ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ చేతికి టెక్నికల్ ఆధారాలు
x

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ చేతికి టెక్నికల్ ఆధారాలు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్ అధికారులు స్పీడ్ పెంచారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ)లో సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టెక్నికల్ ఆధారాలు సేకరిస్తున్న దర్యాప్తు అధికారులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.


ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్ అధికారులు స్పీడ్ పెంచారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ)లో సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టెక్నికల్ ఆధారాలు సేకరిస్తున్న దర్యాప్తు అధికారులకు కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ కొండాపూర్ లోని కన్వర్జెన్స్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ కార్యాలయంలో సిట్ తనిఖీలు నిర్వహించింది. అక్కడ 3 సర్వర్లు, హార్డ్ డిస్క్ తోపాటు 5 మాక్ మినీ డివైజ్ లను జప్తు చేసింది. ఎస్ఐబీ లో ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ఈ సంస్థే టెక్నాలజీని సమకూర్చింది. దీంతో సిట్ అధికారులు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన యాక్సెస్ లాగ్స్, సెర్చ్ లాగ్స్ కోసం సంస్థ డైరెక్టర్ పాల్ రవికుమార్ కి సిట్ నోటీసులిచ్చి ఇన్ఫర్మేషన్ రాబట్టారు.

ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలు దొరికినట్టు తెలుస్తోంది. సిట్ ఆయనతో మేజిస్ట్రేట్ ముందు 160 సీఆర్పీసీ కింద స్టేట్మెంట్ ఇప్పించింది. ఆ సంస్థ సీనియర్ మేనేజర్ రాగి అనంతచారి, సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఓలేటి సీతారామ శ్రీనివాస్ నుంచి సైతం వాంగ్మూలాలు సేకరించింది. ల్యాబ్స్ జప్తు చేసిన పరికరాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కి తరలించి విశ్లేషించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

సాధారణంగా సంఘవిద్రోహ శక్తులు, కరడుగట్టిన నేరస్థుల ఫోన్లను ట్యాప్ చేసేందుకు మాత్రమే టెలికాం కంపెనీలు పర్మిషన్ ఇస్తాయి. అందుకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఆమోదం తప్పనిసరి. అయితే ప్రభాకర్ రావు టీమ్ మాత్రం చట్టవిరుద్ధంగా బీఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు గుర్తించిన సిట్.. దీనిపై టెక్నికల్ ఎవిడెన్సుల సేకరణకు టెలికాం కంపెనీల నోడల్ ఆఫీసర్లకు 91 సీఆర్పీసీ నోటీసులు జారీ చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ (డీఓటీ)కి సైతం నోటీసులు ఇచ్చింది. వారి నుంచి కూడా సిట్ కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.

కాగా, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గతేడాది ఆగస్టు నుంచి నవంబరు చివరి నాటికి సుమారు 1200 సెల్ ఫోన్లను ట్యాప్ చేసినట్లు దర్యాప్తు బృందం ఇప్పటికే గుర్తించింది. ఎస్ఐబీ మాజీ ఓఎస్టీ ప్రభాకర్ రావు, కీలక నిందితుడు ప్రణీత్ రావు ఆదేశాలతో తాను 60 నుంచి 70 మంది ఫోన్లను ట్యాప్ చేసినట్లు దర్యాప్తు బృందానికి ఓ సీఐ ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చారు. అందులో సిద్దిపేటలో బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా పనిచేసిన చక్రధర్ గౌడ్ తో పాటు రిటైర్డ్ ఇన్స్పెక్టర్ దాసరి భూమయ్య తదితరుల సెల్ ఫోన్ సంభాషణలను విన్నట్లు వెల్లడించారు. అలానే ఎస్ఐబీ తోపాటు టాస్క్ ఫోర్స్ లో క్షేత్రస్థాయిలో కీలకంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బంది పలువురు ప్రభాకర్ రావు బృందం నిర్వాకాలపై వాంగ్మూలాలు ఇస్తుండటంతో కేసు దర్యాప్తు మరింత ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

Read More
Next Story