రేవంత్‌తో బాలకృష్ణ భేటీ.. ఆంతర్యమేంటో..!
x

రేవంత్‌తో బాలకృష్ణ భేటీ.. ఆంతర్యమేంటో..!

హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత, సినీ నటుడు బాలకృష్ణ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటి కావడం ఎన్నికల హీట్‌ను మరింత పెంచుతున్నాయి. వీరి భేటీపై అనేక అనుమానాలు..


సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. ఇప్పుడు హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ నేత, సినీ నటుడు బాలకృష్ణ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో భేటి కావడం ఈ ఎన్నికల హీట్‌ను మరింత పెంచుతున్నాయి. వీరి భేటీపై అనేక అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. దానికి తోడుగా ఇటీవల తిరుపతిని సందర్శించిన రేవంత్ రెడ్డి అక్కడ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత కీలకంగా మారుతున్నాయి. అంతేకాకుండా టీడీపీ, రేవంత్ రెడ్డి మధ్య సంబంధాలపై కూడా అనేక అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. కౌంటింగ్ చేరువలో ఉన్న సమయంలో వీరెందుకు భేటీ అయ్యారు? రాష్ట్ర విభజన సమయంలో ఒప్పందం ప్రచారం రెండు రాష్ట్రాల మధ్య జరగాల్సిన పంపకాల గురించేనా? లేకుంటే మరేదైనా విషయమా? అన్నదే ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా ఉంది.

ఐదు నెలల్లో రెండో సారి

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయనను బాలకృష్ణ రెండుసార్లు కలిశారు. తొలిసారి డిసెంబర్‌లో తెలంగాణ సచివాలంలో భేటీ అయ్యారు. మరోసారి ఆదివారం అంటే ఈరోజు భేటీ అయ్యారు. ఈ భేటీలో బాలకృష్ణతో పాటు బసవతారకం ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు కూడా ఉన్నారు. బాలకృష్ణ, రేవంత్ ఇద్దరూ అనేక అంశాలపై చర్చించుకున్నట్లు సంబంధిత వర్గాలు చెప్తున్నాయి. వీటిలో ఆంధ్ర రాజకీయ పరిస్థితుల అంశం కూడా ఉన్నట్లు సమాచారం. ఈ సందర్బంగానే ఆంధ్రలో ప్రభుత్వం మారుతుందనడానికి వీరిద్దరి భేటీ నిదర్శనమని పలువురు చెప్తున్నారు. దానికి తోడు ఈ అంశం తెలిసే తిరుపతిని సందర్శించిన సమయంలో రేవంత్ ఆ వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు వీరు కలవడం ఆయన వ్యాఖ్యలను బలపరుస్తున్నాయన్న చర్చ కూడా జరుగుతోంది.

ఇంతకీ రేవంత్ ఏమన్నారు!

‘‘ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడే కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమం కోసం కలిసి పని చేస్తాం’’ అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు బాలకృష్ణ, రేవంత్ భేటి అయ్యింది కూడా భవిష్యత్తులో టీడీపీ ప్రభుత్వం వస్తే ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలా కలిసి పనిచేయాలని, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించాలని అన్న అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది.

వాళ్లే క్లారిటీ ఇవ్వాలి

అయితే అసలు వీరిద్దరూ ఏ అంశాలపై చర్చించారన్న అంశంపై రెండు రాష్ట్రాల్లో ఒకటే చర్చ జరుగుతుంది. కానీ అసలు వీరు ఏ అంశాలపైన చర్చించారన్నది మాత్రం క్లారిటీ లేదు. ఈ అంశంపై ప్రతి ఒక్కరూ అంటున్న మాట.. అసలు ఏం చర్చించారన్నది వారే చెప్పాలని. మరి వారు ఈ భేటి ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Read More
Next Story