రాజకీయాల్లో సానియామీర్జా? హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి?
x
Tennis Star Sania Mirza

రాజకీయాల్లో సానియామీర్జా? హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి?

టెన్నిస్ సంచలనం సానియామీర్జా రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారా? అంటే కాంగ్రెస్ పార్టీ వర్గాలు అవునంటున్నాయి. హైదరాబాద్ నుంచి సానియా బరిలోకి దిగనున్నారని సమాచారం.


సానియా మీర్జా...పరిచయం అక్కర్లేని పేరు...టెన్నిస్ ప్రపంచంలో వెలుగొందిన స్టార్ క్రీడాకారిణి. దేశానికి ఎన్నెన్నో పతకాలను తీసుకువచ్చి భారతదేశ ప్రతిష్ఠను ప్రపంచ వ్యాప్తంగా పెంచిన ఘనత ఆమెది...పెళ్లి అయి ఇటీవల విడాకులు తీసుకొని, తన చిన్నారి కుమారుడితో జీవనం గడుపుతున్న స్టార్ క్రీడాకారిణి సానియా పేరు ప్రస్థుతం పార్లమెంట్ ఎన్నికల వేళ వెలుగులోకి వచ్చింది. బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ కమిటీ సమావేశం కానున్న నేపథ్యంలో సానియా రాజకీయ ఆరంగ్రేటం చేస్తారని హస్తిన వర్గాల సమాచారం.


సానియాతో అజహరుద్దీన్‌కు బంధుత్వం
టీం ఇండియా కెప్టెన్ గా పనిచేసి రాజకీయ రంగప్రవేశం చేసిన అజహరుద్దీన్ సానియా మీర్జాకు సమీప బంధువు. గతంలో ఇద్దరూ క్రీడాకారులైనా సానియా చెల్లెలి పెళ్లితో వారి మధ్య బంధుత్వం ఏర్పడింది. అజహరుద్దీన్ గతంలో కాంగ్రెస్ ఎంపీగా కూడా పనిచేశారు. అజహరుద్దీన్ తన కుమారుడి అసద్ కు సానియామీర్జా చెల్లెలు ఆనంమీర్జాతో వివాహం జరిపించారు. అసద్-ఆనంమీర్జాల పెళ్లితో అజహరుద్దీన్ సానియామీర్జాకు దగ్గరి బంధువయ్యారు. దీంతో హైదరాబాద్ ఎంపీ బరిలో సానియా మీర్జాను బరిలోకి దించాలని కాంగ్రెస్ నాయకుడైన అజహరుద్దీన్ ప్రతిపాదించినట్లు హస్తిన కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

గత క్రీడాశాఖ మంత్రి శ్రీనివాసగౌడ్ ను కలిసిన అజహరుద్దీన్, సానియామీర్జా


గతంలో తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడర్

తెలంగాణ గత బీఆర్ఎస్ పాలనలో సానియామీర్జా తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడరుగా ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సానియా పలు సార్లు కలిసినా, అప్పట్లో టెన్నిస్ క్రీడాకారిణిగానే ఉన్నారు. హైదరాబాద్ పార్లమెంట్ బరిలో ముస్లిం ఓటర్లు 50శాతానికి పైగా ఉండటంతోపాటు స్టార్ ఇమేజ్ ఉన్న సానియా మీర్జాను ఎన్నికల బరిలోకి దించితే విజయం ఖాయమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ నేతలతోపాటు తన సమీప బంధువు అయిన అజహరుద్దీన్ సానియా మీర్జాతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

నేటి నుంచి ‘దావత్-ఎ-రమజాన్ కార్యక్రమంలో సానియా

సానియా మీర్జా, ఆమె సోదరి ఆనంమీర్జా రమజాన్ ఎక్స్ పో ‘దావత్-ఎ-రమజాన్ కార్యక్రమంలో భాగంగా ఈద్ ముందు బుధవారం నుంచి ఏప్రిల్ 10వతేదీ వరకు తన అభిమానులను కలవనున్నారు. ఈద్ సందర్భంగా షాపింగ్, ఫుడ్ కార్నివాల్ కు తన అభిమానులను సానియా మీర్జా ఆహ్వానిస్తూ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘‘అస్సలాం వాలేకుం హైదరాబాద్...నేను సానియామీర్జా దావత్ ఎ రమజాన్ కు వస్తున్నా, మీ అందరినీ చూడాలనుకుంటున్నాను’’అని సానియా మీర్జా చెప్పారు. బుధవారం సాయంత్రం సానియా, ఆనంమీర్జాల రమజాన్ ఎక్స్ పోను బాలీవుడ్ నటి రవీనా టాండన్ ప్రారంభించనున్నారు. ఈ ఎక్స్ పోలో ఆహారం, దుస్తులు, ఆభరణాలతో విభిన్న స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. సందర్శకులు హలీమ్, కబాబ్‌లు, బిర్యానీలు, స్వీట్‌లతో సహా వివిధ రకాల రమజాన్ రుచికరమైన వంటకాలను అందుబాటులో ఉంచారు.


సానియా మీర్జాకు ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు

పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ నుంచి విడాకుల తర్వాత సానియా మీర్జాకు తాజాగా ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. ఎన్టీటీవీ వారు అందించిన ఈ అవార్డును అందుకుంటున్న సమయంలో రెడ్ కార్పెట్ పై ఉన్న తన కుమార్తె సానియామీర్జా ఫొటోను ఆమె తండ్రి ఇమ్రాన్ మీర్జా పోస్టు చేశారు. వెలుగు జిలుగుల మధ్య వేదికపై తనదైన మేకప్ తో గ్లామరస్ గా సానియా అవార్డు అందుకుంది.ఈ అవార్డు పొందిన సానియాకు పలువురు అభిమానులు ప్రశంసించారు. ‘‘వావ్ కంగ్రాచ్చులేషన్స్ సానియామీర్జా’’ అంటూ పలువురు నెటిజన్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.


Read More
Next Story