
సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్.. పలువురు మావోలు హతం..
ఆపరేషన్లో డీఆర్జీ బస్తర్ ఫైటర్ కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులతో పాటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు పాల్గొన్నారు.
ములుగు జిల్లాలోని తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో భద్రతా బలగాలు, మావోయిస్ట్ల మధ్య భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. పక్కా సమాచారం అందడంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు మావోలను చుట్టుముట్టాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోలు హతమయ్యారు. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హిడ్మాతో పాటు మరో 2500 మంది భీమారంపాడు సమాపంలోని కర్రగుట్టలో ఉన్నట్లు నిఘావర్గాలకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతాల్లో భద్రతా బలగాలు రెండు రోజులు కూంబింగ్ చేస్తున్నాయి. అటవీ ప్రాంతం మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నాయి. హెలికాప్టర్లతో మావోలను గుర్తించే ప్రయత్నిం చేశారు అధికారులు. ఈ గాలింపుల సందర్భంగా భీమారంపాటు ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని భద్రతా బలగాలు హెచ్చరించాయి. ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
కూంబింగ్లో భాగంగా దాదాపు 20వేల మంది భద్రతా సిబ్బంది మావోయిస్ట్లను చుట్టుముట్టారు. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు, మావోయిస్ట్ల మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్ట్లు మరణించారు. ఈ ఆపరేషన్లో డీఆర్జీ బస్తర్ ఫైటర్ కోబ్రా, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ సైనికులతో పాటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు పాల్గొన్నారు.
వరంగల్లో లొంగిపోయిన మావోలు
ఛత్తీస్గఢ్లో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలకు, మావోయిస్ట్లకు భీకర ఎదురుకాల్పులు జరుగుతున్న క్రమంలో వరంగల్లో 14 మంది మావోయిస్ట్లు పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ విషయాన్ని ఐజీ చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు. లొంగిపోయిన ఒక్కో మావోయిస్ట్కు రూ.25వేల ఆర్థిక సహాయం అందించినట్లు ఆయన చెప్పారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈరోజు 14 మంది మావోయిస్ట్లు లొంగిపోయారు. వీరిలో ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. మావోయిస్ట్లు హింసాయుత విధానాలు వదిలివేసేలా చేయడమే మా ఉద్దేశం. ఏ రాష్ట్రానికి చెందిన మావోయిస్ట్లు వచ్చి లొంగిపోయినా సహకరిస్తాం. జనజీవన స్రవంతిలో కలిస్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’’ అని ఆయన చెప్పారు.