బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
x

బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణ బీఎస్పీ మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. గులాబీ అధినేత సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.


తెలంగాణ బీఎస్పీ మాజీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. ఆర్ఎస్పీ కొద్దిసేపటి క్రితం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్ళారు. అక్కడే గులాబీ అధినేత సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఖరారైన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ బీఎస్పీకి రాజీనామా చేశారు.

"పొత్తు రద్దు చేసుకోవాలని బీఎస్‌పీ తనపై ఒత్తిడి తీసుకురావడం వల్లే రాజీనామా చేయాల్సి వచ్చింది" అని ఆయన వివరణ ఇచ్చారు. శ్రేయోభిలాషులు, ముఖ్య అనుచరులతో చర్చల అనంతరం ఆదివారం రాత్రి బీఆర్ఎస్ లో చేరుతున్నట్టు స్వయంగా ఆయనే ఎక్స్ వేదికగా ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ ఆయనకి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకే..

గులాబీ పార్టీలో చేరిన అనంతరం ఆర్‌ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వాదం, బహుజనవాదం రెండు ఒక్కటే అని, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉన్నారని తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యేందుకు బీఆర్ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటించారు.

"నేను ఎటువంటి ప్యాకేజీలకు లొంగే వాడిని కాదు. నేను ఏదో ఆశించి పార్టీలోకి రాలేదు. ఏదైనా ఆశించే వాడిని అయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకే వెళ్లేవాడిని కదా. నాలో ఎటువంటి స్వార్థం లేదు. నా గుండెల్లో బహుజన వాదం ఉంటుంది. మీరు గేట్లు తెరిస్తే పిరికిపందలు, అసమర్థులు, స్వార్థపరులు గొర్రెల మందలా వెళ్తున్నారు. ఆ గొర్రెల మందలో నేనూ ఒక్కణ్ని కాలేను. సీఎం రేవంత్ రెడ్డి టీఎస్‌పీఎస్సీ ఆఫర్ ఇచ్చిన మాట వాస్తవమే.. కానీ నేను తిరస్కరించాను‌. ఎవరైనా ఎక్కడైనా పని చేసుకునే స్వేచ్ఛ ఉంది. తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పుకోవాలని రేవంత్ రెడ్డి నన్ను సున్నితంగా హెచ్చరిస్తున్నారు. నాకు నా రాజకీయ నిర్ణయం తీసుకునే స్వేచ్చ లేదా? నేనూ పాలమూరు బిడ్డనే.. నడిగడ్డ గాలి పీల్చే పెరిగాను. రేవంత్ రెడ్డి ఇలాంటి హెచ్చరికలు మానుకోవాలి’’ అని ఆర్‌ఎస్పీ అన్నారు.

Read More
Next Story