




Read More
Next Story