టాప్ 100 సివిల్స్ విజేతల్లో 21 మందికి ఆయనే మెంటార్..
x

టాప్ 100 సివిల్స్ విజేతల్లో 21 మందికి ఆయనే మెంటార్..

నేరుగా వారికి పాఠాలు చెప్పలేదు కానీ.. వాట్సాప్ ద్వారా వారికి అనేక మెళవకువలను నేర్పారు. పరీక్ష రాయడం దగ్గర నుంచి ఇంటర్వ్యూని ఎలా ఎదుర్కోవాలి అనే అంశం వరకు వారికి స్టెప్ బై స్టెప్‌గా వివరించారు.


సివిల్స్ క్రాక్ చేయడం అనేది ఎంతో మందికి కల. అందుకోసం లక్షల మంది అహర్నిశలు శ్రమించి ప్రిపేర్ అవుతారు. కానీ అదృష్టం మాత్రం కొందరినే వరిస్తుంది. అలా ఈ సారి జరిగిన సివిల్స్ పరీక్షల్లో మొత్తం దాదాపు 1009 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వారిలో తెలుగువారు కూడా చాలా మందే ఉన్నారు. కాగా ఈ విజేతల్లో 200 మంది అభ్యర్థులు తెలంగాణ అదనపు డీజీపీ మహేష్‌భగవత్‌ శిష్యులు కావడం విశేషం. ఆయన నేరుగా వారికి పాఠాలు చెప్పలేదు కానీ.. వాట్సాప్ ద్వారా వారికి అనేక మెళవకువలను నేర్పారు. పరీక్ష రాయడం దగ్గర నుంచి ఇంటర్వ్యూని ఎలా ఎదుర్కోవాలి అనే అంశం వరకు వారికి స్టెప్ బై స్టెప్‌గా వివరించారు. మొత్తానికి దేశానికి 200 మంది సివిల్ సర్వెంట్స్‌ను అందించారు. దేశంలోని బడాబడా ఇన్‌ట్యూట్‌ సైతం కలలు కనే ఈ అచీవ్‌మెంట్‌ను ఆయన ఒక్కరే సాధించారు.

అంతేకాదు.. సివిల్స్‌లో టాప్ 100 ర్యాంకులు సాధించిన వారిలో కూడా ఈ శిష్యులు చాలా మందే ఉన్నారు. చాలా మంది అంటే ఒక ఐదుగురు ఆరుగురు కాదు.. మొత్తం 21 మంది ఈ శిష్యులే. ఈయన దగ్గర మెళకువలు నేర్చుకునే సివిల్స్‌ క్రాక్ చేశారు. వారెవరంటే.. హర్షితగోయల్‌ (2వ ర్యాంకు), ఆకాశ్‌గార్గ్‌ (5), ఆయుషిబన్సాల్‌ (7), మాధవ్‌అగర్వాల్‌ (16), సౌమ్యమిశ్రా (18), త్రిలోక్‌సింగ్‌ (20), దివ్యాంక్‌గుప్తా (21), శివాంశ్‌జగడే (26), డా.ఇరమ్‌చౌదరి (40), ముదితబన్సాల్‌ (44), రావుల జైసింహారెడ్డి (46), నందన (47), సౌరవ్‌సిన్హా (49), లావణ్యగౌర్‌ (57), విద్యాంశుశేఖర్‌ఝా (59), చింతకింద శ్రవణ్‌కుమార్‌ (62), అదితి సంజయ్‌ (63), సాయిచైతన్య జాదవ్‌ (68), అభిషేక్‌సింగ్‌ (78), వివేక్‌షిండే (93), తేజస్వి దేశ్‌పాండే (99) ఉన్నారు.

ఈ విషయాన్ని మహేష్‌భగవత్‌ వెల్లడించారు. సివిల్స్ క్రాక్ చేయడంలో తమకు కీలక సూచనలు చేసిన మహేష్‌భగవత్‌ను పలువురు అభ్యర్థులు కలిశారు. ఈ సందర్భంగా వారిని కలిసన మహేష్.. తన దగ్గర నేర్చుకున్న వారు సివిల్స్ క్రాక్ చేయడం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన 68వ ర్యాంకర్‌ సాయిచైతన్య తన తండ్రి గోవిందరావుతో పాటు వచ్చి మహేశ్‌భగవత్‌ను కలిశారు. మహేశ్‌భగవత్‌ ఆదిలాబాద్‌ ఎస్పీగా పనిచేసిన సమయంలో గోవిందరావు ఆయన వద్ద కానిస్టేబుల్‌గా పనిచేశారు.

అయితే ఏమీ ఆశించకుండా సమాజానికి మంచి అధికారులను ఇవ్వాలన్న లక్ష్యంతో సివిల్స్ అభ్యర్థులకు ఆయన అందించిన ఈ సేవ అద్వితీయమైనదంటూ పలువురు ఆయనను కొనియాడుతున్నారు. సమాజాన్ని చక్కదిద్దే వృత్తిలో ఉన్న ఆయన.. సమాజం పట్ల ఉన్న బాధ్యతతో మరింత గొప్ప సమాజ నిర్మాణానికి పూనుకుని.. దానిని సివిల్ సర్వెంట్స్‌ను నిర్మించడం ద్వారా చేయడం గొప్ప ఆలోచనని అంటున్నారు. ఆయన సేవలు మరువలేనివని, దేశానికి గొప్ప సేవ చేశారని ఆయన సహోద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదనపు డీజీపీ అంటేనే అనేక బాధ్యతలు.. కనీసం ఇతర విషయాల గురించి తెలుసుకునే సమయం కూడా ఉండదు.. అలాంటి బిజీ లైఫ్‌లో కూడా మెరుగైన సమాజాన్ని నిర్మించాలన్న తపనతో సివిల్స్ అభ్యర్థులకు సహాయం చేయాలని ఆయన నిశ్చయించుకున్నారు, ఈ క్రమంలో ఎదురైన ఇబ్బందులను ఛాలెంజింగ్‌గా తీసుకుని తనకు తోచిన చేయూతనందించారు.. ఆయన చేసిన కృషి, పడిన కష్టానికి ఇప్పుడు 200 మంది సివిల్ సర్వెంట్ల రూపంలో ఫలితం దక్కింది.

Read More
Next Story