రేవంత్ సర్కార్ కి ఝలక్... కేసీఆర్ కి అనుకూలంగా తీర్పు
x

రేవంత్ సర్కార్ కి ఝలక్... కేసీఆర్ కి అనుకూలంగా తీర్పు

విద్యుత్ ఎంక్వైరీ కమిషన్ ని రద్దు చేయాలని కేసీఆర్ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.


విద్యుత్ ఎంక్వైరీ కమిషన్ ని రద్దు చేయాలని కేసీఆర్ సుప్రీం కోర్టులో వేసిన పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసీఆర్ కి అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. దీంతో రేవంత్ సర్కార్ కి ఝలక్ తగిలినట్లైంది. వాదనలు విన్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కీలక తీర్పు వెల్లడించారు. కమిషన్ చైర్మన్ నరసింహారెడ్డిని మార్చి విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేసీఆర్ పిటిషన్..

బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేసింది. విద్యుత్ కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందంటూ ఆరోపించింది. వీటిపై విచారణ జరిపేందుకు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నరసింహారెడ్డితో కూడిన కమిషన్ ని ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ వెంటనే విచారణ ప్రారంభించింది. అందులో భాగంగా కమిషన్ కేసీఆర్ కి నోటీసులు పంపింది. భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణంతోపాటు ఛత్తీస్ గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ నోటీసుల్లో పేర్కొంది.

కమిషన్ ఇచ్చిన నోటీసులపై స్పందించిన కేసీఆర్.. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కి 12 పేజీలతో కూడిన లేఖ రాశారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని ఆయన ఆరోపించారు. తమ హయాంలో విద్యుత్ విషయంలో గణనీయ మార్పు చూపించామన్నారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్ ని అందించామన్నారు. ఆ తరువాత కేసీఆర్ హైకోర్టుకు వెళ్లారు. ఆయన వేసిన పిటిషన్ పై రాష్ట్ర హైకోర్టు జూన్ 28న విచారణ ప్రారంభించింది. విచారణ సందర్భంగా... ప్రభుత్వం, కేసీఆర్ తరపున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. వీరి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అనంతరం జులై 1న కేసీఆర్ వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. కమిషన్ ఏర్పాటును సమర్ధిస్తూ... విచారణ ఎదుర్కోవాల్సిందే అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

హైకోర్టు ఇచ్చిన తీర్పుతో విచారణకి హాజరవ్వాలంటూ కమిషన్ నోటీసులు ఇచ్చిన మేరకు కేసీఆర్ విచారణకి హాజరు కావాల్సి ఉంటుంది. కానీ ఆయన మొదటి నుంచి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ని తప్పుబడుతూ ఉన్నారు. దీంతో ఆయన హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

సుప్రీంకోర్టులో కేసీఆర్ కి అనుకూలంగా తీర్పు...

విద్యుత్ ఎంక్వైరీ కమిషన్ రద్దు చేయాలని కేసీఆర్ వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు నేడు విచారణ జరిపింది. కేసీఆర్ తరపున న్యాయవాది ముకుల్ రోహత్గా వాదనలు వినిపించారు. జుడీషియరీ కమీషన్ నియామకం చట్ట ప్రకారం జరగలేదని ఆయన వాదించారు. మాజీ సీఎం పిటిషన్ ను పూర్తిగా విచారణ చేయకముందే హైకోర్టు కొట్టేసిందని తెలిపారు. తాము రిప్లై ఇవ్వకుండానే పిటిషన్ డిస్మిస్ చేసిందన్నారు. జుడీషియరీ కమీషన్ ఛైర్మెన్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎంక్వైరీ పూర్తవ్వకముందే జస్టిస్ నర్సింహారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ కేసీఆర్ తప్పు చేశారని చెప్పినట్లు కోర్టుకు తెలిపారు. విచారణ పూర్తవ్వకముందే కేసీఆర్ ని దోషిగా తేలుస్తున్నారని ముకుల్ రోహత్గా వాదించారు.

అయితే, నరసింహారెడ్డి ప్రెస్ మీట్ లో కేవలం ఎంక్వైరీ స్టేటస్ మాత్రమే చెప్పారని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకి తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డ సమయంలో విద్యుత్ ఇబ్బందులు ఉండటంతో ఛత్తీస్ ఘడ్ తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నారని కేసీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. రూ.3:90 పైసలకు యూనిట్ చొప్పున విద్యుత్ కొనుగోలు జరిగిందని చెప్పారు. అయితే ఓపెన్ బిడ్డింగ్ వేయకుండా నెగోషియేషన్ ప్రకారం ఎందుకు పవర్ కొన్నారని చీఫ్ జస్టిస్ ప్రశ్నించగా.. అత్యవసర సమయంలో టెండర్లు వేయకుండా విద్యుత్ కొనుగోలు చేసే అవకాశం ఉంటుందని కేసీఆర్ న్యాయవాది కోర్టుకు స్పష్టం చేశారు.

కేసీఆర్ తో పాటు ఇతర విద్యుత్ అధికారులకు నోటీసిలు ఇచ్చామని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. పార్లమెంట్ ఎలక్షన్స్ వల్ల జూన్ 30 వరకు రిప్లై ఇవ్వలేమని కేసీఆర్ చెప్పారని అన్నారు. దేశవ్యాప్తంగా పవర్ ప్రాజెక్టులు అన్ని సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో నిర్మిస్తుంటే, భద్రాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీ తో నిర్మించారు. దీంతో ప్రభుత్వ ఖజానాకి వ్యయం పెరిగిందని ఆయన కోర్టుకి తెలియజేశారు.

ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్.. ప్రెస్ మీట్ లో జస్టిస్ నరసింహారెడ్డి తన సొంత ఒపినియన్ చెప్పినట్లు అనిపిస్తుందన్నారు. విచారణ జరుగుతున్న టైమ్ లో ప్రెస్ మీట్ పెట్టొద్దు కదా అని అన్నారు. జూడిషియల్ కమిషన్ చైర్మన్ ను మార్చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొత్త ఛైర్మెన్ ను నియమించి విచారణ కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది. కొత్త ఛైర్మన్ ఎవరిని నియమిస్తామనేది జూలై 16న మధ్యాహ్నం చెబుతామని తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది సుప్రీం కోర్టుకు తెలిపారు.

Read More
Next Story